దేశం నలుమూలలకు చెందిన దుకాణాలను కలిగి వుండే రద్దీ బజారు డిల్లీ లోని బాబా ఖరక్ సింగ్ మార్గ్. ఈ వీధి లోని రాష్ట్ర దుకాణాల సముదాయంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన కళాకృతులు, ప్రత్యెక ఉత్పత్తుల మిశ్రమ ప్రదర్శన వుంటుంది.
జూన్ అనే కాశ్మీరీ దుకాణం అందమైన శాలువాల శ్రేణికి ప్రసిద్ది. రాగి ప్రతిమలు, దీపాలు సేకరించే వారికి పూంపుహార్ అనే తమిళనాడు దుకాణం వుంది. పట్టు వస్త్రాలు ప్రేమించే వారు కావేరి అనే కర్నాటక దుకాణం సందర్శించవచ్చు. ఆమ్రపాలి అనే బీహారి దుకాణంలో అందమైన మధుబని చిత్రాలు దొరుకుతాయి. రాజస్థానీ అభిరుచి కల వారు రాజస్థాలి సందర్శించవచ్చు.
అచ్చు వేసిన నేత బట్టలకు, సూక్ష్మ చిత్రాలు, నగల కోసమైతే గుజరాత్ వారి గుర్జరి సందర్శించాలి. పశ్చిమ బెంగాల్ వారి మంజూషలో పట్టు, నేత చీరలతో పాటు తాజా తేయాకు కూడా దొరుకుతుంది. చెక్క శిల్పాల కోసం అయితే మధ్య ప్రదేశ్ వారి మృగనయని కి వెళ్ళాలి. త్రిపుర రాష్ట్రం వారి మూడంతస్తుల పుర్బాష దుకాణంలో వెదురు, కర్రలతో తయారైన గృహోపకరణాలు దొరుకుతాయి.
ఈ దుకాణాల సముదాయానికి దగ్గరలో వున్న రాజీవ్ గాంధీ చేతిపనుల భవనం కూడా చూడదగ్గ ప్రదేశం. ఇక్కడ మీరు పుస్తకాలు, కాగితం ఉత్పత్తులు, గ్రామీణ కళాకృతులు లాంటివి కొనవచ్చు.
బాబా ఖరక్ సింగ్ మార్గ్ లోని హనుమాన్ మందిరం కూడా ఇక్కడ చూడదగిన ప్రదేశం. ఇది దేశంలోని అతి పురాతన హనుమంతుడి దేవాలయాల్లో ఒకటి. ఇక్కడి ప్రధాన దైవం యువ హనుమంతుడు. ఈ గుడి మంగళ, శని వారాల్లో బాగా రద్దీగా వుంటుంది.