దక్షిణ డిల్లీలో చత్తర్పూర్ లో ఉన్న శ్రీ ఆద్య కాత్యాయని శక్తి పీఠ మందిరం, లేదా చత్తర్పూర్ మందిరం భారతదేశ౦ లోని అతిపెద్ద మందిరాల సమూహంలో రెండవది. ఈ ఆలయంలో దుర్గా మాత ఆరవ అవతారమైన కాత్యాయని దేవి విగ్రహం ఉంది. ఇతర హిందూ ఆలయాల లాగా కాకుండా, అన్ని కులాల, మతాలకు చెందిన భక్తులు ఈ ఆలయానికి రావచ్చు.
ఈ ఆలయాన్ని దుర్గా మాతకు అత్యంత భక్తుడైన స్వామి నాగ్పాల్ మహారాజు నిర్మించాడు. ఈ ఆలయం తెల్లని పాలరాయితో, చుట్టూ అందమైన తోటలతో నిర్మించబడింది. ఈ ఆలయ౦ దక్షిణ భారత శిల్పకళా శైలితో చెక్కబడింది. అంతూదరీ లేని నిర్మాణాలతో ఈ కట్టడం చూడ్డానికి చాలా అద్భుతంగా వుంటుంది.
ఈ దేవాలయ సముదాయం 70 ఎకరాల విస్తీర్ణంలో మూడు సముదాయాలలో 20 చిన్నాచిన్నా పెద్ద గుళ్ళతో వుంటుంది. ఈ సముదాయంలోని శివ గౌరీ నాగేశ్వర్ మందిరం ఆవరణలో స్వామి నాగాపాల్ మహారాజ్ సమాధి మందిరం కూడా నిర్మించబడి వుంది.
గుడి సముదాయం ప్రవేశంలో వుండే పెద్ద చెట్టు కొమ్మలకు పవిత్ర దారాలు కట్టబడి వుండడం గమనించవచ్చు. వారి ఆకాంక్షలు తీరడం కోసం భక్తులు ఈ చెట్టుకి దారాలు, గాజులు కడతారు.ఈ గుడిలో రెండు ప్రధాన ఆలయాలు వున్నాయి. దుర్గా దేవి అవతారం అయిన మహా గౌరీ ఆలయం నిత్యం భక్తుల కోసం తెరిచే వుంటుంది. ఇంకోటి కాత్యాయని దేవి ఆలయం – ఇది మాత్రం ప్రతి మాసంలో అష్టమి నాడు, నవరాత్రి ఉత్సవాలలోను తెరిచి వుంటుంది.
కాత్యాయని దేవి పెద్ద బంగారు విగ్రహం ప్రపంచం నలు మూలల నుంచి భక్తులను ఆకర్షిస్తుంది. మెరిసే బట్టలతో, ధగధగ లాడే నగలతో, పెద్ద పూల దండలతో ఈ విగ్రహం అలరారుతూ వుంటుంది.ఈ దేవాలయ సముదాయంలో శివుడు, వినాయకుడు, హనుమంతుడు, రాధ కృష్ణులు, రాముడి గుళ్ళు కూడా వున్నాయి. ఈ గుళ్ళు అన్నీ దక్షిణ, ఉత్తర భారత నిర్మాణ శైలుల మిశ్రమ శైలిలో నిర్మించబడ్డాయి.