అంకాళమ్మ కోట మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల సరిహద్దులో విస్తరించి ఉన్న నల్లమల అడవులలో ఉంది. ఈ అటవి ప్రాంతంలో ప్రవహించే కృష్ణానది మధ్యలో ద్వీపకల్పంలా విస్తరించి ఉన్న భూభాగంలో 600 అడుగుల ఎత్తులో కొండ మీద 20 ఎకరాల స్థలంలో ఈ కోటను నిర్మించారు. ప్రస్తుతం కోట శిథిలావస్థలో ఉన్నా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండటంతో పర్యాటకులకు కనువిందు చేస్తూ అలరారుతూ ఉంది.
ఎక్కడ ఉన్నది ?
మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ కు 16 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున అంకాళమ్మ కోట ఉంది. ఈ భూభాగం కర్నూలు జిల్లా లోని ఆత్మకూర్ అటవీ డివిజన్ పరిధిలోని పెద్ద చెరువు ప్రాంతంలో ఉంది. ఈ కోటను 16 వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది.
అంకాలమ్మ కోట
చిత్రకృప : Kkkishore
కోటలోని నిర్మాణాలు
ఈ కోటలో కాళికాలయం, ఆంజనేయ స్వామి విగ్రహం, శివలింగం, పురాతన బావి ఉన్నాయి. ఇక్కడి కాళికాదేవికి అంకాళమ్మ అని పేరు. ఆమె పేరు మీదుగానే ఈ కోటకు అంకాళమ్మ కోట అని పేరు వచ్చింది. పేరు భయం కొల్పే విధంగా ఉండినా, అమ్మ వారు మాత్రం ప్రశాంత వదనంతో ఉంటుందంటారు. కోట జన బాహుళ్యంలోకి రాని నాడు, గుప్త నిధుల కొరకు కొందరు దుండగులు విగ్రహాలను ధ్వంసం చేస్తే, జాలరులు, అక్కడి చెంచులు, మరికొందరు భక్తులు విగ్రహాలను పునఃప్రతిష్టించారు. ఇక్కడ అమ్మవారి పూజారులు కూడా చెంచులే.
కొల్లాపూర్
కొల్లాపూర్ సంస్థానం మొదట జటప్రోలు సంస్థానం ఆధీనంలో ఉండేది. ఇక్కడ చాళుక్యులు, కాకతీయులు నిర్మించిన ఆలయాలు ఉన్నాయి. ఈ ఊర్లో మొత్తం 24 వరకు ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధి చెందినవి రెండు. ఒకటేమో మదనగోపాలస్వామి ఆలయం కాగా, మరొకటి మాధవస్వామి ఆలయం.
మదనగోపాలస్వామి ఆలయం
మదనగోపాలస్వామి స్వామి ఆలయాన్ని కొల్లాపూర్ సంస్థానాధీశులు నిర్మించారు. ఏడంతస్తుల గాలిగోపురం భక్తులను ఆకట్టుకుంటుంది. గర్భాలయంలో మురళీధరుడై, ఆవు నేపథ్యంతో ఉన్న మదన గోపాలుడి విగ్రహం ఉంటుంది.
కొల్లాపూర్ దేవాలయం
మాధవస్వామి ఆలయం
ఈ ఆలయం కొల్లాపూర్ పట్టణంలో ఉంది. దీనిని 16వ శతాబ్దిలో కొల్లాపూర్ సంస్థానాధీశుడు సురభి మాధవరాయలు కట్టించారు. శిల్పకళా శోభితమైన గుడిలో ప్రధాన దైవం మదన గోపాలుడు.
అంకాలమ్మ కోట సమీపంలో చూడవలసిన మరో ప్రదేశం సింగోటం. ఇక్కడ కొల్లాపూర్ సంస్థానాధీశుల కులదైవం నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. దీనినే సింగపట్నం అని కూడా పిలుస్తారు. ఇక్కడ నరసింహ సాగర్ చెరువు ఉన్నది. చెరువు పక్కనే కొండపైన రత్నగిరి లక్ష్మి దేవాలయం ఉన్నది. ఇక్కడి నుండి కింద కు చూస్తే మనోహరమైన పరిసరాలు, మధ్యలో చెరువు అందంగా కనిపిస్తాయి. ఇది కొల్లాపూర్ కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఆటోలలో ఎక్కి ఇక్కడికి చేరుకోవచ్చు.
ప్రత్యేక పూజలు
ప్రతి మంగళవారం ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. అందుకే ఆ రోజు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక దినాలలో కూడా భక్తులు బంధుమిత్రులతో వచ్చి జంతు బలిలు ఇచ్చి, అమ్మ వారికి పూజలు చేస్తుంటారు.
కోట చేరుకోవటానికి జలమార్గం
అంకాళమ్మ కోటకు ఎలా చేరుకోవాలి ?
అంకాళమ్మ కోటకు చేరుకోవటానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి జల మార్గం, మరొకటి రోడ్డు మార్గం. జల మార్గం ద్వారా మహబూబ్ నగర్ జిల్లా వాసులు, రోడ్డు మార్గం ద్వారా కర్నూలు జిల్లా వాసులు ఈ కోటకు వస్తుంటారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పర్యాటకులు, భక్తులు కొల్లాపూర్కు 8 కిలోమీటర్ల దూరంలో నల్లమల కొండల మధ్యన ఉన్న అమరగిరి గ్రామానికి చేరుకొని, అక్కడి నుండి కృష్ణానదిలో 8 కిలోమీటర్లు పుట్టీలలో, మోటార్ బోటులలో ప్రయాణించి అంకాళమ్మ కోటకు చేరుకుంటారు. కర్నూలు జిల్లా వాసులు ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని పెద్ద చెరువు ప్రాంతం వరకు లారీలు, ట్రాక్టర్లలో వచ్చి, అక్కడి నుండి కాలినడకన కోటకు చేరుకుంటారు.