గతంలో కర్నూలు కోట లేదా కందనవోలు కోట చుట్టూ నాలుగు బురుజులు ఉండేవి. అందులో ఒకటే ఈ కొండారెడ్డి బురుజు. మిగితా మూడు శిధిలమైనా నేటికీ చెక్కు చెదరకుండా ఒక్క కొండారెడ్డి బురుజు మాత్రమే నిలిచింది.
కర్నూలు, ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. దీనినే 'కర్నూలు కోట' అని కూడా పిలుస్తారు. నగరం నడిబొడ్డున, పాత బస్ స్టాండ్ ఏరియా లో ఉన్నది. నగరంలో ఎక్కడి నుంచైనా పది రూపాయలు ఇచ్చి బురుజు చేరుకోవచ్చు. బురుజు మొత్తం ఎర్రటి ఇసుకరాళ్ళతో నిర్మించబడి ఉంటుంది. దీని పైకెక్కి చూస్తే నగరం అంతా సుందరంగా కనిపిస్తుంది.
కొండారెడ్డి బురుజు
కర్నూలు కోటను రాయలసీమ ను పాలించిన విజయనగర రాజులలో ఒకరైన అచ్యుతరాయలు క్రీ.శ. 16 వ శతాబ్దంలో నిర్మించాడు. ఆతర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే దొంగను కోటలో బంధించడం వల్ల అది కొండారెడ్డి బురుజుగా మార్పుచెందింది. విజయనగర పాలకులు యుద్ధ తంత్రంగా శత్రువుల రాకను పసిగట్టేందుకు ఈ బురుజును ఎర్రరాతితో ఎత్తుగా నిర్మించారు.
pc: Veera.sj
కొండారెడ్డి బురుజు
కొండారెడ్డి బురుజు లో ప్రస్తుతం ఎత్తైన స్తంభము ఒకటి ఉంది. అదే కర్నూలు నగరానికి తలమానికం అయ్యింది. ఈ బురుజు నుండి 52 దూరంలో ఉన్న గద్వాల కోట వరకు ఒక రహస్య సొరంగ మార్గం కలదు. తుంగభద్రా నది కింద నుంచి సొరంగం ఉండేదని, గద్వాల సంస్థానాధీశులు ఈ సొరంగాన్ని వాడేవారని కథనం. 1901 లో బ్రిటీష్ ప్రభుత్వం ఈ సొరంగాన్ని మూసేసింది.
pc: Veera.sj
కొండారెడ్డి బురుజు
శిధిలమైన మూడు బురుజులతో ఒకటి విక్టరీ టాకీస్ వద్ద కలదు. దీనిని 'ఎర్రబురుజు' అంటారు. అందులో చిన్న ఎల్లమ్మ, పెద్ద ఎల్లమ్మ దేవతల ఆలయాలు, గోడలపై చిన్న చిన్న బొమ్మలు గమనించవచ్చు. మిగిలిన రెండు బురుజులు తుంగభద్రా నదీ తీరానికి అనుకోని ఉన్న కుమ్మరి వీధి దాటాక, సాయిబాబా గుడి వద్ద ఉన్న బంగ్లా పక్కన ఉన్నాయి. ఈ బురుజులపై సైనికులు శత్రువులు నది దాటి రాకుండా పహారా కాసేవారు.
pc: Veera.sj
షిర్డీ సాయిబాబా
షిర్డీ సాయిబాబా ఆలయం, కర్నూలు నగరంలో ప్రత్యేకమైనది. ఇది కొత్తపేటలో కలదు. దీనిని 70 సంవత్సరాల క్రితం నక్షత్ర ఆకారంలో కట్టించారు. తుంగభద్రా నది ఒడ్డున ఆనుకొని ఉన్న ఈ మందిరం 1.5 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ గుడిలో లక్ష్మి దేవి, ఆంజనేయస్వామి ఉన్నాయి. గుడి బయట టెంకాయలు, అగరబత్తులు, తాయత్తులు, దేవుళ్ళ చిత్రపటాలు అమ్మే షాప్ లు ఉన్నాయి. దక్షిణా భారతదేశంలో మొదటి సాయిబాబా గుడి ఇదేమరియు 'దక్షిణ షిరిడి' గా పేరుగాంచినది.
pc: Arpan Ganguly
షిర్డీ సాయిబాబా ఆలయం
ఈ ఆలయం నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. గుడిని అన్ని వేళలా, అన్ని సమయాలలో సందర్శించవచ్చు. అయితే ఉదయం, సాయంత్రం పూజలకు అనుకూలమైనవి. పక్కనే ఉన్న తుంగభద్రా నది నుండి వీచే గాలి ఈ ప్రదేశాన్ని ఆహ్లాదపరుస్తుంది. ధ్యాన మందిరంలో 800 మంది కూర్చొని ధ్యానం చేసుకొనే సౌకర్యం కలదు. కొండారెడ్డి బురుజుకు కేవలం అరకిలోమీటరు ( 550 మీటర్ల దూరంలో) దూరంలో కలదు. నడుచుకుంటూ 7నిమిషాలలో చేరుకోవచ్చు.
pc: My city-KURNOOL
బాలసాయిబాబా
బాలసాయిబాబా ఆలయం, షిర్డీ సాయిబాబా ఆలయానికి సమీపంలో కలదు. ఈ ఆలయం కర్నూలు నగరంలో అవతార పురుషుడు గా ప్రసిద్ధి చెందిన శ్రీ భగవాన్ బాలసాయిబాబా కు చెందినది. ఈ మందిరంలో పెద్ద ప్రాంగణం ఉన్నది. మీరు అవతారపురుషులను, వారి ఆధ్యాత్మిక శక్తులను నమ్మేవారైతే ఈ ప్రదేశాన్ని సందర్శించండి.
pc: Arpan Ganguly
కర్నూలు మ్యూజియం
కొండారెడ్డి బురుజు నుండి 2 కి.మీ ల దూరంలో కర్నూలు మ్యూజియం కలదు. నడిచి వెళ్ళటం కన్నా ఆటోలో వెలికితే త్వరగా చేరుకోవచ్చు. ఇది హంద్రీ నదిని అనుకొని ఉన్నది. కర్నూలు ప్రాంతంలో పురావస్తు శాఖవారు తవ్విన ఎన్నో కళాఖండాలను మ్యూజియంలో ప్రదర్శిస్తారు. అలంపూర్, శ్రీశైలం వంటి ఆలయాల నుండి సేకరించబడిన శిల్పాలు, విగ్రహాలు, రాజులు, నవాబులు వాడిన ఆయుధాలు, సామాగ్రి మొదలైనవి మ్యూజియంలో ఉన్నాయి.
pc:Arpan Ganguly
కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్మారకం
కర్నూలు పెద్దాయనగా, దేశ, రాష్ట్ర రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన కోట్ల స్మారక స్మృతి ఇది. మ్యూజియానికి పక్కనే, హంద్రీ నది ఒడ్డున నిర్మించిన ఈ స్మారకం ఒక విహార కేంద్రం. కొండారెడ్డి బురుజు నుండి ఆటోలు దొరుకుతాయి.
pc: Veera.sj
గోల్ గుంబజ్
కర్నూలు లో పురాతన కాలేజ్ లలో ఒకటైన ఉస్మానియా కాలేజీ సమీపాన గోల్ గుంబజ్ కలదు. ఇది కర్నూలు ప్రాంతాన్ని క్రీ.శ.16 వ శతాబ్దంలో పాలించిన నవాబు అబ్దుల్ వాహాబ్ యొక్క సమాధి. గోల్ గుంబజ్ గా పిలువబడే ఈ సమాధి 400 ఏళ్ల క్రితం నాటిది. కొండా రెడ్డి బురుజు నుండి కిలోమీటర్ దూరంలో ఈ పర్యాటక స్థలం కలదు. కానీ నడకన 13-15 నిమిషాలలో చేరుకోవచ్చు.
pc:S N Barid
వెంకన్నబావి
వెంకన్నబావి కొండారెడ్డి బురుజు నుండి 7 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడికి రాజ్ విహార్ నుండి ఆటోలు, షేర్ ఆటోలు లభిస్తాయి. ఈ ప్రదేశంలో ప్రధాన ఆకర్షణ చెట్లు, ఆలయాలు. సుమారు వందల చెట్లు పర్యాటకులకు నీడనిస్తాయి. శని, ఆది వారాలలో స్థానికులు, పర్యాటకులు ఆటోలలో వచ్చి వంటలు చేసుకొని భోంచేస్తారు. శివాలయాలు, మండపం చూడదగ్గవి.
pc:Arpan Ganguly
జగన్నాథ గట్టు
జగన్నాథ గట్టు కొండారెడ్డి బురుజుకు 13 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడికి డైరెక్ట్ గా రవాణా సౌకర్యాలు లేవుగానీ సొంతవాహనాలలో లేదా ఆటోలు బాడుగకు తీసుకొని వెళ్లిరావచ్చు. ఇక్కడ శివుని ఆలయం ప్రసిద్ధి చెందినది. పాండవ రాజులలో ఒకరైన భీముడు ఈ లింగాన్ని ప్రతిష్టించినట్లు చెబుతారు. ఆంజనేయస్వామి భారీ విగ్రహం పర్యాటకులను ఆకర్షిస్తుంది.
PC:Poreddy Sagar
వసతి
కర్నూలులో బస చేయటానికి హోటళ్లు, లాడ్జీ లు కలవు. బ్లూ స్టార్, మౌర్య ఇన్, మీనాక్షి లాడ్జి, రమా లాడ్జి, కల్కురా రెసిడెన్సీ, భూపాల్ రెసిడెన్సీ, ఎస్.వీ. రెసిడెన్సీ మొదలైనవి కలవు. వెజ్, నాన్ - వెజ్ వంటకాలు లభిస్తాయి. అమరావతి, అన్నపూర్ణ, డీ.వి. ఆర్. మాన్షన్, ఇంటర్నేషనల్ హోటల్, మసాలా బౌల్ మొదలైన రెస్టారెంట్లు, హోటళ్లు వాటిలో కొన్ని.
PC : Veera.sj
కర్నూలు
వాయు మార్గం : హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ 200 కిలోమీటర్ల దూరంలో కలదు.
రైలు మార్గం : కర్నూలులో రైల్వే స్టేషన్ కలదు. హైదరాబాద్, బెంగళూరు,చెన్నై,తిరుపతి, గుంటూరు తదితర నగరాల నుండి వచ్చే రైళ్లు ఆగుతాయి.
రోడ్డు మార్గం : హైదరాబాద్, విజయవాడ, గుంటూరు,బెంగళూరు, తిరుపతి, చెన్నై, వైజాగ్ మొదలైన ప్రాంతాల నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు కర్నూలు నగరానికి వస్తుంటాయి.
PC: Saikiranstuffguy