రాజస్థాన్ లోని ఆగ్నేయ భాగం లో హడాల భూమి గా పిలువబడే హడోటీ (హడావటి) లో ఝలావర్ వుంది. ఈ జిల్లా 6928 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి కోటా డివిజన్ లో భాగమై వుంది.బ్రిజ్ నగర్ గా పిలువబడే ఝలావర్ ఈ జిల్లాకు అధికార కేంద్రం.ఈ జిల్లాకు ఈశాన్యంలో బరన్ జిల్లా నైరుతి లో కోటా జిల్లా వున్నాయి.
చరిత్ర వీక్షణం !
చారిత్రకంగా కోటా జిల్లాకు అప్పటి దివాన్ గా పని చేసిన ఝాలా జాలిం సింగ్ 1791లో ఝాలావర్ నగరాన్ని స్థాపించాడు. మరాఠా దాడి నుంచి ఈ ప్రాంతాన్ని కాపాడేందుకు దీన్ని ఒక సైనిక స్థావరంగా అభివృద్ది చేయాలని ఆయన సంకల్పించాడు. తరువాత బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని అతని మనుమడు ఝాల మదన్ సింగ్ కు అప్పజెప్పారు. ఝలావర్ కు మొదటి పాలకుడుగా ఆయన ఈ ప్రాంతాన్ని 1838 నుంచి 1845 దాకా పాలించాడు.
ఝలావర్ లో స్థల సందర్శన
ఝలావర్ సందర్శించే యాత్రికులు చారిత్రిక ఝలావర్ కోటను కూడా చూడవచ్చు. ఈ కోటను ఘర్ పేలస్ అనే పేరుతొ కూడా పిలుస్తారు. ఝలావర్ లో 100అడుగుల ఎత్తున సూర్య భగవానుడి దేవాలయం వుంది. ఈ గుళ్ళో అద్భుతంగా చెక్కిన శిల్పాలు చూడవచ్చు. చంద్రభాగా నది వెంట వున్న ఈ గుడికి అన్ని వైపులా గోడలు వున్నాయి.
6 నించి 14 వ శతాబ్దం మధ్య నిర్మించిన అనేక ఆలయాలు చంద్రభాగా నదీతీరాన ఉన్నాయి. ఆకాలం నాటి కళానైపుణ్యాన్నిఈ దేవాలయాలు ప్రతిబింబిస్తాయి. దేవాలయాల అన్నిటిలోకీ, పద్మనాధ దేవాలయం, శ్రీ ద్వారకాదీష్ దేవాలయమ్, శాంతినాద్ జైన దేవాలయం అత్యంత ప్రసిద్ది చెందినవి.
స్థానికుల సృజనాత్మక నైపుణ్యాలకు అద్దంపట్టే సంక్లిష్ట నమూనాలున్న బౌద్ధ గుహలు, స్తూపాలు కూడా ఆశక్తి గల యాత్రికులు చూడవచ్చు. ఇవేకాక, యాత్రికులు భీమ్ సాగర్ డాం ను, ఉన్హల్ లోని జైన శ్వేతాంబర నాగేశ్వర పార్శ్వనాధ దేవాలయాన్ని, ప్రభుత్వ మ్యూజియాన్ని కూడా చూడవచ్చు. ఈ మ్యూజియంలో పాత నాణాలు, శాసనాలు, శిధిలమైన పురాతన విగ్రహాలు లాంటి ముఖ్యమైన వస్తువులు చూడవచ్చు. మాస్కోలోని భారతీయ ఉత్సవంలో ప్రదర్శించబడిన అర్ధనారీశ్వర నటరాజ విగ్రహం కూడా ఇక్కడ ఉంది.
గర్గాన్ కోట, అతిశయ జైన దేవాలయాలు, మనోహర్ థానా కోట, గంగ్ధర్ కోట ఝలావర్ పరిసరాల్లోని ఇతర ఆసక్తికర సందర్శనీయ స్థలాలు.
రవాణా సౌకర్యం :
ఈ జిల్లా వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. 82 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటా, ఝలావర్ కి సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయం భారతదేశం లోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది. రామ్ గంజ్ మండి రైల్వే స్టేషన్ ఝలావర్ కు సమీప రైల్వే స్టేషన్. పర్యాటకులు విమానాశ్రయం, రైల్వే స్టేషన్ నుంచి ఝలావర్ కు టాక్సీ లు, కాబ్ ల ద్వారా చేరుకోవచ్చు. ఈ జిల్లాకు జైపూర్, కోటా, బుంది వంటి దగ్గర నగరాల నుండి ప్రైవేట్, ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉన్నాయి.
వాతావరణం
వేసవిలో 27 డిగ్రీలు , 42డిగ్రీల మధ్య ఉండే ఉష్ణోగ్రత వల్ల ఇక్కడ తీవ్రమైన వేడి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఇక్కడికి రాకపోవడం మంచిది. వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయి సగటున 30 డిగ్రీల వద్ద కొనసాగుతాయి. శీతాకాలంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 25 డిగ్రీలు 10 డిగ్రీలుగా నమోదవుతాయి.