మీరెప్పుడైనా గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ తో కలిసి ఫొటోలు దిగారా ? ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, అబ్దుల్ కలాం లాంటి ప్రముఖుల నుండి సత్కారాలు, మెడల్స్ పొందారా ? బ్రూస్లీ, జాకీచాన్ లాంటి కుంగ్ఫు, కరాటే మాస్టర్లతో ఫైట్ చేశారా ? ఏంటీ సాధ్యం కానీ విషయాలు గురించి అంటున్నాను అనుకుంటున్నారా ? అయితే క్లిక్ ఆర్ట్ మ్యూజియం గురించి మీరు చెప్పాల్సిందే !
కళ్ళ ముందు కనికట్టు చేసినట్టుగా ... నమ్మలేని విధంగా ఉండేటట్లు అద్భుతంగా చిత్రీకరించే 3డీ చిత్రాల గురించి తెలిసిన విషయమే! ఇదివరకు x - axis, y -axis వరకే చిత్రాలను గీసేవారు. ఇప్పుడు దీనికి తోడు z - axis కొత్తగా వచ్చి చేరింది. ఈ మూడు axis లను కలిపి గీసే చిత్రాలే 3D చిత్రాలు. ఒకే ఇది మాథ్స్ థియరీ లెండీ! అసలు విషయానికి వద్దాం !
చిత్రకృప : official website
అయితే ఈ 3డీ చిత్రాల కోసం భారత్లో తొలిసారిగా తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరంలో ఈస్ట్ కాస్ట్ రోడ్డులో ''క్లిక్ ఆర్ట్ మ్యూజియం'ను ఏర్పాటు చేశారు. ఇండియాలో మొట్టమొదటి ట్రిక్ ఆర్ట్ మ్యూజియం కూడా ఇదే ! ఇందులో 3D చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
కళ్ళను కనికట్టు చేసే ఈ అద్భుత దృశ్యాల కళాఖండాలు అంతా ఒక గదిలో ఉన్నాయి. పడవపై పై షికార్లు చేస్తూ ఒక జంట కనువిందు చేస్తుంటే ... మరోవైపు బ్రూస్లీ పంచ్ తింటూ ఓ కుర్రాడు కనిపిస్తుంటాడు. డైనోసార్ నోట్లో నుంచి నిప్పులు చిమ్ముతుంటే ఆ మంటలను ఆర్పటానికి చిన్నారులు, పెద్దలు నీళ్లు చిమ్ముతుంటారు. ఇందంతా త్రీడీ సృష్టే. చిన్నారులు, యువకులు పోటీపడుతూ ఈ చిత్రాల వద్ద సెల్ఫీలు దిగుతూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ మ్యూజియం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు డెబ్బై వేల పైచిలుకు పర్యాటకులు సందర్శించారు. 10 లక్షలు పైగా సెల్ఫీలు, ఫోటోలు దిగారు.
చిత్రకృప : official website
పెయింటింగ్స్ అన్ని గోడలపైనే చిత్రీకరించారు. వీటితో ఫోటోలు దిగితే మనమూ వాటితో ఫోటోలు దిగినట్లు కనిపించడం విశేషం. మ్యూజియంలోని చిత్రాలన్నీ 2D చిత్రాలే కానీ మన కంటికి ఇవి త్రీడిల కనిపిస్తాయి.
ఈ చిత్రాలను వేసిన చెయ్యి ప్రముఖ చిత్రకారుడు ఏపీ శ్రీధర్. మాజీ రాష్ట్రపతి కలాం చేతుల మీద మొక్కను ఆదుకోవటం, మదర్ థెరిస్సా దీవించడం, ఫోటో ప్రేమ్ నుండి డైనోసార్ బయటికి వచ్చి పొగ చిమ్మడం, పాము బుస కొట్టడం మొదలైన చిత్రాలను ఎంతో సుందరంగా సృష్టించారు.
చిత్రకృప : official website
ఈ చిత్రకళకు సుమారు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. లియనార్డో డావిన్సీ వంటి చిత్రకారులు ఆ కాలంలోనే క్లిక్ ఆర్ట్ని గీశారట. ఆధునిక యుగంలో ఆస్ట్రేలియా వంటి పలు దేశాల్లో ఈ కళ సుపరిచితమే. ఏపీ శ్రీధర్ తొలిసారి భారతీయులకు ఈ కళను పరిచయం చేయడం చెప్పుకోగదగ్గ అంశం. కాగా, ఈ ప్రదర్శనను తిలకించేందుకు పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.100లు ప్రవేశరుసుముగా నిర్ణయించారు.
చిత్రకృప : official website
క్లిక్ ఆర్ట్ మ్యూజియంలో ఆప్టికల్ ఇల్యూషన్ ను అమర్చుతారు. ఇవి సందర్శుల మదిలో విభిన్న చిత్రాలను రూపొందించి వారు ఇంకో లోకంలోకి వెళ్ళేటట్లు అనుభూతిని కల్గించడం 3డీ ప్రత్యేకత. మేధస్సు కు పని చెప్పడం, జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవటం, ఆనందం కలిగించటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
త్వరలోనే క్లిక్ ఆర్ట్ మ్యూజియం ను దేశంలోని మరికొన్ని నగరాలలో ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో హైదరాబాద్, తిరుపతి, వైజాగ్ నగరాలు కూడా ఉన్నాయి.
సందర్శన సమయం : డఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.