పాత కోట ( పురానా ఖిల్లా) ఢిల్లీ లోని అనేక ఆసక్తికరమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది ఢిల్లీ కోటలన్నింటిలోను అతి పురాతనమైనదే కాకుండా ఢిల్లీ అంతటిలోనూ అతి ప్రాచీనమైన కట్టడం గా ప్రసిద్దికెక్కింది. ఇంద్రప్రస్థ అనే పౌరాణిక ప్రాంతం లో ఉందిది.
పురాణానుసారం ఈ పురాతన కోట మహాభారత కాలానికి ముందే ( అంటే సుమారు 5000 సంవత్సరాల పూర్వం) నిర్మించబడి, యమునా నదీ తీరంలో పాండవులచే కనుగొనబడింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఇంద్రపథ్ అనే కుగ్రామం ఇదే పాత కోట గోడల మధ్య ఉండి ఉన్నదని ధృవీకరించబడింది. హుమాయూన్ రాజధాని దిన్ పనా ఇక్కడే ఉండేది అని, భారతదేశ మొట్టమొదటి ఆఫ్ఘన్ చక్రవర్తి షేర్ షా సూరి దీన్నే పునరుద్ధరించి షేర్ ఘడ్ అని పిలుచుకున్నాడని నమ్మిక. హేము గా సుపరిచితుడుడైన హిందూ రాజు సామ్రాట్ హేమ చంద్ర విక్రమాదిత్య 1556 లో అక్బర్ సైన్యాలను ఓడించి ఢిల్లీ ఆగ్రా చేజిక్కించుకుని ఈ కోట లోనే పట్టాభిషిక్తడు అయ్యాడు. ఇతను భారతదేశాన్ని పరిపాలించిన ఆఖరి హిందూ చక్రవర్తి.
అయితే ఈ కోట ఇక్కడ నుంచి పరిపాలన సాగించిన ముగ్గురు చక్రవర్తులకీ – హుమాయూన్, షేర్ షా, హేమ చంద్ర – దురదృష్టము తెచ్చిపెట్టిందని నమ్ముతారు. పురానా ఖిల్లా సముదాయానికి చుట్టూ- షేర్ షా నిర్మిత ఖిల్లా-ఎ-కుహ్న మసీదు, షేర్ మండల్ అని పిలవబడే రెండు అంతస్తుల అష్టభుజాకార ఎర్రని ఇసుక రాతి గోపురం, కైరుల్ మంజిల్ అని పిలవబడే రాజా అక్బర్ పెంపుడు తల్లి మహం అంగ నిర్మించిన ఒక మసీదు, లాల్ దర్వాజా అని పిలవబడే షేర్ షా దక్షిణ ప్రవేశద్వారం - లాంటి ఎన్నెన్నో అద్భుతమైన స్మారక ప్రదేశాలు ఉన్నాయి.
కోట యొక్క మందపాటి బలమైన గోడలు ఇరువైపులా బురుజులు తో కూడిన మూడు ముఖద్వారాలు కలిగి ఉన్నాయి. ఈ గోడలు 18 మీటర్ల ఎత్తుతో, 1.5 కి.మీ మేర ఉండి, పశ్చిమాన బడా దర్వాజా (పెద్ద గేటు) , దక్షిణాన హుమాయూన్ ద్వారం, నిషిద్ధ ద్వారం అనే పేరు గల తలాకి ద్వారం గలవు. ఈ మూడు ముఖద్వారాలూ భారీ రెండు అంతస్తుల నిర్మాణాలు. ఇరు వైపులా బురుజు గోపురాలు కలిగి, వసారాలు లేదా ఝారోకాలు, స్తంభాలతో కూడిన మంటపాలు ఉన్నాయి.
ఈనాడు పురానా ఖిల్లా ప్రతి సాయంత్రం జరిగే “ఢిల్లీ చరిత్ర” ధ్వని మరియు కాంతి ప్రదర్శనకు వేదికగా పనిచేస్తుంది.