గోపాల్ ఘడ్ హిల్ గుహఘర్ లోని అంజన్ వేల్ గ్రామంలో కలదు. ఎంతో అందమైనది, చుట్టుపట్ల ప్రదేశాలు ఆకర్షణీయంగా ఉంటాయి. అంజన్ వేల్ కోట కొండపై ఉంటుంది. దీనిని సుమారు 16వ శతాబ్దంలో బీజపూర్ పాలకులు నిర్మించారు. ఈ కోటను తర్వాతి కాలంలో శివాజీ క్రీ. శ. 1660 లో స్వాధీన పరచుకొన్నాడు. శివాజీ మరణం తర్వాత 1680 సంవత్సరంలో ఈ కోటను సిద్ధి ఖైరత్ ఖాన్ స్వాధీనం చేసుకోగా అతని నుండి 1744 సంవత్సరంలో తులోజీ అంగ్రే దానిని స్వాధీనం చేసుకున్నాడు. అయితే, 1818 సంవత్సరంలో మరాఠా సామ్రాజ్యం కూలిపోవటం మొదలుపెట్టిన తర్వాత బ్రిటీష్ వారు ఈ కోటను వశ పరచుకొన్నారు. భారత దేశానికి 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చేటంతవరకు ఈ కోట బ్రిటీష్ వారి ఆధీనంలోనే ఉంది. ఈ కోట సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. రెండు భాగాలుగా దీనిని విభజించారు. కింది భాగాన్ని పడ్కోట అని పై భాగాన్ని బాలే కోట అని అంటారు. ఈ కోట బలమైన, వెడల్పు అయిన గోడలు కలిగి శత్రువులనుండి లోపలి వారిని కాపాడేది. కొండపైగల ఈ కోట పర్యాటకులకు ట్రెక్కింగ్ అవకాశాలు కల్పిస్తుంది. ఆసక్తి కలవారు, సాహస ట్రెక్కర్లు ఈ కోటను అధిరోహించటం ఒక సవాలుగా స్వీకరిస్తారు. మార్గం పొడవునా అనేక ప్రకృతి అందచందాలు ఆస్వాదించగలుగుతారు.