నాథ సంప్రదాయం వారు శివ భక్తులుగా ప్రసిద్ధులు. వాళ్ళు స్థిరపడిన చోటల్లా వాళ్ళు డేరా లు లేదా శిబిరాలు, దేవాలయాలు నిర్మించారు. అలాంటి ఒక దేవాలయం 13 వ శతాబ్దంలో సిర్సా లో ఇప్పుడు హిసా గేట్ గా పిలుస్తున్న ప్రాంతంలో నిర్మించారు. ఈ దేవాలయాన్ని నాథ సంప్రదాయానికి చెందినా సర్సాయి నాథ్ అనే గురువు నిర్మించారు, ఆయన కూడా తన అనుచరులతో ఇక్కడ పూజలు, యజ్ఞాలు, ధ్యానం చేసారు.
సిర్సా లో దొరికిన భోజ లిపిలో వున్న శాసనం ప్రకారం, పశుపతి తెగకు చెందిన నీలకంఠ అనే సాధువు యోగేశ్వరుడనే శివ ఆలయాన్ని కాల్చిన ఇటుకలు, మందమైన నాప రాళ్ళతో సుమారు 8 లేక 9 శతాబ్దాలలో నిర్మించాడు. ఈ గుడికి బంగారు శిఖరం కూడా వుంది. అయితే ఆ గుడి ఆనవాళ్ళేవీ కనపడక పోవడంతో బాబా సర్సాయి నాథ్ దాన్ని పునర్నిర్మించాడు.
తన కుమారుడు అనారోగ్యం నుంచి కోలుకోవాలనే ఉద్దేశ్యంతో ముఘల్ చక్రవర్తి షాజహాన్ డేరా బాబా సర్సాయి నాథ్ కు వచ్చి ఆశీస్సులు పొందాడని చెప్తారు. ఈ గుడికి భూములిచ్చి, దీనికి ఒక గుమ్మటాన్ని కూడా ఆయన కట్టించాడు. డేరా యాజమాన్యం దగ్గర షాజహాన్ ఇక్కడికి వచ్చి వెళ్లినట్టు రుజువు పరచే అరబ్బీ లిపిలో వున్న పత్రం కూడా వుంది. శివాలయం పక్కనే దుర్గా దేవి గుడి కూడా డేరా లో వుంది.