మైసూర్ పట్టణం కర్నాటక రాష్ట్రానికి సాంస్కృతిక రాజధాని. ఈ పట్టణం దక్షిణ భారతదేశంలోని ఒక సంపన్న మరియు రాచరిక ప్రాధాన్యతలుకల ఒక పట్టణం. సందర్శకులకు ఈ పట్టణం అనేక తొటలు, వారసత్వ భవనాలు, మరియు చల్లని నీడనిచ్చే రోడ్లతో ఎప్పటికి మరచిపోలేని అనుభూతి కలిగిస్తుంది. గంధపు చెక్కల సువాసనలు, గులాబీల గుబాళింపులు మైసూర్ పట్టణానికి గంధపు నగరం లేదా శాండల్ వుడ్ సిటీ అనే పేరు తెచ్చిపెట్టాయి. దీనినే ఐవరీ సిటీ అని, లేదా రాజప్రాసాదాల నగరం అని కూడా సాధారణ ప్రజలు అంటారు.మైసూర్ లో యోగా కేంద్రాలు అధికంగా కనపడే కారణంగా దీనిని యోగా సిటీ అని కూడా పిలుస్తారు.
మైసూర్ లో నిర్వహించే అష్టాంగ యోగ కార్యక్రమాలు దేశ విదేశాలనుండి యోగా ప్రియులను ఎంతో ఆకర్షిస్తాయి. ఇతిహాస, పురాణాల పరిశీలనలో మైసూర్ పట్టణం - దేవీ భాగవతం మేరకు ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని మహిషాసురుడనే రాక్షస రాజు పాలించాడు. అతని పేరుతోనే ‘మహిష - ఊరు’ అని నామకరణం చేయబడింది. కాలక్రమేణా అది మహిషూరు లేదా మైసూరుగా రూపొంది ఆంగ్లేయుల రాకతో అది మైసూర్ గా స్ధిరపడింది. ఈ రాక్షసుడు ఆ ప్రాంత ప్రజలు కొలిచే దేవీ మాత చాముండిచే చంపబడతాడు. దేవీ చాముండి దేవాలయం నేటికి మైసూర్ పట్టణానికి తూర్పు దిశగా చాముండి హిల్స్ పై నెలకొని ఉంటుంది.
మైసూర్ చరిత్ర నుండి కొన్ని ప్రధాన ఘట్టాలు - అశోక చక్రవర్తి కాలంలో మైసూర్ చాలా ప్రసిద్ధి చెందినట్లు క్రీ.పూ.245 సంవత్సరాలనాటి చరిత్ర చెపుతోంది. అయితే, క్రీ.శ. 10 వ శతాబ్దంనుండి ఖచ్చితమైన చారిత్రాత్మక రుజువులు ఈ నగరంపై లభ్యమవుతున్నాయి. ఈ చరిత్ర సాక్ష్యాల మేరకు, మైసూర్ రాజ్యాన్ని గంగ వంశం వారు 2వ శతాబ్దం నుండి క్రీ.శ. 1004 వరకు పరిపాలించారు. వారి తర్వాత చోళులు ఈ ప్రాంతాన్ని షుమారు ఒక శతాబ్దం పాలించారు. 10 వ శతాబ్దం వరకు ఈప్రాంతాన్ని పాలించిన చాళుక్య వంశీకుల పాలన క్రింద మైసూర్ ఉండేది. చోళులు 10వ శతాబ్దంలో మరోమారు అధికారానికి వచ్చారు. అయితే, వారు 12వ శతాబ్దంలో హొయసల రాజులచే ఓడించబడ్డారు. హొయసల రాజులు మైసూర్ లో అనేక దేవాలయాలు నిర్మించారు. మరి కొన్నింటిని పునరుద్ధరించారు.
మైసూరు యదు వంశస్ధులు గొప్ప భూస్వాములు వారు విజయనగర మహా సామ్రాజ్యనికి కప్పం కడుతూ మైసూర్ పాలకులుగా 1399 వరకు పాలించారు. యాదవ వంశస్దులకు చెందిన వారే యదు వంశస్ధులని కూడా విశ్వసించబడుతోంది. వీరే తర్వాతికాలంలో ఒడయార్ వంశస్ధులుగా కూడా పిలువబడ్డారు. బెట్టడ చామరాజ ఒడయార్ మైసూర్ కోటను 1584 లో నిర్మించి దానిని తన పాలనకు ప్రధాన నగరంగా చేసుకున్నాడు. తర్వాత అతడు తన రాజధానిని మైసూర్ నుండి శ్రీరంగ పట్టణానికి 1610వ సంవత్సరంలో బదలాయించాడు.
మైసూర్ పట్టణం హైదర్ ఆలీ మరియు టిప్పు సుల్తానులచే 1761 నుండి 1799 వరకు పాలించబడింది. 1799 లో టిప్పు సుల్తాన్ మరణించిన తర్వాత మైసూర్ మరోమారు ఒడయార్లకు రాజధానిగా మారింది. మైసూర్ పట్టణాన్ని విశాలమైన రోడ్లు, అతి పెద్ద రాజ భవనాలు, తోటలు మరియు సరస్సుల ఏర్పాటుతో ఒక ప్రత్యేక నగరంగా చక్కటి ప్రణాళిక మేరకు రూపొందించిన ఘనత క్రిష్ణరాజ ఒడయార్ IV (1895-1940)కు దక్కుతుంది. స్ధానిక సంక్కృతి మరియు ఆకర్షణలు - మైసూర్ పట్టణాన్ని సందర్శించే పర్యాటకులు విభిన్నమైన మైసూర్ సంక్కృతికి అబ్బుర పడతారు. ఈప్రాంత సంప్రదాయాలు, కళలు, చేతిపనులు, ఆహారాలు, జీవనవిధానం ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. ఈనగరం విభిన్న మతాల, విభిన్న ప్రాంతాల, విభిన్న రంగాల ప్రజలతో కాస్మోపాలిటన్ నగరంగా ప్రసిద్ధి చెందింది.
మైసూర్ జిల్లాకు మైసూర్ పట్టణం ప్రధాన కార్యాలయంగా ఉండి సందర్శకులకు వివిధఆకర్షణలు కలిగిస్తోంది. వారసత్వపు భవనాలు, చారిత్రక చిహ్నాలు, ప్రాచీన దేవాలయాలు, మ్యూజియములు, సరస్సులు, గార్డెన్లు వంటివాటితో ఈనగరం రాజ భవనాల నగరంగా ప్రసిద్ధి చెందింది. మైసూర్ ప్యాలెస్ లేదా అంబా ప్యాలెస్ అనేది నగరంలో ఎంతో ప్రధానమైన ప్యాలెస్ గా చెపుతారు. దేశంలోనే ఈప్యాలెస్ అత్యధిక సందర్శకులను నమోదు చేసుకొంది.
మైసూర్ జంతు ప్రదర్శనశాల లేదా... జూ, చాముండేశ్వరి దేవాలయం, మహాబలేశ్వర దేవాలయం, సెయింట్ ఫిలోమినా చర్చి, బృందావన గార్డెన్స్, జగన్మోహన ప్యాలెస్ ఆర్ట్ గ్యాలరీ, లలితా మహల్ ప్యాలెస్, జయలక్ష్మీ విలాస్ భవనం, రైల్వే మ్యూజియం, కారంజి లేక్, మరియు కుక్కర హళ్ళి సరస్సు వంటి ప్రదేశాలు మైసూర్ నగరంలో ప్రధాన ఆకర్షణలు. మైసూర్ పట్టణానికిచుట్టు పక్కల ఉన్న శ్రీరంగపట్న, నంజన్ గూడ్, శివసముద్ర జలపాతాలు, తలకాడు, మేల్ కోటే, సోమనాధపుర, హళీబీడు, బేలూరు, బండిపుర నేషనల్ పార్క్, శ్రావణబెళగొళ మరియు కూర్గ్ లేదా కొడగు వంటి ప్రాంతాలను సందర్శించేందుకు పర్యాటకులు మైసూర్ కు వస్తారు.
సమీపంలోని రాం నగర్ పట్టణానికి చుట్టుపక్కలగల పర్వత ప్రదేశాలు పర్వతారోహకులకు ఎంతో ఉత్సాహాన్ని పుట్టిస్తాయి. మైసూర్ కు దగ్గరలోనే మరికొన్ని పర్వత ప్రాంతాలంటే, సావన్ దుర్గ, కబ్బల దుర్గ, టుంకూరు, తూరహళ్ళి మరియు కనకపుర ప్రాంతాలుగా చెప్పవచ్చు. బాదామి మరియు హంపి ప్రాంతాల వద్ద గల కొండలుకూడా మైసూర్ నగరానికి వచ్చే పర్వతారోహకులను ఆకర్షిస్తాయి.
బిలిజిరిరంగణ కొండలు, చిక్కమగళూరు, హాసన్, కొడగు వంటి ప్రాంతాలు ట్రెక్కర్లకు ఎంతో ఇష్టంగా ఉంటాయి. చేపలు పట్టటంలో ఆసక్తి కలవారికి మైసూర్ పొలిమేరలలో ఉన్న కావేరీ ఫిషింగ్ క్యాంప్ బాగుంటుంది. నాగర్ హోల్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, బి.ఆర్ హిల్స్ శాంక్చువరి మరియు రంగనాధతిట్టు బర్డ్ శాంక్చువరీ వంటివి పక్షులను ఆసక్తితో గమనించేవారికి ఇష్టమైన ప్రదేశాలు.
మైసూర్ నగరం దంతపు పని, పట్టు, గంధపు ఉత్పత్తులు, చెక్క బొమ్మలు, వంటివాటికి ప్రసిద్ధి. మైసూరు దసరా పండుగ మైసూర్ లో పది రోజులపాటు అతివైభవంగా నిర్వహిస్తారు. మైసూర్ ప్రజలే కాక, దేశ వివిధ ప్రాంతాలనుండి ప్రజలు ఈ దసరా పండుగ సమయంలో మైసూర్ కు వచ్చి వేడుకలలో పాల్గొని ఆనందిస్తారు. మైసూర్ పట్టణం కర్నాటక రాష్ట్రానికి దక్షిణ దిశగా సముద్ర మట్టానికి షుమరు 770 మీటర్ల ఎత్తున కావేరి మరియు కాబిని నదుల మధ్య ప్రాంతంగా ఉంది. సందర్శకులకు ఇక్కడి వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది.
ఈ పట్టణం బెంగుళూరుకు 140 కి.మీ. దూరంలో ఉంది. రోడ్డు, రైలు మార్గాలచే కలుపబడి ఉంది. మైసూర్ విమానాశ్రయం లేదా మందకల్లి విమానాశ్రయం ఒక స్ధానిక విమానాశ్రయంగా ఉండి, దేశంలోని వివిధ నగరాలకు రాకపోకలను నిర్వహిస్తోంది.
సందర్శకులతో నిరంతరం కళ కళ లాడే రోడ్లు, ఎంతో ఘనత వహించిన చరిత్రతో మైసూరు కర్నాటక రాష్ట్ర సాంస్కృతిక రాజధాని అని తప్పక చెప్పాలి.