శ్రీకృష్ణదేవరాయలు .. తెలుగునాట ఈయన పేరు తెలియనివారుండరు. తెలుగుభాష అన్న, తెలుగు ప్రజలు అన్న ఆయనకి మక్కువ ఎక్కువ. ఆయన కాలం ఒక స్వర్ణయుగం. రాయలవారి పాలనలో వజ్రాలను రాసులుగా పోసి అమ్మేవారు. వెంకటేశ్వర స్వామికి గొప్ప భక్తుడు రాయలవారు.
విజయనగర సామ్రాజ్య కాలంలో తెలుగునాట ఎన్నో చరిత్రక కట్టడాలు నిర్మించబడ్డాయి. వాటిలో చాలావరకు శిధిలావస్థ దశలో ఉన్నాయి. కానీ, ఆనాటి వైభవాన్ని చాటుతూ ఠీవిగా, చెక్కుచెదకుండా నిల్చున్న శత్రుదుర్భేద్యమైన "చంద్రగిరి కోట" చిత్తూరు జిల్లాలో కలదు.
నాగలాపురం ట్రెక్ - ప్రకృతి స్వర్గంలోకి ప్రయాణం !
తిరుపతి కి అతి చేరువలో కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మహాకట్టడం యొక్క చెక్కుచెదరని కళావైభవం నేటికీ సజీవంగా ఉండి చూపరులను ఆకర్షిస్తున్నది. 'చంద్రగిరి' శ్రీకృషదేవరాయల ఆస్థానంలో ఉండే మహామంత్రి తిమ్మరుసు స్వస్థలం. సుందర లోయలో అర్థ చంద్రాకారంగా ఉన్న కొండ పాదభాగంలో కోటను నిర్మించడం వలన దీనిని చంద్రగిరి దుర్గం అని పిలిచేవారు. చంద్రగిరి దుర్గం గురించి మరికొన్ని విశేషాలు ...
అభయారణ్యంలో ... వేంకటేశ్వరుని దర్శనం !!
చంద్రగిరి కోట
చంద్రగిరి కోటను క్రీ.శ. 11 వ శతాబ్దంలో యాదవ నాయుడు వంశీయులు నిర్మించారు. ఈ ప్రాంతం విజయనగర రాజుల హస్తగతం అయ్యేవరకు వీరే ఆ ప్రాంతాన్ని పాలించారు (మూడు శతాబ్దాల వరకు).
చిత్రకృప : Bhaskaranaidu
విజయనగరరాజులు
విజయనగర రాజులలో ఒకరైన సాళువ నరసింహ రాయలు ఈ ప్రాంతాన్ని క్రీ.శ. 1367 లో జయించి, దీనిని విజయనగర సామ్రాజ్యం యొక్క నాల్గవ రాజధానిగా ప్రకటించెను.
చిత్రకృప : Rajeshvayala
కోట గురించి కొన్ని మాటల్లో ..
చంద్రగిరి కోట చుట్టూ కోలోమీటర్లు మేర దృఢమైన గోడ కలదు. ఏనుగుల సహాయంతో పెద్ద పెద్ద రాళ్లను మోసుకొని వచ్చి నిర్మించారని తెలుస్తుంది. గోడకు అవతలివైపు (బయటివైపుగా) ఒక పెద్ద కందకము ఉన్నది. అప్పట్లో ఇందులో మొసళ్ళను పెంచేవారట. ప్రస్తుతం ఈ కందకము పూడిపోయినది.
చిత్రకృప : Bhaskaranaidu
రాజమహల్
చంద్రగిరి కోట లో ప్రధాన భవనం, రాజమహల్. శ్రీకృషదేవరాయలు తిరుమల వెంకటేశ్వర స్వామి ని దర్శించేటప్పుడు ఇక్కడే విడిదిచేసేవారు. అచ్యుతదేవరాయలను ఇక్కడే గృహనిర్బంధంలో ఉంచారు. ఇతను శ్రీకృష్ణదేవరాయల సవతి సోదరుడు. రాజమహల్ ను ప్రస్తుతం మ్యూజియం గా మార్చారు.
చిత్రకృప : D13nidhi
శ్రీకృష్ణదేవరాయ కాలం తర్వాత
శ్రీకృష్ణదేవరాయల కాలం తర్వాత విజయనగర సామ్రాజ్యం పతనమై, చిన్న రాజ్యంగా అవతరించింది. అప్పుడు రాజధానిగా చంద్రగిరి సేవలందించింది.
చిత్రకృప : Adiseshkashyap
చంద్రగిరి కోట
16 వ శతాబ్దంలో కొండ పైభాగాన ఒక పెద్ద సైనిక స్థావరం నిర్మించారు అప్పటి బ్రిటీష్ అధికారులు. వారి అవసరముల నిమిత్తము రెండు చెరువులను నిర్మించి, కింద ఉన్న పెద్ద చెరువు నుండి పైకి నీటిని పంపించేవారని కోలోని మ్యూజియం ద్వారా తెలుస్తుంది.
చిత్రకృప : Matteo
గుర్రపు శాల కావొచ్చు ??
రాణీ మహల్ రెండు అంతస్తులుగానూ, రాజ మహల్ మూడు అంతస్తులుగానూ ఉంది. రాణీ మహల్ పేరుకే రాణీమహల్ అని ఇప్పుడు పిలుస్తున్నారు కానీ దీని వాస్తునుబట్టి ఇది ఒక గుర్రపు శాల కావచ్చని అక్కడి బోర్డునందు వ్రాసి ఉంది.
చిత్రకృప : Bhaskaranaidu
ఆరు స్తంభాలు
రాణీమహల్ వెనుక కొంచెం దూరంగా కోట నీటి అవసరాలకోసం ఒక దిగుడు బావి కలదు. దీనినుండే అంతఃపుర అవసరాల కొరకు నీటిని సరఫరా చేసే వారని తెలియ చేయబడింది. ఈ బావికి కొద్ది దూరములో మరణశిక్ష పడ్డ ఖైదీలను ఉరి తీసేందుకు ఆరు స్తంభాలు కలిగి ఉపరితలమునకు నాలుగు రింగులు ఉన్న చిన్న మండపము ఉన్నాయి.
చిత్రకృప : Matteo
మొదటి అంతస్తు
రాజమహల్ లో మొదటి అంతస్తును మ్యూజియంగా మార్చారు. ముస్లిం పాలకులు నాశనం చేయగా మిగిలిన శిల్పాలు, చంద్రగిరి వైభవాన్ని తెలిపే శాసనాలు లాంటివి ఇందులో ఉన్నాయి.
PC: Bhaskaranaidu
రెండవ అంతస్తు
రాజమహల్ రెండవ అంతస్తులో సింహాసనాలతో కూడిన అప్పటి దర్బారు లేదా సభా దృశ్యాన్ని చూడచ్చు.
PC: Bhaskaranaidu
మూడవ అంతస్తు
రాజమహల్ మూడవ అంతస్తులో అప్పటి కోట నమూనా, ప్రజలజీవన విధానం లాంటివి ప్రదర్శన కొరకు ఉంచారు. ఇదే అంతస్తులో రాజప్రముఖుల గదులు ఉన్నాయి.
PC: Lakshmaiah.nellore
తోటలు
చాలా వరకూ పాడైన దేవాలయాలు వదిలేసి కొంత బాగున్న రాణీమహల్ మరియు రాజమహలు, వీటివెనుక ఉన్న చెరువు మొదలయినవాటిని బాగుచేసి కొంత వరకూ తోట వేసి అన్ని చోట్లా మొక్కలు పెంచి సందర్శకులకు ఆహ్లాదంగా ఉండేలా మార్చారు.
PC: Bhaskaranaidu
సౌండ్, లైటింగ్ షో
రాజమహల్ కు వెనుక ఖాళీ ప్రదేశంలో పెద్ద ఓపెన్ దియేటర్ మాదిరిగా మార్చి, దృశ్య కాంతి శబ్ధ (సౌండ్,లైటింగ్ షో) ప్రదర్శనం చేస్తారు. ఈ ప్రదర్శనకు ఇరవై ఐదు రూపాయలు సామాన్య రుసుము ఉంది. ఈ ప్రదర్శన ద్వారా పెనుకొండ, చంద్రగిరి సంస్థానాలు ఎలా నాశనమయిపోయాయో కళ్ళకు కట్టినట్లుగా కాంతి, శబ్దాల ద్వారా వివరించబడుతుంది. ఈ ప్రదర్శన తెలుగు మరియు ఆంగ్ల భాషయందు ఉంది. ఆంగ్ల బాషలో వ్యాఖ్యానము అమితాబ్ బచ్చన్ స్వరంలో వినవచ్చు.
సందర్శన సమయం
చంద్రగిరి కోటను సందర్శించు సమయం : వారంలో అన్ని రోజులలో (శుక్రవారం తప్పనిచ్చి) తెరుస్తారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 : 45 వరకు సందర్శించవచ్చు. ఒక్కొక్కరు 100 రూపాయలు చెల్లించాలి. సౌండ్ సిస్టం, లైట్ సిస్టం కొరకు అదనంగా రూ. 20/- పెద్దలు,రూ. 10/- పిల్లలు చెల్లించాలి.
చిత్రకృప : Archana Sabunkar
ఇతర ఆకర్షణలు
చంద్రగిరిలోని దేవాలయములు : ములస్తానమ్మతల్లి దేవస్థానం, మిట్ట గంగమ్మ తల్లి దేవస్థానం, పంచ పాండవులు, ద్రౌపతీదేవి దేవాలయం, సువర్ణముఖీ నది ఒడ్డున ఉన్న పాడుబడ్డ దేవాలయాలు, తొండవాడకు వెళ్లే మార్గంలో ఎడమవైపున పొలాల్లో పురావస్తువేత్తలు భద్రపరచిన పాడుబడ్డ దేవాలయం, చంద్ర గిరి కోట పరిసరాల్లోని అనేక పాడుబడ్డ దేవాలయాలు (వీటినే సౌండ్ అండ్ లైట్ షోలో అధ్బుతంగా ఉపయోగించుకున్నారు), నర్శింగాపురం/శ్రీనివాసమంగాపురం దారిలోని శివాలయం మరియు చంద్ర గిరి సెంటర్ లో నమాజ్ టైంలో మోగించే పెద్ద అలారం స్తంభం.
చిత్రకృప : Amol.thikane
తిరుపతి
చంద్రగిరి కి తిరుపతి సమీపాన ఉన్న పెద్ద నగరం. తిరుపతి కి దేశం నలుమూల నుండి విమాన, రైలు మరియు బస్సు సదుపాయం కలదు. తిరుపతి నుండి చంద్రగిరి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తిరుపతి నుండి ప్రభుత్వ బస్సులలో లేదా ప్రవేట్ వాహనాలలో (షేర్ ఆటోలు, జీపులలో) చంద్రగిరి సులభంగా చేరుకోవచ్చు.
చిత్రకృప : Bhaskaranaidu