మహారాష్ట్ర లోని నందూర్బార్ జిల్లాలో వున్న చిన్న కొండ ప్రాంతం తోరన్మల్. సాత్పురా పర్వత శ్రేణుల్లో వున్న ఈ యాత్రా స్థలం సముద్ర మట్టానికి 1150 మీటర్ల ఎత్తున వుంది. కేవలం 44 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన తోరన్మల్ ప్రధానంగా ఒక మైదాన ప్రాంతం.
తోర్నా చెట్టు నుంచి ఈ కొండ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో దట్టంగా వున్న తోర్నా చెట్లను ఇక్కడి గిరిజన తెగల వారు సంతాన దేవత తోర్నా దేవి గా పూజించేవారు.
ఇక్కడి చాలా ఆకర్షణల్లో యశ్వంత్ చెరువు యాత్రికులని సూదంటురాయిలా ఆకర్షిస్తుంది. ఇక్కడ గోరఖ్ నాథ్, నాగార్జున దేవాలయాల్లాంటి చాలా గుళ్ళు వున్నాయి. సితాఖాయి మీరు తప్పక చూడాల్సిన లోయ ప్రాంతం కాగా, ఖడ్కీ పాయింట్, సన్ సెట్ పాయింట్ల నుంచి పరిసర ప్రాంతాల మనోహర దృశ్యాలు చూడవచ్చు.
తోరన్మల్ ఎందుకు చూడాలి?
ఒక కొండపైన ఉండడంతో తోరన్మల్ లో ఏడాది పొడవునా చక్కటి వాతావరణం వుంటుంది. అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు అనుసంధానం చేసి వుండడం వలన ఇక్కడికి అనుకున్నదే తడవుగా వెళ్లిపోవచ్చు.
చుట్టూ కొండలతో పచ్చని కీకారణ్యం లా వుండే తోరన్మల్ మహారాష్ట్రలో రెండో అతి శీతల కొండ ప్రాంతంగా పేరుపొందింది. ఇక్కడ అందమైన సరస్సులు, మనోహరమైన దృశ్యాలు వుంటాయి, పర్వతారోహకులకు ఆనందం కలిగించే పర్వత మార్గాలు సరే సరి. నగరం హడావిడికి దూరంగా ప్రశాంతత ను అనుభవించడానికి ఈ చిన్ని కొండ ప్రాంతాన్నితప్పక సందర్శించండి.