పర్యాటక స్థలం : ఎలగందల్ కోట (లేదా) ఎల్గందల్ కోట
జిల్లా : కరీంనగర్
రాష్ట్రం : తెలంగాణ
సమీప పట్టణం : కరీంనగర్ - 16 కి.మీ.
కోటకు గల మరో పేరు : బహుధాన్యాపురం కోట
ఎలగందల్ కరీంనగర్ జిల్లాలో కలదు. ఇదొక గ్రామము. ఈ గ్రామం కరీంనగర్కు 16 కిలోమీటర్ల దూరంలో కామారెడ్డి రోడ్డు మార్గంలో మానేరు నదీతీరంలో ఉన్న చారిత్రక గ్రామం. కాకతీయుల కాలం నాటి సామంతుల పాలనలో వైభవాన్ని చాటుకుంది. నిమ్మల (నిర్మల్) పాలకుడు శ్రీనివాసరావు కాలంలో ఇది అతని అధీనంలో ఉండేది. 1754లో ఎలగందల్ కోటకు ధ్వంస అధిపతిగా ఉన్నప్పుడు నిజాం నవాబు ఆసఫ్ జా ఆజ్ఞ మేరకు శ్రీనివాసరావును బంధించి అతను పాలకుడయ్యాడు. 1905 వరకు ఎలగందల్ జిల్లాకు రాజధానిగా ఉంది. 1905లో రాజధాని కరీంనగరుకు మార్చి, జిల్లా పేరును కూడా కరీంనగర్ జిల్లాగా మార్చబడింది.
ఎలగందల్ కోట
చిత్రకృప : Naveen Gujje
గ్రామనామం
పూర్వం ఈ ఊరి పేరు బహుధాన్యానగరం. కాకతీయుల కాలం నుండి ఎలిగందులగా పిలవబడుతున్నది. ఈ గ్రామం చుట్టు పక్కల పూర్వం తెల్ల కందులు ఎక్కువగా పండేవట. అలా తెల్లకందుల, ఎలగందులగా మారి పేరు స్థిరపడిందని చెబుతారు. తెల్లకందుల అన్న పేరు చింతామణి చెరువు వద్ద ఉన్న శాసనంలో స్పష్టంగా చెక్కబడి ఉంది.
ఎలగందల్ కోట
ఎలగందల్లో ఓ పురాతనమైన కోట (ఖిల్లా) ఉంది. ఎత్తైన కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు, రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతోంది. టర్కీ మరియు ఫ్రెంచి ఇంజనీర్ల ప్రభావం వల్ల ఈ కోట అనేక విషయాల్లో మధ్యయుగపు ఐరోపా ఖండపు కోటలతో పోలి ఉంది. ఈ గిరిదుర్గాన్ని తొలుత కాకతీయులు కట్టించారు.
శత్రువుల బారి నుండి తప్పించుకునేందుకు ఎలగందల్ పాలకులు కోట చుట్టూ 15 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతైన నీటి కందకాన్ని ఏర్పాటుచేసి మొసళ్ళను వదిలేవారట !!
కోటలోని మసీదు
చిత్రకృప : వైజాసత్య
మానేరు నదీతీరంలో తాటిచెట్ల మధ్య సుందర ప్రకృతిక నేపథ్యంలో యలగందల్ కోట నిర్మించబడి ఉంది. కోటకు ఒకవైపు మానేరు నది, మరోవైపు ఎలగందల్ గ్రామం ఉన్నాయి. ఇక్కడ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మానాకొండూరు గ్రామానికి సొరంగమార్గమున్నదని ప్రతీతి. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఈ గిరి దుర్గం ఆ తరువాత బహుమనీలు, కుతుబ్షాహీలు, ఇమాద్ షాలు, అసఫ్జాహీల పాలనలో జిల్లా యొక్క రాజకీయాలకు కేంద్రబిందువైంది.
ఇది కూడా చదవండి : రాముడు నడియాడిన రామగిరి ఖిల్లా !!
పురాతన జ్ఞాపక చిహ్నాలు కొండశిఖరాన ఉన్న కోట, తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన్ సరస్సు 1774లో జాఫర్ ఉద్దౌలా చేత నిర్మించబడింది. ముస్లిం సన్యాసులైన సయ్యద్ షా మునావర్ ఖాద్రి సాహెబ్, దూలా షాహ్ సాహెబ్, సయద్ మరూఫ్ సాహెబ్, షాహ్ తాలిబ్ బిస్మిల్లా సాహెబ్ మరియు వలీ హైదర్ సాహెబ్ల సమాధులు కదిలించినప్పుడు అక్కడ ఉన్న మినార్లు ఊగుతాయి. ఉన్నత పాఠశాల వద్ద మరోరెండు మీనార్లు ఉన్నాయి. ఈ మీనార్లు ఎక్కడానికి లోపలి నుండి మెట్లు ఉన్నాయి.
దో మినార్
ఈ గ్రామం లోనే ఇంకో చివర "దో మినార్" అనే కట్టడం ఉంది. ఇది ముస్లింలు పండగ రోజుల్లో ప్రార్థన చేసే ఈద్గా. దీనిని బహమనీ సుల్తానులు నిర్మించారు. దీని పైకి వెళ్ళడానికి లోపలి నుండి మెట్లు వుంటాయి.
కోట వద్ద పర్యాటకులు
చిత్రకృప : వైజాసత్య
ఎలగందల్ కోట కు రవాణా సదుపాయాలు
వాయు మార్గం : హైదరాబాద్ నుండి ఎలగందల్ కోట 180 కిలోమీటర్ల దూరంలో కలదు. శంషాబాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా టాక్సీ ఎక్కి ఎలగందల్ కోట వెళ్ళవచ్చు.
రైలు మార్గం : కరీంనగర్ లో రైల్వే స్టేషన్ కలదు. అక్కడి నుంచి ప్రవేట్ టాక్సీ లు లేదా బస్ స్టాండ్ వెళ్ళి ప్రభుత్వ బస్సుల్లో ఎక్కి ఎలగందల్ చేరుకోవచ్చు.
రోడ్డు మార్గం : కరీంనగర్ నుండి కమాన్ పూర్, బావుపేట మీదుగా ప్రైవేటు బస్సులు, ఆటోలు తిరుగుతుంటాయి. కరీంనగర్ నుండి కోట 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.