వేల అడుగుల ఎత్తులో కొన్ని... వేల మీటర్ల పొడవుతో ఇంకొన్ని...భూ అంతర్భాగంలో కొన్ని...దేవుళ్ల పోలికలతో కొన్ని... దేవతలకు ఆవాసాలుగా కొన్ని... మనిషి కట్టని నిర్మాణాలతో ప్రకృతి చెక్కిన అద్భుతాలతో అబ్బురపరిచే గుహల సౌందర్యాన్ని వీక్షిద్దాం రండి...
బెలూం గుహలు కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో మండల కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు. బెలూం గుహలు విశాఖపట్నం జిల్లాలోని బొర్రా గుహల కంటే అతి పొడవైనవి.దేశ, విదేశీ, స్థానిక పర్యాటక ప్రదేశంగా ప్రత్యేకతలు ఎన్నో బెలూం గుహల సొంతం. పొడవైన సొరంగమార్గాలు, జాలువారే శిలాస్పటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు బెలూం గుహల ప్రత్యేకత .
చరిత్ర
బెలూం గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవని నిపుణుల అభిప్రాయం. క్రీ.పూ. 4,500 సంవత్సరాల ప్రాంతంలో అక్కడ మానవుడు నివసించినట్లు గుహల్లో లభించిన మట్టిపాత్రల ద్వారా తెలుస్తోంది.1884 లో మొదటిసారిగా రాబర్టు బ్రూస్ ఫూట్ అనే ఆంగ్లేయుడు బెలూం గుహల ఉనికి గురుంచి ప్రస్తావించాడు. 1982లో డేనియల్ జెబోర్ నాయకత్వంలో గుహలకు సంబంధించిన జర్మన్ నిపుణుల బృందం వీటిని సందర్శించి, పరిశీలించింది.మీకు తెలుసా?ఈ గుహలు భూగర్బంలో 10 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయని! 2002 ఫిబ్రవరిలో బెలూం గుహలను సందర్శించడానికి ప్రజలను అనుమతించారు.
ప్రస్తుతం ఎలా ఉంది?
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ(APTDC) ఈ గుహలను, చుట్టుప్రక్కల ప్రాంతాలను అభివృద్ధి పరుస్తోంది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధీనంలోకి వచ్చిన ఈ గుహలలో పర్యాటకుల కోసం 1.5 కిలోమీటర్ల దూరం వరకు సిమెంట్, స్లాబ్ రాళ్ళతో నడవటానికి అనుకూలంగా దారి నిర్మించారు. సహజత్వానికి లోపం రాకుండా బెలూం గుహల అందాలు ద్విగుణీకృతమయ్యే విధంగా విద్యుత్ దీపాలను అమర్చారు.దిగుడు బావి మాదిరిగా ఉన్న ప్రవేశద్వారాన్ని పూర్తి రూపురేఖలు మార్చేసి, భూమికి 20 మీటర్ల అడుగున ఉన్న గుహల్లోకి వెళ్లేందుకు మెట్లు నిర్మించారు. గుహల లోపల పర్యాటకులు ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు లోపలికి గాలిని పంపే ఆక్సిజన్ బ్లోయర్లు ఏర్పాటుచేశారు . గుహల లోపల ఫౌంటెన్ , కృత్రిమ కొలను ఏర్పాటు చేయటంతో, గుహలు మరింత అందాన్ని సంతరించుకున్నాయి. ఈ గుహలకు దిగుడు బావి వంటి మూడు దారులు ఉన్నాయి. మధ్యలో ఉన్న దారి గుహల్లోకి ప్రవేశద్వారంగా ఉపయోగపడుతోంది. ఈ గుహల్లోకి వెళ్లేదారి బిలంలా(రంధ్రంలాగా) ఉంటుంది. దాంతో వీటిని బిలం గుహలుగా పిలిచేవారిని, అదే పేరు కాలక్రమంలో బెల్లం గుహలుగా మారిందని భావిస్తున్నారు. బెలూం గుహల్లోని క్రీ.పూ. 4500 నాటి పాత్రల అవశేషాలు చూస్తే, వాటి పురాతనత్వం అర్థమవుతుంది.గుహల పైకప్పు నుంచి కిందికి వేలాడుతున్న స్పటికాల వంటి శిలాకృతులను ' స్టాలక్ టైట్ 'లని, కింది నుంచి మొలుచుకొని వచ్చినట్లు కనపడే ఆకృతులను 'స్టాలగ్ మైట్' లని అంటారు.వీటి రకరకాల ఆకారాలను బట్టి, స్థానికులు వీటికి కోటిలింగాలు, మండపం, సింహద్వారం,పాతాళగంగ వంటి పేర్లు పెట్టి పిలుస్తున్నారు. సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం పర్యాటకులను భక్తిభావంతో ముంచుతోంది.
ప్రవేశ చార్జీలు
బెలుం గుహల ప్రవేశ చార్జీ రూ.50/-(పెద్దలకు), బెలుం గుహల ప్రవేశ చార్జీ రూ.300/-(విదేశీయులకు)
బెలుం గుహల ప్రధాన ద్వారం
Photos Courtesy:Chittichanu
APTDC వారి పున్నమి హోటల్
Photos Courtesy:Chittichanu
బెలుం గుహల ప్రవేశ ద్వారం
Photos Courtesy:Pravinjha
బెలుం గుహల లోపలి భాగం
Photos Courtesy: Mahesh Telkar
బెలుం గుహల లోపలి మార్గం
Photos Courtesy:Praveen
శిలాజాలతో ఏర్పడిన పైకప్పు
Photos Courtesy:Praveen
రసాయన పదార్థాలతో ఏర్పడిన పైకప్పు
Photo Courtesy:Mahesh Telkar
మండపానికి వెళ్ళే దారి
Photo Courtesy:Mahesh Telkar
ఎలా వెళ్ళాలి?
వాయు మార్గం
బెలుం గుహల రావాలంటే హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ) ఎయిర్ పోర్టులో దిగి, అక్కడి నుంచి వయా జడ్చర్ల, కర్నూలు, బనగానపల్లె,అవుకు మీదుగా రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.
రైలు మార్గం
తాడిపత్రి రైల్వే స్టేషన్ లో గాని లేదా బేతంచెర్ల రైల్వే స్టేషన్ లో గాని దిగి , అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. రోడ్డుమార్గం ద్వారా ప్రయాణీంచేటప్పుడు అవుకు రిజర్వాజర్ కనిపిస్తుంది.
రోడ్డుమార్గం
బెలూం గుహలు చేరుకోవాలి అంటే కర్నూలు, బేతంచెర్ల, బనగానపల్లె నంద్యాల మీదుగా లేదా అనంతపురం జిల్లా తాడిపత్రి మీదుగా లేదా వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మీదుగా రోడ్డుమార్గం ద్వార చేరుకోవచ్చు.బెలూం గుహలు కర్నూలుకు 110 కిలోమీటర్లు, హైదరాబాద్ కు 320 కిలోమీటర్లు, బెంగుళూరు కి కూడా 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. నంద్యాలకు 70 కిలోమీటర్లు, తాడిపత్రికి 35 కిలోమీటర్లు, జమ్మలమడుగుకు 75 కు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
బెలుం గుహలకు కర్నూలు నుండి పల్లె వెలుగు బస్సు ఉదయం 07.30 గంటలకు మధ్యానం 03.00 గంటలకు ప్రతి ఆదివారం ఉంది. రూ. 39.00 పెద్దలకు ,రూ. 20.00 పిల్లలకు టికెట్ చార్జీగా ఉన్నది.(110 కి. మీ.)
బెలుం గుహలకు బనగానపల్లె నుంచి పల్లె వెలుగు ప్రతి రోజు ఉదయం 05.00 గంటల నుండి ప్రతి 20 నిమిషాలకొకసారి ఉంది. రూ. 13.00 పెద్దలకు ,రూ. 07.00 పిల్లలకు టికెట్ చార్జీగా ఉన్నది.(35 కి. మీ.)