తిరువల్ల .. కేరళ లోని పాతానంతిట్ట జిల్లా లో మణిమాల నదీ తీరం లో ఉన్న ఒక చిన్న ప్రశాంతమైన పట్టణం. అనేకానేక దేవాలయాల తో చరిత్ర, సంస్కృతి కి సాక్షి గా నిలిచి "ఆలయాల పట్టణం" గా పేరు పొందింది. తిరువల్ల లో ఉన్న "దక్షిణ తిరుపతి" గా ప్రసిద్ధి చెందిన శ్రీ వల్లభ ఆలయం దేశం నలు మూలల నించి భక్తులను ఆకర్షిస్తుంది. క్రీ.శ 52 లో కేరళ లో క్రైస్తవాన్ని ప్రవేశపెట్టినప్పుడు నిర్మించిన విఖ్యాత పలియక్కర చర్చి కూడా ఇచటే ఉంది. తిరువల్ల తన లో ఎన్నో కథలను ఇంకెన్నో గాథలను నింపుకుని నిటారుగా నిలబడుతుంది. ఇక్కడి ప్రతి దానికి ఒక కథ ఉంది .. గుళ్ళకి , పండగలకి , చివరకి దీని పేరు కి కుడా. కథానుసారం , తిరువతంకూర్ మహారాజా వారి పరి పాలనా కాలం లో ఈ ప్రదేశం శ్రీ వల్లభాపురం గానూ, తరవాత తిరువల్లభాపురం గానూ, నేటి కాలానికి తిరువల్ల గానూ మారింది. మరో విశ్వాసం ప్రకారం, ఈ ఊరు భగవాన్ తిరు వల్లభన్ ( విష్ణు) పేరు మీదుగా తిరువల్ల అని పిలవబడుతుంది. అందుచేత, తిరువల్ల “విష్ణు పట్టణం” గా కుడా వినుతికెక్కింది.
సాంస్కృతిక స్థానము ...
తిరువల్ల వారసత్వం కేవలం ఆలయాలకి, వాటి ఆచారాలకే పరిమితం కాదు. హిందూ, మహమ్మదీయ, క్రైస్తవ మతాలను ఇముడ్చుకున్న వైవిధ్యభరిత చరిత్ర దీనికి ఉంది. లెక్కకు మిక్కిలి చర్చిలు , గుళ్ళతో పాటు దర్శనమివ్వటమే కాకుండా, ఈ చిన్న పట్టణం లో కొన్ని పేరెన్నిక గల మసీదులు కుడా ఉన్నాయి. ఈ బహుళ మత ప్రార్థనాలయాలు ఇక్కడి సంస్కృతి కి ప్రత్యేకత ని సమకూర్చాయి. దేవాలయాలు కేవలం ప్రార్థనామందిరాలు గానే కాక సంఘ ఆదాయం సృజన లోను ,వాణిజ్య నమూనాలను తయారు చేయటం లోను సమగ్రమైన పాత్ర పోషించాయి. అమ్మన్ కుడం, అరట్టు, చందనకుడం , చుట్టువిలక్కు,ఇళున్నల్లత్తు మొదలగు అనేకానేక అద్వితీయమైన దేవాలయాల ప్రదర్శనలకి, వాటి ఆచారాలకి తిరువల్ల పేరుపడ్డది.
రుతువులు - రుచులు ..
తిరువల్ల ఆహ్లాదకరమైన వాతావరణానికి పేరు మోసింది. నైరుతి ఋతుపవనాల ప్రభావం వల్ల ఆగష్టు సెప్టెంబర్ నెలల్లో ఇక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. తిరువల్ల ది విలక్షణమైన ఉష్ణమండలీయ వాతావరణం అయినప్పటికీ, చాలా ఉల్లాసభరితమైన వాతావరణం. ఈ చారిత్రక పట్టణం సందర్శించడానికి ఉత్తమ సమయం వర్షాలు తర్వాతే. అప్పుడైతే వాన జల్లులు ఈ ప్రదేశాన్ని హరిత భరితంగా మార్చి వేసిఉంటాయి. ఇక్కడి ప్రధాన పంట వరి కనుచూపు మేరంతా పరుచుకుని ఉంటుంది. అసలు సిసలు దక్షిణ భారతీయ ఆహారాన్ని ఇష్టపడే వారికి ఇది నిజంగా స్వర్గం. విస్తారంగా పండే బియ్యం ఇక్కడి ముఖ్య ఆహారం. దక్షిణ భారతీయ ఆహారం అంటే కేవలం ఇడ్లీ, వడలు మాత్రమే అనే అపోహ లో ఉండేవారికి ఇక్కడి అరటికాయ పుట్టు , నల్ల సెనగల కూర , అప్పం, అట్లు అలాంటి భ్రమలను పటాపంచలు చేస్తాయి .
కేరళ వంట లో కొబ్బరి తప్పనిసరి. అందుచేత ఇక్కడి భోజనం కాస్త భారీగానే ఉంటుంది. ఇక్కడ స్థానికులకి వారి కి కనిపించీ ప్రతి రుచికరమైన పదార్ధాన్ని ఊరపెట్టడం అలవాటు. మామిడి కాయలు , నిమ్మ కాయలు చివరికి రాచ ఉసిరి తో కూడా ఊరగాయ తయారు చేస్తారు. తిరువల్ల వందలాది తీపి, పులుపు, ఉప్పు, ఘాటు వంటకాలతో మీ నాలుక ని చక్కిలిగింతలు పెడుతుంది. తన సహజ సౌందర్యంతో, పాత ప్రపంచపు ఇంద్రజాలం తో మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. పురాణాల పట్ల ఆసక్తి ఉన్నట్లయితే మీరు తప్పక తిరువల్ల వెళ్లి తీరాలి. ఈ చిన్న పట్టణం లోని దేవాలయాలు వాటి కథలు , వాటిని నిర్మించిన మహా రాజుల గాథలు చెప్పడానికి మీకోసం ఎదురుచూస్తున్నాయి.