హైదరాబాదులోని పురాతనమైన ఆలయాలలో జూబ్లీ హిల్స్ లోని శ్రీ పెద్దమ్మ దేవాలయం చాలా మహిమ కల ఆలయం. ఈ ఆలయంలో ఐదు అంతస్థుల గర్భగుడి, ఏడు అంతస్థుల రాజగోపురం, కళ్యాణమండపం, వసతి గృహాలు మొదలైనవి ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో ఎత్తయిన ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం వద్ద రూపాయిబిళ్ళ పడిపోకుండా నిలువుగా నిలబడితే మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం.
చరిత్ర
పెద్దమ్మ గుడి ఎన్నో సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ లో వుండగా 2000 సంవత్సరం నుండి దీని ప్రాచుర్యం చాలా పెరిగింది. అమ్మవారు పూర్వకాలం నుండి గ్రామదేవతగా పూజలు అందుకుంటూ వుండేదట.
pc: Karuna138
ఉత్సవాలు
ఈ ఆలయంలో ఐదు ప్రధాన ఉత్సవాలు జరుగుతాయి. అవి బ్రహ్మోత్సవాలు, బోనాలు, శాకాంబరి ఉత్సవాలు, దసరా నవరాత్రులు మరియు శరన్నవరాత్రులు. ఈ ఉత్సవాల సమయంలో అశేష భక్తులు అమ్మవారిని దర్శించుకోవటానికి వస్తారు. హైదరాబాదు సికింద్రాబాదు జంటనగరాలు మరియు శివారు ప్రాంతాలకు చెందిన వేలాదిమంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా పూజల కోసం ఆలయానికి తరలివస్తుంటారు.
ఆలయం చుట్టూ సినీ పరిశ్రమకు చెందిన పలు నిర్మాణ సంస్థలు, స్టూడియోలు ఉండటం వలన ముహూర్తాలు, సినిమా ప్రారంభోత్సవాలవంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ వుంటారు. పెద్దమ్మ తల్లి కోరితే వరమిస్తుంది, మొక్కితే కరుణిస్తుంది. ఈ ఆలయంలో కాలు పెట్టగానే నిశ్చింతగా వుంటుంది.
పురాణం
మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్నీ పీడించేవాడు. యజ్ఞయాగాదుల్ని నాశనం చేసేవాడు. ఇంద్రాదులను తరిమి కొట్టేవాడు. త్రిమూర్తులు కూడా ఆ ధాటికి తట్టుకోలేకపోయారు. 'పాహిమాం' అంటూ శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు. మహాశక్తి ముందు రాక్షసశక్తి చిన్నబోయింది. అంతిమ విజయం అమ్మవారిదే! ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరమనిపించింది. దుర్గమమైన అడవుల్లో...బండరాళ్ల మధ్య కొద్దిరోజులు సేదతీరింది. అదే...జూబ్లీహిల్స్లో ప్రస్తుతం పెద్దమ్మ దేవస్థానమున్న ప్రాంతమని స్థానిక ఐతిహ్యం. 'పెద్దమ్మ'అన్న మాట ఏ పురాణాల్లోనూ కనిపించదు. ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు. ముగ్గురమ్మల మూలపుటమ్మే.. కడు పెద్దమ్మ! ఏడు ఎకరాల ఆవరణలో విస్తరించిన ఆధ్యాత్మిక క్షేత్రం.
జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి గుడి! హైదరాబాద్ నాలుగు వందల సంవత్సరాల ప్రాచీన నగరం. భాగ్యనగర నిర్మాణానికి చాలా చాలా ముందే ...ఆమాటకొస్తే, వేల సంవత్సరాల క్రితమే జూబ్లీహిల్స్ ఆదిమతెగలకు ఆవాసంగా ఉండేదంటారు. వేటే జీవనంగా బతికే ఆ అమాయకులు తమ కులదేవత పెద్దమ్మ తల్లిని భక్తితో కొలిచేవారు.మంచి జరిగితే, నైవేద్యాలిచ్చి అమ్మ సమక్షంలో సంబరాలు జరుపుకునేవారు. చెడు జరిగితే, జంతు బలులతో తల్లికి శాంతులు జరిపించేవారు. కాలప్రవాహంలో ఆ తెగలు అంతరించిపోయాయి. జూబ్లీహిల్స్ అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారింది. కానీ, అలనాటి అమ్మతల్లి ఆనవాళ్లు మాత్రం మిగిలాయి. రెండున్నర దశాబ్దాల క్రితం దాకా.. ఇక్కడో చిన్న ఆలయం ఉండేదట. ఎవరైనా వచ్చి వెలిగిస్తే దీపం వెలిగేది, లేదంటే లేదు. ఆ సమయంలో... రాత్రిళ్లు అమ్మ అడుగుల సవ్వడులు వినిపించేవని స్థానికులు చెబుతారు. భక్తులకు కల్లో కనిపించి ... తనకో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించిందట.