బీహార్ లోని మోతీహారీ పట్టణం అటు తీర్థ యాత్రికుల్లోను, ఇటు విహార యాత్రికుల్లోను కూడా బాగా ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం. పాట్నా నగరం నుంచి మోతీహారీ పట్టణం 156 కిలోమీటర్ల దూరంలో వుంది. పర్యాటకం ప్రధానంగా ఇక్కడి చారిత్రిక విలువల వల్లనే నడుస్తోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ తన మొదటి సత్యాగ్రహాన్ని మోతీహారీ నుంచే మొదలు పెట్టారు. ఇక్కడి చారిత్రిక విలువలు మోతీహారీ పర్యాటకాన్ని తప్పనిసరిగా చూసి తీరాల్సిన ప్రాంతంగా తయారు చేసాయి.
మోతీహారీలో ఒక స్కూల్ ఏర్పాటు చేయడానికి స్థానికులను ప్రేరేపించి మహాత్మా గాంధీ వారికి విద్యా గంధాన్ని కూడా అందేలా చేసారు. ఇక్కడ ఒక ప్రధానమైన బౌద్ధ స్తూపం ఉండడంతో మోతీహారీ బౌద్ధ యాత్రికులను ఇక్కడికి ఏడాది పొడవునా ఆకర్షిస్తూనే వుంటుంది. 104 అడుగుల ఎత్తు వుండే మోతీహారీ స్తూపంగా పిలిచే ఈ నిర్మాణం నిజంగానే చాలా అద్భుతమైన నిర్మాణం. ఒకప్పుడు వున్న ఇంతకన్నా పెద్ద స్తూపం అవశేషం ప్రస్తుత నిర్మాణమని చాలా మంది భావిస్తారు.
మోతీహారీ పర్యాటకంలో ప్రధానమైనది ఈ వూళ్ళో పుట్టిన ప్రఖ్యాత రచయిత జార్జి ఆర్వెల్ నివాస భవనం. మహాత్మా గాంధీ ప్రదర్శనశాల, శిలా స్థంభం కూడా మోతీహారీ పర్యాటకంలో ప్రత్యేకమైన ఆకర్షణలు. కాగితం మిల్లు, చక్కర కర్మాగారం, లాంటి చాలా చిన్న స్థాయి పరిశ్రమలకు మోతీహారీ పుట్టినిల్లు. మోతీహారీ చక్కర కర్మాగారం బీహార్ లోని పెద్ద మిల్లుల్లో ఒకటి. బాపూదాం మోతీహారీ గా పిలువబడే స్థానిక రైల్వే స్టేషన్ నుంచి అన్ని ప్రధాన నగరాలకు, దేశ రాజధానికి రైళ్ళు నడుస్తాయి.
విద్యా సంస్థలు, మిల్లులు, ఫాక్టరీలు, గాంధీ సంగ్రహాలయ, ఝీల్, గాంధీ మైదాన్, లాంటి చారిత్రిక ప్రదేశాలు, ప్రకృతి సహజమైన, హిమాలయ పర్వత సానువుల వెంట వుండే గ్రామీణ భూభాగం – వీటన్నిటి మిశ్రమం వల్ల మోతీహారీ నాణ్యమైన సమయం గడపడానికి తగిన మంచి పర్యాటక ప్రదేశం. లిచి పళ్ళు, చిలకడ దుంపల సాగుకు మొతీహారీ సేద్యం ప్రసిద్ది పొందింది. మోతీహారీ వాతావరణం వేసవిలో చాలా వేడిగా వుండి, శీతాకాలంలో చాలా చల్లగా వుంటుంది, మోతీహారీ చూడాలంటే వర్షాకాలం ముగిసిన వెంటనే వెళ్ళాలి – ఎందుకంటే అప్పుడు ప్రయాణాలకు అనువుగా వుంటుంది.