తిరువనంతపురం జిల్లా గుండా ప్రవహించే ఈ వెల్లాయని సరస్సు ఈ జిల్లాలోని అతి పెద్ద మంచినీటి సరస్సు. స్థానికులు దీన్ని ‘వెల్లాయని కాయల్’ అని వ్యవహరిస్తారు. తిరువనంతపురం ప్రధాన బస్సు కూడలి నుంచి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో వుండడం వల్ల ఈ సరస్సు స్థానికులు, యాత్రికులు విరివిగా సందర్శించే విహార కేంద్రాల్లో ఒకటి. మీరు కోవలం వెళ్తే ఒక్కసారైనా ఈ సరస్సును చూడాల్సిందే.తాజాగా ఉండే స్వచ్చమైన నీలిరంగు నీళ్ళతో ఈ సరస్సు చాలా అందంగా కనపడుతుంది. ఈ సరస్సు మీద వెన్నెల పడగానే ఈ ప్రాంతం అంతా స్వర్గతుల్యంగా మారిపోతుంది. ఈ దృశ్యాన్ని చూడడానికి యాత్రికులు రాత్రిదాకా వేచి ఉంటారు. ఈ సరస్సులో ప్రతి ఏటా ఓనం పండుగ సందర్భంగా పడవ పందాలు జరుగుతాయి. వీటిని చూడడానికి చాలామంది వస్తారు. ఓనం అపుడు మీరు కోవలం లో గానీ చుట్టుపక్కల గానీ ఉంటె తప్పకుండా పడవల పందాలు చూడండి.