హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు నుంచి 45కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 1737 మీటర్ల ఎత్తున వున్న మణికరణ్ హిందువులకు, సిక్కులకు పవిత్ర తీర్థ క్షేత్రం. మణికరణ్ అనేది ఒక అభరణాన్ని సూచిస్తుంది. ఒక ఇతిహాసం ప్రకారం లయకారకుడైన శివుడి భార్య పార్వతి ఒక జలాశయంలో తన విలువైన ఆభరణాన్ని కోల్పోయింది. పార్వతి శివుడిని ఆ నగ వెతికి పెట్టమని అడుగగా, ఆయన ప్రమదగణాలను దాని కోసం వెదకమని ఆజ్ఞాపించాడు. వాళ్ళు దాన్ని వెదకలేకపోవడంతో ఆగ్రహోదగ్రుడై మూడో కన్ను తెరిచాడు. దీంతో భూమి మీద అల్లకల్లోలం చెలరేగి అసంఖ్యాకమైన రత్నాలు, మణులు ఏర్పడ్డాయి.
మణికరణ్ లోని శ్రీ గురు నానక్ దేవ్ జీ గురుద్వారా ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. సిక్కు మత స్థాపకుడు గురు నానక్ దేవ్, తన అయిదుగురు శిష్యులతో ఈ ప్రాంతాన్ని సందర్శించారని స్థానికుల విశ్వాసం. ఈ గురుద్వారా ఆవరణలో ఉన్న వేడి నీటి కుండం కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడి శివాలయం మరో ఆకర్షణ. 1905 లో రిక్టర్ స్కేల్ పై 8.0 నమోదైన భూకంపం తరువాత కూడా ఈ దేవాలయం కొద్దిగా ఒరిగి వుండడం దీని ప్రత్యేకత.
ఇక్కడి రామచంద్ర దేవాలయం, కులాంత పీఠం వంటి వాటికి కూడా మణికరణ్ హిందూ పర్యాటకులలో బాగా ప్రసిద్ది. హరీందర్ పర్వతం, పార్వతి నది, షోజా, మలానా, పర్యాటకులు పర్వతారోహణ చేసే ఖీర్ గంగా ఇక్కడి ఇతర ఆకర్షణల్లో కొన్ని.
మణికరణ్ వెళ్లాలనుకునే యాత్రికులు వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు వుండే వేసవి లో మణికరణ్ సందర్శనకు ఉత్తమ సమయం.