నగరం నడిబొడ్డున వుండే జైసల్మేర్ కోట ను జైసల్మేర్ కు గర్వ కారణంగా భావిస్తారు. పసుపు రంగు ఇసుకరాయి తో నిర్మించిన ఈ కోట సూర్యాస్తమయం లో బంగారంలా మెరిసిపోవడంతో దీన్ని సోనార్ ఖిల్లా లేదా బంగారు కోట అని కూడా అంటారు. త్రికురా కొండ మీద 1156లో భాటి రాజపుత్ర రాజు జైసల్ దీన్ని నిర్మించాడు. జైసల్మేర్ కోటలో చాల అందమైన భవంతులు, దేవాలయాలు, సైనికులు, వ్యాపారుల నివాస భవనాల సముదాయాలు వున్నాయి. ఈ కోట చుట్టూ 30అడుగుల ఎత్తైన గోడ వుంది. 99 బురుజులు వున్న పెద్ద కోట ఇది.
ప్రస్తుతం నగరంలోని పావు భాగం జనాభా ఇక్కడే వుంటున్నారు. కోట సముదాయం లోని అసంఖ్యాకమైన బావులే వీళ్ళ నీటి అవసరాలకు ప్రధాన వనరు. ఈ కోట నిర్మాణం రాజపుత్ర, ముఘలాయి శైలుల ఆదర్శ మిశ్రమాన్ని సూచిస్తుంది. రాజస్తాన్ లోని ఇతర కోటల్లాగే, దీనికి కూడా అఖాయి పోల్, హవా పోల్, సూరజ్ పోల్, గణేష్ పోల్ అనే నాలుగు ప్రవేశ ద్వారాలున్నాయి. అన్ని ద్వారాల్లోకీ అఖాయి పోల్ తన అధ్బుత నిర్మాణ శైలికి ప్రసిద్ది పొందింది. 1156 లో నిర్మించిన ఈ ద్వార౦ రాజ కుటుంబీకులు, ప్రత్యెక సందర్శకులకు ప్రత్యేకంగా వాడేవారు.ఈ కోటను చేరుకోవడానికి జైసల్మేర్ నుంచి ఆటో లేదా రిక్షా లో వెళ్ళవచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా సందర్శన వేళలు.