‘ఉప్పు నగరం’ గా పిలువబడే రాజస్థాన్ లోని జోధ్పూర్ జిల్లాలో వున్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ పట్టణం బంగారు నగరం గా పిలిచే జైసల్మేర్ కు సూర్య నగరం గా పిలిచే జోధ్పూర్ కు మధ్యలో థార్ ఎడారి లో వుంది. ఎడారి ఓడలుగా పిలువబడే ఒంటెల మీద ఇప్పటికీ ఉప్పు వాణిజ్యం జరిగే కేంద్రం. ఫలోదీ కి బికానేర్, నాగౌర్, జైసల్మేర్, జోధ్పూర్ లు సరిహద్దుగా వున్నాయి. ఈ జిల్లలో ఇది రెండో అతి పెద్ద నగరం. 15వ శతాబ్దం నాటి చరిత్ర కల ఫలోదీని ఆ కాలం లో ‘ఫలవర్ధిక’ అని పిలిచే వారు. 1547 లో రావ్ మల్దేవ్ రాథోర్ చేత పాలించబడిన ఈ పట్టణం 1578లో బికనేర్ రాజు అధీనంలోకి వచ్చింది. 1615లో రావ్ సూర్ సింగ్ చేజిక్కి౦చుకున్నాక జోధ్పూర్ రాజ్యం లో భాగమైంది.
సంస్కృతి, వర్ణాలు & జాతీయత
స్థానికంగా జూతీ లుగా పిలువబడే పాదరక్షలు, రంగు రంగుల గాజులు, రంగు రంగుల దుస్తులు ధరించే స్త్రీలు, బీడింగ్ లు, వెండి ఆభరణాలు ఫలోదీ ని కళ్ళకు కడతాయి. ఈ ప్రాంతంలో హిందీ, రాజస్థానీ ఎక్కువగా మాట్లాడే భాషలు. దీని గొప్ప సంస్కృతికే కాక, ఈ పట్టణాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దిన కోటలు, రాజప్రాసాదాలు, బజార్లు, పురాతన హిందూ, జైన దేవాలయాలకు ఫలోదీ ప్రసిద్ది చెంది౦ది.
ఫలోదీ లోని వారసత్వ భవనాలు రాజస్థాన్ లోని ఝారోఖా, జాలీ నిర్మాణ శైలులను ప్రతిబింబిస్తాయి. 300 ఏళ్ళ నాటి ఫలోదీ కోట ఇక్కడి ప్రసిద్ధ చారిత్రిక కట్టడాల్లో ఒకటి.
ఈ కోట అద్భుత నిర్మాణ శైలి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఫలోదీ ని సందర్శించే యాత్రికులు 1750 లో ఎర్రని ఇసుక రాయితో నిర్మించిన లాల్ నివాస్ కూడా చూడవచ్చు. ఈ అందమైన భవంతిని ఇప్పుడు ఆకర్షణీయమైన ప్రాచీన వస్తువులతోను, గాజు షాండిలియర్ ల తోనూ అలంకరించిన హెరిటేజ్ హోటల్ గా మార్చివేసారు. సచియా మాత గుడి, మహావీర మందిరం, రామ్ దేవరా దేవాలయం, సూర్య దేవాలయం ఇక్కడి ఇతర ప్రధాన ఆకర్షణలు.
‘డేమాయిసేల్లె కొంగల గ్రామ౦’ – వలస పక్షుల ప్రదేశం !
ఈ కోటలు, వారసత్వ భవనాలు, ప్రాచీన గుళ్ళ తో పాటు ఫలోదీ పక్షి ప్రేమికుల స్వర్గధామం. ఈ ప్రాంతం లోని ఖికన్ గ్రామంలో యాత్రికులు పెద్ద సంఖ్యలో వలస పక్షులను చూడవచ్చు. ఫలోదీ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం స్థానికంగా ‘కుర్జా’ గా పిలువబడే డేమాయిసేల్లె కొంగ కు తాత్కాలిక నివాసం. నైరుతి యూరప్, ఉక్రెయిన్, పోలాండ్ ల నుంచి ఎంతో దూరం ఎగురుతూ ఖికన్ లో తాత్కాలిక నివాసం కోసం వచ్చే ఈ అరుదైన పక్షి జాతిని చూడడానికి ఆగస్ట్ నుంచి మార్చ్ మధ్య కాలం సరైనది. ఈ పక్షులకు తాత్కాలిక ఆవాసంగా ప్రపంచ ప్రసిద్ది చెందడం తో ఈ గ్రామాన్ని ‘డేమాయిసేల్లె కొంగల గ్రామం’ గా పిలుస్తునారు.
ఫలోదీ చేరుకోవడం
ఉప్పు నగరం ఫలోదీ ని వాయు, రైలు రోడ్డు మార్గాల ద్వారా తేలిగ్గా చేరుకోవచ్చు. ఫలోదీ నుంచి 135 కిలోమీటర్ల దూరంలో వున్న జోధ్పూర్ ఇక్కడికి దగ్గరి విమానాశ్రయం. విదేశీ పర్యాటకులు ఇక్కడికి న్యూ డిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చేరుకోవచ్చు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ముంబై, కోల్కతా, చెన్నై, గువహతి, బెంగళూరు లతో సహా అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానం చేయబడింది.
బికానేర్, జైసల్మేర్, లాల్ ఘర్, పాత డిల్లీ, జోధ్పూర్ ల నుంచి యాత్రికులు ఇక్కడికి రైళ్ళలో కూడా చేరుకోవచ్చు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్ల నుంచి ఫలోదీ చేరడానికి కార్లు సిద్ధంగా వుంటాయి. ఈ ఉప్పు నగరాన్ని చేరడానికి సౌకర్యవంతంగా, వీలుగా వుండే బస్సు సేవలు కూడా అందుబాటులో వున్నాయి. ఫలోదీ నుంచి జోధ్పూర్, అజ్మీర్, జైపూర్, బేవార్, ఆగ్రా, అల్లహాబాద్, కాన్పూర్ వంటి ప్రసిద్ధ యాత్రా స్థలాలకు పర్యాటకులు ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసుల ద్వారా చేరుకోవచ్చు.
ఫలోదీ లో ఏడాది పొడవునా ఉష్ణ మండల వాతావరణం వుంటుంది. వేసవి గరిష్టంగా 45 డిగ్రీలతో చాలా తీవ్రంగా వుండగా, శీతాకాలాలు 5 డిగ్రీల ఉష్ణోగ్రతతో గడ్డ కట్టి౦చేలా వుంటాయి. ఫలోదీ సందర్శనకు శీతాకాలం అనువైనది.