భారతదేశం యొక్క తూర్పు కనుమలలో ఒక అందమైన ట్రెక్కింగ్ బాట నాగలాపురం. ఇవి భారతదేశం యొక్క తూర్పు తీరంలో తూర్పు కనుమలలో గల చెదురుమదురు పర్వత శ్రేణులుగా వున్నాయి.
పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తూర్పు కనుమల రాష్ట్రాలలో వ్యాపించి వున్న పర్వత శ్రేణులు. దక్షిణ భారతదేశంలో పశ్చిమ కనుమలతో ముఖ్యంగా పోలిస్తే, నాగలాపురం ట్రెక్ చాలా అసాధారణమైనది. కానీ చాలా సహజంగా వుంటుంది.
నాగలాపురం గురించి
నాగలాపురం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఒక చిన్న గ్రామం. తిరుపతికి ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో గల ఒక ప్రసిద్ధ యాత్రా స్థలం. రోడ్డు మార్గం సౌకర్యవంతంగా ఉంది. చెన్నై మరియు నాగలాపుర గ్రామం మధ్య దూరం సుమారు 90 కి.మీ. నాగలాపురంగ్రామం నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో వున్న ఆరై గ్రామం నుండి కాలిబాట ప్రారంభమవుతుంది. శిబిరాల ట్రెక్కింగ్ కు నాగలాపురం పట్టణ పోలీసు అనుమతి పొందడం మంచిది. కాలిబాటకు దట్టమైన అడవుల గుండా నడవాల్సి వస్తుంది.
సందర్శించుటకు మంచి సమయం
ఇక్కడ గల దట్టమైన చెట్లు, చల్లని జలపాతాలు మరియు సహజ కొలనులు వేసవిలో ట్రెక్కింగ్ చేయడానికి ఆహ్లాదకరంగా వుంటుంది. ఇక్కడ వింటర్ ట్రెక్కింగ్ మరో ఆకర్షణ. వర్షాకాలంలో ట్రెక్కింగ్ అయితే నాగలాపురం కొండలలో కాలిబాట మార్గంలో జలగలు పొంచి వుంటాయి. అలాగే గోర్జెస్ చుట్టూ కాలిబాట చేసేటప్పుడు జారే అవకాశం వుంది. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి వర్షాకాలంలో వెళ్ళకుండా వుంటే మంచిది.
కాలిబాట
నాగలాపురం కొండలు తూర్పు నుండి పడమర లేదా పడమర నుండి తూర్పు వైపుకు వుంటుంది. ట్రెక్కింగ్ తూర్పు / పశ్చిమ భాగాన అదే మార్గంలో వెనుకకు చేరుకోవచ్చును. ట్రెక్కింగ్ దూరం సుమారు 13 కి.మీ వుంటుంది. ట్రెక్కింగ్ కు సులభంగా ఒక రోజు పడుతుంది. కొండ మీద అధిరోహించటానికి ట్రెక్కింగ్ సమయం సాధారణంగా 2-3 గంటలు పడుతుంది. ట్రెక్కర్స్ ఒక క్యాంప్ వేసుకొని రాత్రిపూట కొండ మీద స్టే చేయవచ్చును.
ట్రెక్ మార్గం మధ్యాహ్నసమయంలో కూడా దట్టమైన చెట్ల వల్ల ఆహ్లాదకరంగా చాలా చల్లగా వుంటుంది. కాలిబాటలో జలపాతాలు, ప్రవాహాలు మరియు నీటి కొలనులు ఎంతో రిఫ్రెష్ ను అందిస్తాయి. ఈ జలపాతాలు మరియు కొలనులు దగ్గర నడుస్తూ ఆనందిస్తూ ఆ ప్రశాంతతను అనుభవిస్తూ ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ వుండే వాళ్ళు అక్కడక్కడా ఆగి ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించావచ్చును.
ట్రెక్కింగ్ కు సంబంధించిన ముఖ్య విషయాలు
ట్రెక్ మార్గం వెంట ఉన్న జలపాతాల దగ్గర 3 అద్భుతమైన నీటి కొలనులు వున్నాయి. ఈ నీటి కొలనులలోని నీటి ప్రవాహం ఏ మాత్రం కూడా తగ్గకుండా వేసవిలో కూడా అలాగే ప్రవహిస్తూనే వుంటుంది. దీనిని 'మేజిక్ కొలనులు' అంటారు. మొదటి రెండు నీటి కొలనులు స్పష్టంగా, నిస్సారంగావుంటుంది. ఇక్కడ ఈత కొట్టే వాళ్ళు కొట్టవచ్చు. శిఖరాగ్రానికి సమీపంలో 30 అడుగుల లోతులో నీటిగుంటలు వున్నాయి. ఇక్కడ ఈత కొట్టడం అంతమంచిది కాదు. మూడో నీటి కొలను సహజమైన ప్రకృతి దృశ్యాలను కలిగి వుంది. కానీ ఇక్కడ జంప్ చేయాల్సొస్తుంది. ఈతలో బాగా అనుభవం వున్నవారు మాత్రమే ఈత కొడితే మంచిది. ఇక్కడ చాలా జాగ్రత్తగా వుండాలి.
ట్రెక్కింగ్ కు వెంట తీసుకువెళ్లవలసినవి
దుస్తులు (అదనపు జత), ఆహారం, మందులు, నీళ్ళ బాటిల్స్, దోమల రక్షణ కొరకు మొదలైనవి తీసుకువెళ్ళాలి. ఇక్కడికి ట్రెక్కింగ్ కై వచ్చే వారు దాదాపు ట్రావెల్ సంస్థలనే ఆశ్రయిస్తుంటారు. ఒక్కొక్కరికి 2500-3000 వరకు ఛార్జ్ వసూలు చేస్తారు. భోజనం, వసతి, గైడ్, పొనురాను ట్రాస్పోర్ట్ మొత్తం ట్రావెల్ సంస్థలదే భాద్యత. సొంతంగా వెళ్లే వారికి ఈ సౌకర్యాలు ఏవీ ఉండవు కనుక తగినన్ని ఏర్పాట్లు చేసుకొని వెళితే బాగుంటుంది. సమీపంలో దుకాణాలు లేవు. తగిన ఆహారం మరియు త్రాగుటకు నీరు వెళ్ళటం మంచిది. అక్కడక్కడ నీటి వనరులు ఉన్నాయి. మీరు రాత్రిపూట వుండాలనుకుంటే స్లీపింగ్ బ్యాగ్స్, స్లీపింగ్ మ్యాట్స్, టార్చ్ తీసుకువెళ్లటం మంచిది.