బల్లి ఒంటిమీద పడిందంటే జలదరించిపోతాం .. బల్లి అంటే భయపడేవారు లేకపోలేదు. సాధారణంగా ప్రతి ఇంట్లో బల్లులను చూస్తుంటాం గోడలపై. ఇది పాకే జీవి. కనుకనే గోడపై పాకుకుంటూ బల్పుల వద్ద లేదా ఇంట్లో వెలుతురు ఉన్న లైట్ ల వద్ద చిన్న చిన్న పురుగులను తింటూ ఉంటుంది.
బల్లి గురించి చాలా మందికి చాలా అపోహాలు ఉంటాయి. అది మీద పడితే మరణం అని, బల్లి ఉచ్చ పోస్తే ఆ ప్రదేశంలో చిన్న చిన్న గుల్లలు లేస్తాయని ఇలా రకరకాలుగా అపోహా పడుతుంటారు మనవారు. దీని నుండి విముక్తి పొందటానికి దోష నివారణ చర్యలు కూడా బల్లి శాస్త్రం అనే పుస్తకంలో వివరంగా రాశారు. ఇవి బయట బహిరంగ మార్కెట్ లో లభ్యమవుతాయి.
మరి అంత భయమున్నవారు, చివరికి ముట్టుకుంటే కూడా ఎదో జరిగిపోతుందనే అపోహ ఉన్నవారు కంచిలోని బల్లిని ఎందుకు తాకుతారు ? అలా వెళ్లి ముట్టుకొచ్చిన వారి మీద బల్లిపడిన "ఏమి కాదులే ! నేను కంచిలో బల్లిని తాకొచ్చాను" అని ఎందుకు అంటారు. ఇంతేకాదు ఒకవేళ ఎవరిమీదైనా బల్లిపడితే, కంచిలో బంగారు బల్లిని తాకొచ్చిన వారి కాళ్ళ మీద పడి ఎందుకు నమస్కరిస్తారు ? వీటన్నింటికీ సమాధానం ఏంటో తెలుసుకుందాం పదండి !!
ఇది కూడా చదవండి : ఉలి చెక్కిన పట్టణం ... మహాబలిపురం !
తమిళనాడులోని కంచి
బంగారు బల్లి అంటే ఎవరికైనా యిట్టె గుర్తొచ్చేది తమిళనాడులోని కంచిలో గల కామాక్షి అమ్మవారి ఆలయం. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని ముట్టుకుంటే దోషం వెళ్లి ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.
చిత్రకృప : SINHA
పురాణ గాధ
ఈ బంగారు బల్లి గురించి ఒక పురాణ గాధ ఉంది. అదేమిటంటే గౌతమ మహర్షి కి ఇద్దరు శిష్యులు ఉండేవారు. ఎప్పటిలాగే శిష్యులు కుండ పట్టుకొని నది తీరానికి వెళ్లి నీటిని తీసుకొస్తుండగా అందులో బల్లి పడింది. వారు చూసుకోలేదు.
చిత్రకృప : J LV Sairam
శాపం
దీన్ని గమనించిన గౌతమ మహర్షి శిష్యులిద్దరినీ బల్లి వలె మారిపొమ్మని శపించెను. శాప విముక్తి కోసం ఇరువురు మహర్షిని వేడుకొనగా, కాంచీపురం లోని వరదరాజపెరుమాళ్ ఆలయానికి వెళ్ళమని, అక్కడ పరిష్కారం లభిస్తుందని చెప్తాడు.
చిత్రకృప : Ssriram mt
శాప విముక్తి
ఇద్దరూ కూడా సరే అనుకోని వరదరాజపెరుమాళ్ ఆలయానికి వెళ్తారు. బల్లుల రూపంలో ఉండి స్వామి వారిని నిత్యం ప్రార్ధించగా, ఒకానొక రోజు శాపం నుండి వారిద్దరికీ విముక్తి లభిస్తుంది. ఈ సమయంలో సూర్యుడు, చంద్రుడు సాక్ష్యంగా ఉండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి, భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తాడు.
చిత్రకృప : Sangram Todkar
ఇంద్రుడు దోష నివారణకై
బంగారం అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అనే అర్థం వస్తుంది. సరస్వతి దేవి నుండి శాపం పొందిన ఇంద్రుడు దోష నివారణకై పెరుమాళ్ ఆలయంలో బల్లులను ప్రతిష్టించినట్లు మరో కధనం కలదు.
తలుచుకోండి .. వీలైతే దర్శించండి
ఇంట్లో బల్లి తిరుగుతున్నప్పుడు అది మీద పడితే ఎట్లా ? అనే అపోహ అందరికీ ఉంటుంది. అలా పడినపుడు వెంటనే కామాక్షి ఆలయంలోని బల్లిని తలుచుకొని స్నానం చేసి, ఇష్టదైనవాణ్ణి ఆరాదిస్తే దోషం పోతుందంటారు. ఏమోఇంకా దోషం ఉందేమో అనుకునేవారు కంచి అమ్మవారిని దర్శించుకొని బల్లులను తాకుతారు.
శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి క్షేత్రం
పౌరాణిక, చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఇక్కడ కలదు. ఇక్కడి అమ్మవారి మందిరం పై కప్పుకి రెండు బల్లులు చెక్కబడి ఉంటాయి.
చిత్రకృప : Sangram Todkar
కాంచీపురం లో ఇతర సందర్శనీయ స్థలాలు
కాంచీపురం లో విష్ణు దేవాలయాలు ప్రసిద్ధి. వీటితో పాటు ఏకాంబరేశ్వర ఆలయం, కంచి కామకోటి మఠం, వైకుంఠ పెరుమాళ్ ఆలయం, కైలాసనతర్ ఆలయం, దేవరాజ్ స్వామి ఆలయం, కంచి కుదిల్ మొదలైనవి చూడదగ్గవిగా ఉన్నాయి.
చిత్రకృప : Ssriram mt
ఎలా చేరుకోవాలి ?
వాయు మార్గం : కాంచీపురంకు 73 కిలోమీటర్ల దూరంలో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం కలదు.
రైలు మార్గం : కాంచీపురం లోని రైల్వే స్టేషన్ దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలతో కలపబడి ఉన్నది.
రోడ్డు మార్గం : చెన్నైలోని కోయంబేడు బస్ స్టాండ్ నుండి కాంచీపురానికి ప్రతిరోజూ బస్సులు తిరుగుతుంటాయి.
చిత్రకృప : Tshrinivasan