చిన్నప్పుడు ఊర్లో సంతల గురించి వినే ఉంటాం. ఇవి సాధారణంగా పల్లెటూర్లలో, ఒక మోస్తరు బస్తీ లలో జరుగుతుంటాయి. వారానికోసారి కూరగాయల సంత, ఒక్కోసారి పశువుల సంత (పండగ సీజన్లలో - సంక్రాంతి అప్పుడు) జరగటం ఆ ఆ ఊర్లలోని ఆనవాయితీ. కూరగాయల సంతలో ఆకుకూరలు, కూరగాయలు అమ్మటం మరియు పశువుల సంతలో ఎద్దులు, ఆవులు, మేకలు, పొట్టేళ్లు అమ్ముతుంటారు.
ఇక్కడివరకు బాగుంది ... ఐతే ఏనుగులు అమ్మే సంత కూడా కొన్ని ఊర్లలో జరుగుతుంటాయి. అక్కడ ఒక్కో ఏనుగు ధర 10 లక్షలు పైమాటే. ఏనుగులే కాకుండా ఒంటెలు, గుర్రాలు కూడా అమ్ముతుంటారు ఆ సంతలో. కావలసిన వారు కొనుగోలు చేస్తుంటారు. దక్షిణ భారతదేశంలో ఇటువంటి సంతలు మనకు కనిపించవు. కానీ ఉత్తర భారతదేశంలో చాలా వరకు ఊర్లలో ఈ తరహా 'పశువుల సంత (క్యాటిల్ ఫెస్టివల్) ' నిర్వహిస్తుంటారు.
భారతదేశంలో 7 ప్రసిద్ధి చెందిన పశువుల సంత చెప్పుకోదగ్గవి. వాటి వివరాలలోకి వెళితే ...
సోనేపూర్
సోనేపూర్ (సోన్పూర్) బీహార్ రాష్ట్రంలో కలదు. పాట్నా కు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో 'దేశంలోనే అతి పెద్ద పశువుల సంత' నిర్వహిస్తారు. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు ఇక్కడ దొరుకుతాయి. ఈ సంత కార్తీక పూర్ణిమ నాడు (నవంబర్ మాసం -13 వ తేదీ) ప్రారంభమై పది రోజుల పాటు జరుగుతుంది. సోనేపూర్ మేళా లో హాతి బజార్ ప్రధాన ఆకర్షణ. ఏనుగులను అమ్మటం కోసం అందంగా ముస్తాబుచేసిఉంటారు.
చిత్రకృప :Abhifrm.masaurhi
నాగౌర్
ఇది ఇండియాలో రెండవ అతిపెద్ద పశువుల సంత. ఈ సంత సంవత్సరంలో 8 రోజులపాటు జనవరి - ఫిబ్రవరి నెలల మధ్య జరుగుతుంది. నాగౌర్, బికనీర్ - జోద్పూర్ మధ్యన కలదు. అమ్మటానికి అందంగా అలంకరించిన ఒంటెలను కొనుక్కోవటానికి రాజస్థాన్ లోని గ్రామీణ ప్రజలు ఆసక్తి కనబరుస్తుంటారు.
చిత్రకృప :Marc Riboud
ఝలావర్
ఝలావర్ పశువుల సంత ను చంద్రభాగ ఫెయిర్ అని కూడా పిలుస్తారు. ప్రతి ఏడాది ఝలావర్ జిల్లాలోని చంద్రభాగ సరస్సు ఒడ్డున ఈ సంతను నిర్వహిస్తారు కనుకనే దానికాపేరు. కార్తీక పూర్ణిమ చివరి రోజులలో అనగా నవంబర్ 27-29 మధ్యలో ఈ ఫెయిర్ జరుగుతుంది.
చిత్రకృప : Footprint Books
పుష్కర్
రాజస్థాన్ లోని పుష్కర్ లో ప్రతిఏటా పశువుల సంత ను ఐదు రోజులపాటు జరుపుతారు. 'పుష్కర్ కేమెల్ ఫెయిర్' భారతదేశంలో నిర్వహించే అతిపెద్ద ఒంటెల సంత మరియు పర్యాటక ఆకర్షణ. ఒంటెలతో పాటు ఆవులను, గొర్రెలను అమ్ముతుంటారు. వచ్చే సందర్శకులను అలరించటానికి మీసాల పోటీలు, ఒంటెల రేసులు, కుస్తీలు నిర్వహిస్తారు.
చిత్రకృప :Jason Rufus
కొలయాత్ ఫెయిర్
కొలయాత్ ఫెయిర్, రాజస్థాన్ రాష్ట్రంలో జరిగే పశువుల సంతలలో ఒకటి. ఇది బికనీర్ జిల్లాలో జరుగుతుంది. గేదెలు, గుర్రాలు, ఒంటెలు మరియు ఇతర పశువులను ఇక్కడ అమ్ముతుంటారు. డిసెంబర్ లో నిర్వహించే కొలయాత్ ఫెయిర్ లేదా కపిల్ ముని ఫెయిర్ బికనేర్ జిల్లాలో అతిపెద్దది.
చిత్రకృప :Marina & Enrique
ఆగ్రా
యమునా నది ఒడ్డున, ఆగ్రా సమీపంలోని బతేశ్వర్ లో అజరిగే సంత ను 'ఆగ్రా ఫెయిర్' లేదా 'బతేశ్వర్ ఫెయిర్' అని పిలుస్తారు. ప్రతి ఏడాది నవంబర్ నెలలో పెద్ద ఎత్తున జరిగే ఈ ఫెయిర్ కు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నలుమూల నుండి గ్రామీణ ప్రజలు హాజరవుతారు.
చిత్రకృప :jack wickes
గంగాపూర్
రాజస్థాన్ లోని భిల్వారాకు సమీపంలో గల గంగాపూర్ లో పశువుల సంత జరుగుతుంది. గంగాపూర్ ప్రాంతం భిల్వారా - ఉదయపూర్ రోడ్డు మార్గంలో కలదు. స్థానిక గంగా దేవత పేరు మీద ఈ ఊరికి ఆపేరొచ్చింది.
చిత్రకృప :Arindam Mitra
మిగితా ప్రాంతాలలో
ఇండియాలో మిగితా ప్రాంతాలలో కూడా పశువుల సంత జరుగుతుంది. వాటిలో చెప్పుకోదగ్గవి: కరౌలి, నల్వరి, కుందా, రామ్ దెవొ మరియు కూల్ కుందా పశువుల సంత లు ముఖ్యమైనవి.
చిత్రకృప :Rich Young