మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో కల మహాబలేశ్వర్ ఒక ప్రసిద్ధి చెందిన పర్వత ప్రాంతం. ప్రసిద్ధి చెందిన పశ్చిమ కనుమలలోకల కొద్దిపాటి అందమైన ప్రదేశాలలో మహాబలేశ్వర్ ఒకటి. మహాబలేశ్వర్ పట్టణాన్ని బ్రిటీష్ పాలకులు ఒక వేసవి విడిదిగా ఉపయోగించి ఆనందించేవారు. మహాబలేశ్వర అంటే ‘గొప్ప బలంకల భగవంతుడని’ అర్ధం చెప్పవచ్చు. దీనినే ‘అయిదు నదుల ప్రదేశం ’ అనే పేరుతో కూడా పిలుస్తారు. సరిగ్గా ఈ ప్రదేశంలో, వెనన్న, గాయత్రి, సావిత్రి, కోయినా మరియు క్రిష్ణ నదులు పుడతాయి.
ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి సుమారు 4,718 అడుగుల ఎత్తున కలదు. 150 కి.మీ. ల విస్తీర్ణం కలిగి ఉంటుంది. నగర జీవనంలో ఒత్తిడి జీవితాలను అనుభవిస్తున్నవారికి ఈ ప్రాంత ప్రశాంతత ఎంతో హాయినిస్తుంది.
మహా బలేశ్వర్ చరిత్ర పురాతన లేదా ప్రాచీన మహాబలేశ్వర్ పట్టణాన్ని రాజు సింఘన్ కనుక్కొన్నాడు. ఆ వెంటనే ఆ ప్రాంతంలో మహాబలేశ్వర్ దేవాలయం నిర్మించాడు. 17వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని ఛత్రపతి శివాజి ఆక్రమించాడు. అక్కడి ప్రతాప్ ఘడ్ కోటను నిర్మించాడు. తర్వాతి కాలంలో మహాబలేశ్వర్ బ్రిటీష్ పాలకుల చేతులలోకి షుమారుగా 1819 సంవతత్సరంలో వెళ్ళింది. అప్పటినుండి దానిని మాల్కలం పేటగా పిలుస్తూ అభివృద్ధి చేశారు. ఎన్నో వింతలు మరియు మనోహర దృశ్యాలుమహాబలేశ్వర్ ప్రాంతం అద్భుత దృశ్యాలు అందిస్తుంది. ఈ ప్రాంతంలో షుమారు 30 వరకు చూడదగిన ప్రదేశాలు, అంశాలు ఉన్నాయి. లోయలు, అడవులు, జలపాతాలు, నదులు, వివిద రకాల మొక్కలు, జంతువులు కలిగి పర్యాటకులకు అద్భుత ఆనందం కలిగిస్తుంది. ఇక్కడకల సూర్యోదయ ప్రదేశం విల్సన్ పాయింట్ అత్యంత ఎత్తుగల ప్రదేశం.
దీని తర్వాతి స్ధానం కొన్నాట్ శిఖరం చేపడుతుంది. వీటిమీద నిలబడితే, ఈ ప్రాంతం అంతా ఎంతో చక్కగా చూడవచ్చు. అర్ధర్ సీటును అర్ధర్ మాలెట్ పేరు మీద పెట్టారు. ఇతను ఈ ప్రాంతంలో మొట్ట మొదటి ఇల్లు కట్టాడని చెపుతారు. ఎకో పాయింట్ లేదా ప్రతిధ్వనించే చోటు అనేది పిల్లలకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. గొంతు పెంచి పెద్దగా అరవటం చేస్తే అది ఆ కొండలనుండి ప్రతిధ్వనించి మీకు ఆనందం కలిగిస్తుంది.
ఎలిఫిన్ స్టోన్ పాయింట్, మర్జోరీ పాయింట్, క్యాసెల్ రాక్ వంటివి కూడా మహాబలేశ్వర్ లో తప్పక చూడాలి. ఇంకనూ చూడవలసిన ప్రదేశాలలో బాబింగ్టన్ పాయింట్, ఫలక్ ల్యాండ్ పాయింట్, కర్నాక్ పాయింట్ మరియు బాంబే పాయింట్ లు కలవు. ఇక్కడనుండి చుట్టుపట్ల ప్రాంతాలు బహు సుందరంగా కనపడతాయి. హిందువులకిష్టమైన శివాజీ మహారాజ్ నిర్మించిన అందమైన ప్రతాప్ ఘడ్ కోటను దర్శించటం అసలు మరువకండి.
మహాబలేశ్వర్ కొన్ని పురాతన దేవాలయాలను కూడా కలిగి ఉంది. వాటిలో పురాతన పట్టణంలోని మహాబలేశ్వర్ దేవాలయం ప్రసిద్ధి చెందినది. ఈ ప్రాంతంలో కల వెన్నా సరస్సు పర్యాటకులకు మరో ఆకర్షణ.
మహాబలేశ్వర్ లో పచ్చటి ప్రదేశాలు
మహాబలేశ్వర్ అడవులలో ఎన్నో రకాల అతి విలువైన ఔషధ మరియు ఆయుర్వేద మొక్కలు లభిస్తాయి. ఇక జంతువులను పరిశీలిస్తే, బుల్ బుల్, గుంట నక్కలు, జింకలు, అడవి దున్నలు, మొదలైనవి ఉంటాయి. మహా బలేశ్వర్ లోని వాతావరణం ఎంతో ఆరోగ్యకరమైనది. వ్యాధులనుండి ఉపశమనం పొందే రోగులకు ఈ ప్రాంతంలోని విశ్రాంతి, వారు అతి త్వరగా, మరింత మెరుగుగా వ్యాధులనుండి కోలుకొనేలా చేస్తుంది.
మహాబలేశ్వర్ గురించిన మరో ఆసక్తికర విషయమేమంటే, ఈ ప్రదేశం సుమారు 1800 సంవత్సరంలో చైనీయులకు, మలేశియా దేశాల వారికి ఒక చెరసాలగా ఉండేది. నేడు ఇక్కడ పండే స్ట్రా బెర్రీలు ప్రాచీన కాలంలో ఇక్కడి ఖైదీలు పండించేవారు. ఖైదీలు వెదురు బుట్టలు అల్లటం మరియు ఎర్రటి బంగాళ దుంపలు పండించటం కూడా చేసేవారు. మహాబలేశ్వర్ వెళ్ళేవారు అక్కడి మల్బరీ ఉత్పత్తులు, స్ట్రా బెర్రీలు రుచి చూడకుండా ఉండలేరు. అద్భుత రుచికల క్రీము స్ట్రాబెర్రీ ప్రతి ఒక్కరూ తప్పక తిని తీరాల్సిందే.
మహాబలేశ్వర్ ఒక పర్యాటక స్వర్గం మహాబలేశ్వర్ కు చక్కటి విమాన మార్గం, బస్ మార్గం మరియు రైలు సౌకర్యాలున్నాయి. విమానంపై చేరాలనుకునేవారు పూనా విమానాశ్రయంలో దిగి అక్కడినుండి క్యాబ్ ద్వారా మహాబలేశ్వర్ చేరవచ్చు. రైలు ప్రయాణం చేసేవారు సమీపంలోని వాధర్ స్టేషన్ లో దిగి కొండ ప్రాంతం చేరవచ్చు. లేదా మహారాష్ట్రలోని ముంబై, పూనే మొదలైన ప్రాంతాలవరైతే, రోడ్డు మార్గంలో ప్రయాణించవచ్చు. అందమైన రోడ్లతో మరువలేని ప్రయాణ అనుభూతి కలుగుతుంది. దేశంలోని ఇతర నగరాల వారు బస్ లపై కూడా చేరవచ్చు.
మహాబలేశ్వర్ ఒక పర్యాటక స్వర్గం. వారమంతా శ్రమించిన వారికి తమ పని ఒత్తిడినుండి విశ్రాంతి కావలసిందే. కనుక సూట్ కేసులు సర్దుకొని మహాబలేశ్వర్ కు ప్రయాణించండి. అక్కడి చల్లని వాతావరణం మీకు మరువలేని అనందానుభూతులను, చక్కని విశ్రాంతిని కలిగిస్తుంది. మీరు ఈ ప్రదేశాన్ని మొదలు సారి చూసే వారైతే, లేదా తరచుగా సందర్శించేవారైనప్పటికి ఈ ప్రదేశం ఎప్పటికపుడు మీకు ఆశ్చర్యాలను అందిస్తుంది. ఇంత అందమైన ఈ హిల్ స్టేషన్ చూడక పోవటం క్షమించరాని నేరంకూడా కాగలదు సుమా!