రాజస్తాన్ లో 700 ఎకరాలలో విస్తరించి ఉన్నచిత్తోర్ ఘడ్, బ్రహ్మాండమైన కోటలు, దేవాలయాలు, బురుజులు, రాజప్రాసాదాలకు ప్రసిద్ది చెందింది.
పురాణాలలో చిత్తోర్ ఘడ్
ఈ నగర యోధుల వీర గాధలకు భారతదేశ చరిత్రలో ఒక గౌరవ నీయ స్థాన౦ ఉంది. ఒక జానపద కథ ప్రకారం మహాభారతంలోని పాండవులలో ముఖ్యుడైన భీముడు, ఒక సాధువు నుండి అమరత్వరహస్యాలను తెలుసుకొనేందుకు ఈ ప్రాంతానికి వచ్చాడు. కాని అసహనం కారణంగా అతని ప్రయత్నం సఫలం కాలేదు. చిరాకు, కోపంతో అతను భూమిపై తన కాలితో బలంగా మోదడం వలన ఈ ప్రాంతంలో ఏర్పడిన ఒక నీటి జలాశయాన్ని ‘బీం లాట్’ అంటారు.
చిత్తోర్ ఘడ్, పరిసరాలు
180 మీ. ఎత్తులో ఉన్న చిత్తోర్ ఘడ్ కోట ఈ నగర ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఈ కోట లో ఉన్న వివిధ కట్టడాలలో ప్రతి నిర్మాణం వెనుక ఏదో ఒక కథ ఉంది. అందమైన చారిత్రిక ప్రాంత౦ ఫతెహ్ ప్రకాష్ ప్యాలెస్ ను మహారాణ ఫతెహ్ సింగ్ నిర్మించాడు. ఈ భవనం లోపల పురాతన చరిత్రను వర్ణించే గణేశుని అందమైన విగ్రహం, ఒక పెద్ద ఫౌంటెన్, చిత్రాలు వేసిన గచ్చు ఉన్నాయి.
ఇవే కాక, ఈ ప్రాంతంలో సంవరియజి దేవాలయం, తుల్జ భావని దేవాలయం, జోగినియ మాత దేవాలయం, మాత్రి కుండియ దేవాలయం వంటి అనేక ధార్మిక కేంద్రాలు ఉన్నాయి. 50 చ. కి. ల లో విస్తరించి ఉన్న బస్సి అభయారణ్యం చూసి పర్యాటకులు ప్రకృతిని పూర్తిగా ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా, వృక్ష జంతు సంపద కల్గిన సీతామాత అభయారణ్యం, భైన్సరోర్ ఘడ్ వన్య ప్రాణి అభయారణ్యం కూడా ప్రఖ్యాతి గాంచాయి. ఈ నగరాన్ని, దాని సంస్కృతిని ఇంకా బాగా తెల్సుకోవాలనుకొనే పర్యాటకులు అందమైన కళాకృతులు, అరుదైన చిత్రాలు, శిల్పాలు, పురాతనకాలపు గోడ పై వేసిన చిత్రాలు ఉన్న పురావస్తు ప్రదర్శనశాలను సందర్శించవచ్చు. గుప్తుల, మౌర్యుల వంశాలకు చెందిన కొన్ని కళాఖండాలను ఈ మ్యూజియం లో చూడవచ్చు.
సమయం అనుకూలిస్తే, పర్యాటకులు ప్రస్తుతం హోటల్ గా మారిన బిజైపూర్లో ఉన్న ఒక పురాతన కోటను సందర్శించవచ్చు. ప్రతాప్ ఘడ్ దగ్గరలోని 16 వ శతాబ్దపు దేవ్ ఘడ్ కోట కూడా ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ ప్రాంతం అనేక దేవాలయాలు, రాజప్రాసాదాలకు ప్రసిద్ది.
చిత్తోర్ ఘడ్ కు 90 కిలోమీటర్ల దూరంలో వున్న చిన్న పట్టణ౦ మేనల్. ఈ ప్రాంతపు రమణీయత, ఇక్కడి దేవాలయాల నిర్మాణశైలి వలన ఈ ప్రాంతాన్ని చిన్న ఖజురహో అంటారు.
ఇక్కడ తవ్వకాలలో బయట పడిన అనేక బౌద్ధ దేవాలయాలలో 12 వ శతాబ్దపు దేవాలయం ప్రముఖమైనది. దీని రమణీయత వలన ఈ ప్రాంతం విహారయాత్రా స్థలంగా ప్రసిద్ది చెందింది. దీనితో బాటుగా, గోవు నోటిని పోలి ఉండటం వల్ల ఆ పేరు వచ్చిన గోముఖ్ కుండ్ ను పర్యాటకులు దర్శించవచ్చు. ఈ ఆనకట్ట సమీపంలో రాణి బిందర్ సొరంగ మార్గం కూడా ఈ నగర ప్రముఖ ఆకర్షణ.
చిత్తోర్ ఘర్ ను చేరడం
90 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారానా ప్రతాప్ విమానాశ్రయం అని కూడా పిలువబడే దబోక్ విమానాశ్రయం చిత్తోర్ ఘడ్ చేరడానికి దగ్గరి మార్గ౦. భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలనుండి ఇక్కడకు విమానాలు ఉన్నాయి. చిత్తోర్ ఘడ్ రైల్వే స్టేషన్ నుండి అజ్మీర్, జై పూర్, ఉదయ పూర్, కోట , న్యూ ఢిల్లీ ల వంటి ముఖ్య నగరాలకు రైళ్ళు ఉన్నాయి. చక్కటి రోడ్డు సౌకర్యం తో బాటుగా ఈ ప్రాంతానికి చేరడానికి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు కూడా ఉన్నాయి.
చిత్తోర్ ఘడ్ లో వాతావరణం
వేసవి కాలంలో వాతావరణం ఎంతో వేడిగా ఉండి, గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీలుగా నమోదౌతుంది. వర్షాకాలంలో అడపాదడపా వర్షాలు కురుస్తూ తేమతో కూడిన గాలి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో సగటున 60 నుండి 80 సెంటిమీటర్ల వర్షపాతం ఉంటుంది.ఉష్ణోగ్రతలు 11 నుండి 28 డిగ్రీల మధ్య ఉండే వర్షాకాలం ఈ ప్రాంత సందర్శనకు అనువైనదిగా పరిగణించబడుతుంది.