ఇటు ఆంధ్ర ప్రదేశ్ కానీ, అటు తెలంగాణ లో కానీ ఇప్పటివరకు పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ఆలయాలని, జలపాతాలని, కోటలని ఇంకా మ్యూజియాలని చూశాము. రాయలసీమలో కూడా అత్యుత్తమ పర్యాటక ప్రదేశాల గురించి కూడా తెలుసుకున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే అదిలాబాద్ నుండి మహబూబ్ నగర్ వరకు గల పర్యాటక ఆకర్షణల గురించి చదివాం మరి ఇంకా చూడటానికి ఏమైనా ఉన్నాయా ...??
ఇది కూడా చదవండి : ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ ఏమి తినాలి ??
మనలో చాలా మంది ఇంట్లో కూర్చోని ఏ డిస్కవరీ ఛానల్లోనో, నేషనల్ జాగ్రఫీ ఛానల్లోనో లేదా ఎనిమల్ ప్లానెట్ లొనో దట్టమైన అడవుల్లో తిరిగే వన్యప్రాణులను చూస్తూ.. భూ మండలం పై ఉన్న ప్రాణుల జీవనవిధానం తెలుసుకుంటూ కాలం గడిపేస్తారు. మనతో పాటుగా ఈ భూమిపై నివసిస్తున్న జంతువులను, వృక్ష జాలాన్ని చూసి ఆనందించే వారు చాలా అరుదుగా కనిపిస్తారు. మరి డిస్కవరీ, నేషనల్ జాగ్రఫీ, ఎనిమల్ ప్లానెట్ ఛానళ్లలో చూపించే ఆ జంతు, వృక్ష జాతులు ఎన్నో మన చుట్టూనే ఉన్నాయని మీరు తెలుసా ...?!
ఇది కూడా చదవండి : ఆంధ్ర ప్రదేశ్ లో ఫ్యామిలీ తో వెళ్ళవలసిన ప్రదేశాలు !!
మన రెండు తెలుగు రాష్ట్రాలలో (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ) చాలా కొద్ది మంది అదికూడా ప్రకృతి ప్రియులు మాత్రమే పర్యటించే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అవే వన్య ప్రాణుల సంరక్షణాలయాలు సింపుల్ గా చెప్పాలంటే స్యాంక్చురీలు. మన రెండు తెలుగు రాష్ట్రాలలో క్రూర మృగ సంరక్షణాలయాలు, పక్షుల సంరక్షణాలయాలు దాదాపుగా నదీ పరివాహ ప్రాంతాలలో కనిపిస్తాయి.
ఇది కూడా చదవండి : రాయలసీమ ది బెస్ట్ ప్రదేశాలు !!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్టణం, శ్రీశైలం, కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు, తెలంగాణ రాష్ట్రంలో కిన్నెరసాని, హైదరాబాద్, నాగార్జున సాగర్ లు వన్య మృగ సంరక్షణ ప్రాంతాలుగా ఉన్నాయి. వీటితో పాటు ఇంకా కొన్ని ప్రాంతాలు కూడా పక్షులకి, జంతువులకి ఆవాసాలుగా ఉన్నాయి. పచ్చని చెట్ల, ఆహ్లాదకరమైన వాతావరణం లో వీటి సందర్శన ఒక మాధురానుభూతిని ఇస్తుంది.
ఇది కూడా చదవండి : ఆంధ్ర, తెలంగాణలోని జాలువారే జలపాతాలు !!
వీటిలో కొన్నింటికి ట్రెక్కింగ్ ద్వారా చేరుకొనే సదుపాయం కూడా కలదు. అటవీ శాఖ వారి అనుమతితో ఒక గైడ్ ని వెంటబెట్టుకొని అడవుల్లో నడుస్తూ ... వన్య మృగాలను చూస్తూ, కెమరాలకు పనిచెప్పుతూ కలియతిరగటం ఒక జ్ఞాపకంగా మిగులుతుంది.
మల్లారం అడవి, నిజామాబాద్
మల్లారం అడవి నిజామాబాద్ పట్టణం నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. చుట్టూ ఉన్న అందమైన ప్రకృతి మధ్యలో నెలకొని ఉన్న ఈ అడవి పర్యటనకి అనువైన ప్రదేశం. గజిబిజి అడవి దారులు, గోపురం, దృశ్యకేంద్రం ఉన్న టవర్ ఆకర్షణ లుగా నిలిస్తే, 1.45 బిలియన్ సంవత్సరాల శిల మరొక ప్రధాన ఆకర్షణ. ఇది పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
చిత్ర కృప : ironnikhil
అలీ సాగర్ జింకల పార్క్, నిజామాబాద్
అలీ సాగర్ నిజామాబాద్ లోని మానవ నిర్మిత జలాశయం. ఇది నిజామాబాద్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో బాసర రోడ్డుకి 2 కిలోమీటర్ల చేరువలో ఉన్నది. ఈ జలాశయానికి సమీపంలో అందమైన లేడి సంరక్షణాలయం కలదు. అడవి ప్రాంతంలో ఉన్న ఈ పార్క్ కి ట్రెక్కింగ్ చేసుకుంటూ చేరుకోవడం ఒక జ్ఞాపకంగామిగులుతుంది. దారి పొడవునా కనిపించే ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఉత్తెజపరుస్తాయి.
చిత్ర కృప : telangana tourism
మారేడుమిల్లి, తూర్పుగోదావరి జిల్లా
తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న తూర్పు కనుమల్లో మారేడు మిల్లి ఎత్తైన ప్రదేశం. ఇది రాజమండ్రి కి 80 కి. మీ. దూరంలో ఉన్నది. ఇది మన్య ప్రాంతం కావడం చేత అటవీ శాఖ వారు స్థానికులతో కలిసి ఒక విహార స్థలంగా మార్చారు. ఇక్కడ చేపట్టిన ఎన్నో ప్రాజెక్ట్ లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి 7 కి. మీ. దూరంలో జాలువారే జలతరంగిణి జలపాతం ఉన్నది. ఇది ఈ ప్రాంత అందాలను మరింతగా పెంచుతున్నది.
చిత్ర కృప : KRISHNA SRIVATSA NIMMARAJU
కోరంగి అభయారణ్యం, కాకినాడ
కోరంగి అభయారణ్యం కాకినాడ పోర్ట్ కి సమీపంలో ఉన్నది. ఈ అభయారణ్యం ఉప్పు నీటి మొసళ్లకి ప్రసిద్ధి చెందినది. దీనిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న మడ అడవులు గా పరిగణిస్తారు యాత్రికులు. గోదావరి నది ఈ కోరంగి అభయారణ్యం గుండా ప్రవహిస్తుంటుంది. ఇక్కడ అనేక రకాల అడవి జంతువులు చూడవచ్చు.
చిత్ర కృప : Konaseema Tourism
ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం, వరంగల్
ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం వరంగల్ జిల్లాలో కలదు. దీనిని 1952 సంవత్స రంలో ఆనాటి ప్రభుత్వం జీవ వైవిధ్య అభయారణ్యంగా ప్రకటించింది. గోదావరి నది ఈ నాగారం అభయారణ్యం గుండా ప్రవహిస్తుంటుంది. ఇక్కడ అనేక రకాల అడవి జంతువులు చూడవచ్చు. అరుదుగా కనిపించే సాంబార్, కృష్ణజింక ఇక్కడ కనిపిస్తాయి.
చిత్ర కృప : Adityamadhav83
గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యం, ప్రకాశం జిల్లా
గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యం ఎక్కువ భాగం ప్రకాశం జిల్లా లో విస్తరించినది. ఇది మూడు జిల్లాలలో విస్తరించిన నల్లమల్ల అడవులలో ఒక భాగం. 1200 చ. కి. మీ. విస్తీర్ణం కలిగిన గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యం దేశంలోనే ఆరవ అతి పెద్ద వైల్డ్ లైఫ్ శాంక్చూరీ. ఇక్కడ అరుదైన వృక్షాలు, వాన మూలికలతో పాటుగా పెద్ద పులులు, చిరుత పులులు, ఎలుగుబంటీలు , నక్కలు, తోడేళ్లు, జింకలు మొదలైన జంతువులకు ఆవాసాలు.
చిత్ర కృప : wiki common
ఇందిరా గాంధీ జూ లాజికల్ పార్క్, విశాఖపట్టణం
విశాఖపట్టణం లోని ఇందిరా గాంధీ జూ లాజికల్ పార్క్ 425 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేశారు. ఈ పార్క్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పెద్ద జూ పార్కులలో ఒకటి. సుమారు 80 రకాల జంతుజాలాలను ఇక్కడ చూడవచ్చు.
చిత్ర కృప : Siddhartha Lammata
కౌండీన్య శాంక్చూరీ, చిత్తూర్
కౌండీన్య శాంక్చూరీ చిత్తూర్ కి 50 కి. మీ .దూరంలో, బెంగళూరు మహానగారానికి 120 కి. మీ. దూరంలో ఉన్నది. ఇది సుమారుగా 358 చ. కి. మీ. విస్తరించి ఉన్నది. ఈ ప్రదేశం అంతా కూడా ఎత్తైన కొండలతో, లోతైన లోయలతో నిండి ఉంటుంది. కైగల్, కౌండీన్య అనే రెండు ప్రవాహాలు ఈ అభయారణ్యం గుండా వెళతాయి. ఎన్నో రకాల వైవిధ్యభరితమైన జంతువులకి ఈ ప్రదేశం నివాసంగా ఉన్నది.
చిత్ర కృప : Mosmas
కవాల్ వైల్డ్ లైఫ్ శాంక్చూరీ, ఆదిలాబాద్
కవాల్ వన్యప్రాణుల అభయారణ్యం ఆదిలాబాద్ జిల్లాలో కలదు. ఇక్కడ 893 చ. కి. మీ. మేరకు విస్తరించిన దట్టమైన అడవుల్లో పులులు, చిరుత, జింక, ఎలుగుబంటి వంటి అనేక అడవిజంతువులతో పాటు వివిధ రకాల పక్షులు, అనేక జాతుల సరీసృపాలను కూడా ఈ అభయారణ్యంలో చూడవచ్చు. అనేక అడవి జంతువులకు సహజ ఆవాస ప్రాంతం.
చిత్ర కృప : telangana tourism
కిన్నెరసాని అభయారణ్యం, ఖమ్మం
కిన్నెరసాని అభయారణ్యం ఖమ్మం జిల్లాలో భద్రాచలానికి సమీపంలో ఉన్నది. ఇది సుమారుగా 635 చ. కి. మీ. వరకు విస్తరించి ఉన్నది. అంతరించిపోతున్న అరుదైన జంతుజాలాన్ని రక్షించేందుకు పాల్వంచ కేంద్రంగా ఈ అభయారణ్యాన్ని నెలకొల్పారు. అడవి జంతువులతో పాటుగా, 300 రకాల అరుదైన పక్షులు ఇక్కడ గమనించవచ్చు.
చిత్ర కృప : J.M.Garg
నేలపట్టు బర్డ్ సంక్చురి, నెల్లూరు
నేలపట్టు బర్డ్ సంక్చురి పులికాట్ సరస్సు కు 20 కి. మీ.ల దూరంలో నెల్లూరు జిల్లాలో తూర్పు కోస్తా ప్రాంతంలో కలదు. దీనికి చెన్నై(50 కి. మీ) మరియు, నెల్లూరుల నుండి చేరవచ్చు. ఈ శాంక్చురి ఎన్నో రకాల అరుదైన పక్షులకు జన్మస్థలంగా కలదు. లిటిల్ కర్మోరంట్, పెయింటెడ్ స్తోర్క్, వైట్ ఇబిస్, స్పాటే డ్ బిల్లెద్ పెలికన్ వంటి చాలా జాతుల పక్షులు వచ్చి నివాసాలు ఏర్పరచుకుంటాయి.
చిత్ర కృప : Balu Velachery
కొల్లేరు పక్షి అభయారణ్యం, ఏలూరు
కొల్లేరు పక్షి అభయారణ్యం విజయవాడ కి 60 కి. మీ. దూరంలో మరియు ఏలూరు పట్టణానికి సమీపంలో ఉన్నది. కృష్ణా మరియు గోదావరి నదులు ఏర్పరిచిన అందమైన డెల్టా మైదానంలో కొల్లేరు సరస్సు ఉన్నది. ఈ సరస్సు అరుదైన పక్షులకి ఆవాసంగా ఉన్నది. తెల్ల బాతులు, కొంగలు మరియు వివిధ పక్షులు ఇక్కడి మంచి నీటి సరస్సులో విహరించడం వంటివి కెమరాల్లో బంధించడం ఒక జ్ఞాపకం గా మిగిలిపోతుంది.
చిత్ర కృప : J.M.Garg
కృష్ణా సంక్చురి, అవనిగడ్డ
కృష్ణా సంక్చురి అవనిగడ్డ గ్రామానికి సమీపంలో 195 చ. కి. మీ. వైశాల్యంలో విస్తరించినది. సీజనల్ పక్షులతో పాటు అడవి జంతువులు ఇక్కడ గమనించవచ్చు.
చిత్ర కృప : J.M.Garg
మహావీర్ హరిన వనస్థలి నేషనల్ పార్క్, హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో ఉన్న వనస్థలిపురంలో మహావీర్ హరిన వనస్థలి నేషనల్ పార్క్ అనే జింకల పార్క్ ఉంది. ఇక్కడ అనేక రకాల జింకలను చూడవచ్చు. జింకలతో పాటు కింగ్ఫిషర్లు, నీటి కాకులు, చిన్న తోక గద్దలు ఇక్కడ కనబడే నిటి పక్షులు. ప్రవేశ రుసుం 5 రూ/- గా ఉండి సంవత్సరం పొడవునా సందర్శించవచ్చు.
చిత్ర కృప : satish lal andhekar
మంజీరా బర్డ్ సంక్చురి, సంగారెడ్డి
మంజీరా బర్డ్ సంక్చురి మెదక్ జిల్లా సంగారెడ్డి కి సమీపంలో 20 చ. కి. మీ. వైశాల్యంలో విస్తరించి ఉన్నది. మంజీరా నది ఒడ్డున ఉన్న ఈ చిన్న సంక్చురి అనేక పక్షి జాతులకి ఆవాసంగా ఉంది. మొసళ్ళు, వివిధ రకాల చేపలు, సరీశృుపాలు ఇక్కడ గమనించవచ్చు.
చిత్ర కృప : Rakesh Reddy Ponnala
మృగవాణి నేషనల్ పార్క్ , హైదరాబాద్
హైదరాబాద్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిల్కూర్ లో మృగవాణి పార్క్ ఉంది. వివిధ రకాలైన జంతుజాలం మరియు వృక్షాజాలం కలిగి ఉండడం ఈ పార్క్ విశిష్టత. ఇండియన్ హేర్, చీతా, సివెట్, సాంబార్, ఇండియన్ రాట్ స్నేక్ ఈ పార్క్ ప్రాంగణంలో గమనించవచ్చు. రస్సెల్ వైపర్, కోబ్రా మరియు పైతాన్ లు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఫ్లవర్ పెక్కర్ పక్షి ఇక్కడ సాధారణంగా కనబడుతుంది.
చిత్ర కృప : Akbar Mohammed
నెహ్రూ జూలాజికల్ పార్క్, హైదరాబాద్
హైదరాబాద్ లో జాతీయ రహదారికి పక్కన బెంగళూరు వెళ్లే మార్గంలో నెహ్రూ జూలాజికల్ పార్క్ ఉన్నది. వివిధ రకాల జంతువులు, సరీసృపాలు మరియు పక్షులు ఈ జూ లో ఉన్నాయి. టైగర్, పాంథర్, ఏషియాటిక్ లయన్, పైథాన్, కొండచిలువ, ఒరాంగుటాన్, మొసలి, పక్షులు మరియు ఏంటేలోప్స్, జింకలు, ఇండియన్ రైనో వంటి సహజమైన జంతువుల జాతులని ఈ జూ లో గమనించవచ్చు.
చిత్ర కృప : Cephas 405
పాకాల అభయారణ్యం, వరంగల్
వరంగల్ నగరానికి దగ్గరలో ఉన్న మానవ నిర్మిత సరస్సు పాకాల కి చేరువలో పాకాల అభయారణ్యం ఉన్నది. 860 చ. కి. మీ. వైశాల్యంలో ఉన్న ఈ అభయారణ్యం లో జింకలు, సాంబార్, పైథాన్, అడవి కుక్కలు, నక్కలు, హైనా, పులులు, బాతులు ఇంకా వివిధ రకాల జంతు, పక్షి జాతులు కనిపిస్తాయి.
చిత్ర కృప : telanganatourism.gov.in
పాపికొండ అభయారణ్యం, రాజమండ్రి
పాపికొండలు ఖమ్మం, తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో విస్తారంగా ఉన్నాయి. రాజమండ్రి కి 50 కి. మీ. దూరంలో తూర్పు కనుమల్లో పశ్చిమ దిశ నుండి ప్రవహిస్తున్న గోదావరి నదికి మరియు దట్టమైన కొండల మధ్యలో 591 చ. కి. మీ. విస్తీర్ణంలో ఉన్నది. ఇక్కడ కూడా ఎన్నో రకాల జంతువులు, పక్షులు కనిపిస్తాయి.
చిత్ర కృప : Pranayraj1985
పోచారం అభయారణ్యం, మెదక్
పోచారం అభయారణ్యం మెదక్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అభయారణ్య౦లో అపారమైన వృక్ష, జంతు జాతులున్నాయి. అడవి కుక్కలు, తోడేళ్ళు, చిరుతలు, అడవి పిల్లులు, జింకలు, లేళ్ళు, ఎలుగుబంట్లు వంటి జంతువులను మరియు కొంగలు, పట్టి వంటి తల ఉన్న బాతులు, బ్రాహ్మినీ బాతులు వంటి పక్షులను చూడవచ్చు.
చిత్ర కృప : Vivek Suriyamoorthy
ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం, ఆదిలాబాద్
ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. 136 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ వన్యప్రాణి అభయారణ్యం దక్కన్ పీఠభూమి లోని సుందరమైన ప్రకృతి దృశ్యాలకు నిదర్శనం. ఇక్కడి కొండలు, పచ్చిక బయళ్ళు ప్రకృతి రమణీయతకు ఆనవాళ్ళు.
చిత్ర కృప : telanganatourism.gov.in
పులికాట్ సంక్చురి, నెల్లూరు
పులికాట్ సంక్చురి చెన్నై కి 60 కి. మీ. దూరంలో ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల మధ్యలో 500 చ. కి. మీ. వైశాల్యంలో ఉన్నది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ ఫ్లెమింగో. ప్రతి సంవత్సరం పదిహేను వేల ఫ్లెమింగోలు పులికాట్ సరస్సును సందర్శిస్తాయి. రకరకాల జాతి పక్షులు, కొంగలు, బాతులు ఈ ప్రదేశంలో సంచరిస్తూ ఉంటాయి.
చిత్ర కృప : Manvendra Bhangui
రొల్లపాడు పక్షి అభయారణ్యం, కర్నూలు
రొల్లపాడు పక్షి అభయారణ్యం కర్నూలు జిల్లా కి 60 కి. మీ. దూరంలో నందికోట్కూర్ సమీపాన 614 చ. కి. మీ. విస్తీర్ణంలో ఉన్నది. ఇక్కడ అనేక రకాల పక్షి జాతులు కనిపిస్తాయి. మైనా, ఇండియన్ బస్టర్డ్, ఇండియన్ రోలర్ వంటి అరుదైన పక్షులతో పాటు ఇండియన్ కొబ్రా, గుంట నక్క వంటి అడవి పంతువులు చూడవచ్చు.
చిత్ర కృప : Supreet Sahoo
షామీర్ పేట లేడి అభయారణ్యం, శామీర్ పేట
శామీర్ పేట సికంద్రాబాద్ కి 27 కి. మీ. దూరంలో ఉన్న బొల్లారం కాంటోన్మెంట్ పరిధిలో కరీంనగర్ వెళ్లే దారిలో ఉన్నది. ఇక్కడ ఒక సరస్సు మరియు జింకలు ప్రధాన ఆకర్షణ. ఆకు పచ్చని పొదళ్లు, రాళ్ళ మధ్యలో నుంచి ప్రవహిస్తున్న నీటి ప్రవాహం ఈ ప్రాంత అందాల్ని మరింతగా పెంచుతుంది.
చిత్ర కృప : ambati rayudu
శివారం వన్యప్రాణుల అభయారణ్యం, కరీంనగర్
శివారం వన్యప్రాణుల అభయారణ్యం కరీంనగర్ జిల్లా మంథనికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనేక జంతువులు, సరీశృుపాలు ఇక్కడ నివసిస్తాయి. దట్టమైన చెట్లతో నిండిన ఈ అరణ్యం 37 చ. కి. మీ. వరకు విస్తరించి ఉంటుంది. ఇక్కడ ప్రవహించే నది మొసళ్ళకు నిలయం. చిరుతపులులు, ఎలుగు బంట్లు, చిరుతలు, కొండ చిలువ లు ఇక్కడ కనిపిస్తాయి.
చిత్ర కృప : telanganatourism.gov.in
శ్రీ వెంకటేశ్వర జూ లాజికల్ పార్క్, తిరుపతి
శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్ 1987 సెప్టెంబర్ 29న స్థాపించబడింది. 5,532 ఎకరాల వైశాల్యంలో విస్తరించి ఉన్న ఈ పార్క్ మగ కోడి, జింక, చిలక, చిరుత, అడవి ఏనుగులకి ఆవాసం. శాకాహార, మాంసాహార స్థలాలు, మగకోడి నివాస స్థలానికి పక్కన విస్తరి౦చీ ఉన్న పచ్చని మైదానాలు ఇక్కడ పెద్ద ఆకర్షణగా ఉన్నాయి.
చిత్ర కృప : Adityamadhav83
శ్రీశైలం సంక్చురి , శ్రీశైలం
శ్రీశైలం సంక్చురి ఇండియాలోనే పేరుపొందిన అతి పెద్ద టైగర్ రిజర్వ్ కేంద్రం గా ఉన్నది. సుమారుగా 3568 చ. కి. మీ. వైశాల్యంలో విస్తరించిన ఈ ప్రదేశం అనేక రకాల జంతువులకు, పక్షులకు ఆవాసంగా ఉన్నది. మీ కంటికి ఎటువంటి జంతువులు కనిపించకపోయినా, ఈ ప్రదేశంలో తిరిగి రావటమే సాహసం గా భావించాలి. ఇక్కడ ఎక్కువగా పెద్ద పులులు సంచరిస్తూ ఉంటాయి.
చిత్ర కృప : Manisha23may
శ్రీలంక మల్లేశ్వర సంక్చురి , కడప
శ్రీలంక మల్లేశ్వర సంక్చురి కడప కి కడపకి 15 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ జింకలు, సాంబార్, నక్కలు ప్రధానంగా కనిపిస్తుంటాయి.
చిత్ర కృప : andhra pradesh tourism
అమ్రాబాద్ పులుల సంరక్షణా కేంద్రం, శ్రీశైలం
శ్రీశైలం వెళ్లే దారిలో ఉన్న అమ్రాబాద్ పులుల సంరక్షణా కేంద్రంలో అనేక అడవి జంతువులు ఉన్నాయి. రాత్రివేళ.. శ్రీశైలం వెళ్లే రహదారిపైకి ఇవి వస్తుంటాయి. రాత్రి తొమ్మిది తరువాత ఈ రోడ్లపై వాహనాల రాకపోకలు నిషేధించారు. అంతే కాకుండా అడవిలోపలికి ప్రయాణికులను తీసుకువెళ్లేందుకు ప్రత్యేకమైన జీవులు సిద్ధంగా ఉంటాయి. కమాండర్ జీపులో అడవిలో తిరగవచ్చు.కనుమరు గైపోతున్న పులుల సంరక్షణ కోసం దీనిని స్థాపించారు.
చిత్ర కృప : telangana.gov.in
కంబాలకొండ అభయారణ్యం, వైజాగ్
వైజాగ్ నగరంలో 71 చ. కి. మీ. ప్రాంతంలో కంబాలకొండ అభయారణ్యం విస్తరించి ఉన్నది. ఇక్కడ అంతరించి పోతున్న భారత చిరుతలు, రసెల్స్ వైపర్, భారత కొబ్రా, ఇండియన్ జాకాల్ వంటి జంతువులు ఇక్కడే కనిపిస్తాయి.
చిత్ర కృప : Saagar Vatnani