దక్షిణ తిరుపతి గా పిలవబడే శ్రీ వల్లభాలయం కేవలం పరమ భక్తులనే కాదు, ప్రపంచం నలు మూలలనించి పర్యాటకులని ఆకర్షిస్తుంది. ఇది కేవలం అమూల్యమైన దైవానుభూతిని ఇవ్వటమే కాకుండా, సందర్శకులకు కను విందు చేస్తుంది. ఇక్కడి ప్రాచీన విగ్రహాలు ఏక శిల తో చెక్కి, అనేక మనోహరమైన శిల్పవిన్యాసాలతో , కుడ్యచిత్రాలతో (మ్యూరల్స్) అలరారుతాయి. "కేట్టుకళ" ఊరేగింపు కి ప్రసిద్దిపొందిన "ఉత్రశ్రీబలి" పండగ మార్చి-ఏప్రిల్ నెలలో జరుగుతుంది. ఈ ఊరేగింపు లో రంగు రంగుల తెప్పలు, ముచ్చటగా ముస్తాబయిన ఏనుగులు డప్పుల చప్పుడు నేపథ్యం లో కోలాహలం చేస్తాయి. తిరువల్ల వీధులన్నీ తిరునాళ్ళ తో నిండి తూగుతుండటం వల్ల వాతావరణం ఎంతో ఉత్సాహవంతంగా ఉంటుంది. పచ్చని చెట్లు, పచ్చిక బయళ్ళు మరింత వన్నె తెస్తాయి.కేరళలో ప్రతి దినం ఆలయం లో కథాకళి ప్రదర్శించే ఆచారం కేవలం శ్రీ వల్లభాలయం లోనే ఉండటం ఇక్కడి విశిష్టత. విష్ణు భక్తులు కానప్పటికీ అత్యద్భుతమైన శిల్ప కళ అనిర్వచనీయమైన నిర్మాణ చతురత గల ఈ ఆలయ వైభవం చూసి ఎవరయినా విస్మయం చెందాల్సిందే. 50 అడుగుల ఎత్తు ఉండి ఒకే శిల తో గరుత్మంతుడి విగ్రహం గల ఇక్కడి ధ్వజస్తంభము నిజంగా అలౌకిక నిర్మాణ చాతుర్యానికి ప్రతీక గా నిలుస్తుంది.