హిమాచల్ ప్రదేశ్ లోని కీలాంగ్ నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో వున్న పురాతన గోమపా – కార్దంగ్ విహారం. సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తున వున్న ఈ గోమపా భాగా నదీ తీరంలో వుంది. 900 ఏళ్ళ నాటి ఈ విహారం బౌద్ధం లోని ద్రుక్పా కాగ్యుద్ శాఖకు చెందినది. 12 వ శతాబ్దంలో నిర్మించిన ఈ విహారంలో ఒక పాత గ్రంధాలయం వుంది – ఇది దేశంలోనే అతి పెద్ద బౌద్ధ గ్రంధాలయంగా పేరొందింది. ఈ గ్రంధాలయంలో భోటియా లేదా షేర్పా భాషలో రాసిన కాన్గ్యూర్, తాన్గ్యూర్ గ్రంధాలు వున్నాయి. ఈ విహారంలో తాంకా చిత్రాలు, వీణ, మృదంగం, కొమ్ము బూరలు లాంటి సంగీత పరికరాలు, కొన్ని పురాతన ఆయుధాలు వున్నాయి. ఈ గోమపా ను 1912 లో లామా నోర్బూ రింపోచే పునరుద్ధరించారు.
ఈ గోమపా లోని మొదటి గదిలో లామా నోర్బూ కు చెందిన కపాలం, అస్థికలు ఉంచారు. పద్మసంభవుడు, తారాదేవి విగ్రహాలు కూడా ఇక్కడ చూడవచ్చు. ప్రార్ధనా మందిరంగా పిలువబడే రెండో గదిలో పదకొండు శిరస్సులు వున్న అవలోకితెశ్వరుని విగ్రహం వుంది. మూడో గదిలో ఆరు అడుగుల ఎత్తున్న ప్రార్ధనా చక్రం మధ్యలో కంచు గంట వుంది. ఈ విహారంలో వుండే సన్యాసులు, సన్యాసినులకు సమాన హక్కులు వుంటాయి. వారు కుటుంబ జీవనం కూడా కొనసాగించవచ్చు. సన్యాసులు వేసవిలో కుటుంబాలతో గడిపి శీతాకాలంలో తిరిగి వస్తారు. పెద్ద ప్రార్ధనా గుండిగ ఉంచిన ఈ విహారంలో కాగితం మీద పదిలక్షల సార్లు రాసిన షడక్షరీ మంత్రం ‘ఓం మణిపద్మే హుం’ కూడా వుంది.