పర్యాటక స్థలం : ఇండియా గేట్
రాష్ట్రం : ఢిల్లీ
నగరం : న్యూఢిల్లీ
ఇండియా గేట్, భారతదేశ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. ఇది దేశ రాజధానైనా న్యూ ఢిల్లీ లో కలదు. రాష్ట్రపతి భవన్ కు కూడా వేటు దూరంలో ఇండియా గేట్ ఉన్నది. న్యూ ఢిల్లీ లో చూడవలసిన అతి కొద్ది పర్యాటక స్థలాలలో ఇది ఒకటి. దీనిని మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మరియు ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో అమరులైన 90 వేల మంది జవాన్ల జ్ఞాపకార్థం ఈ స్మృతి చిహ్నాన్ని కట్టించారు.
ఇది ఒక అపురూప కట్టడం. దీని ఎత్తు 42 మీటర్లు. ఈ కట్టడం భరత్ పూర్ నుండి తెప్పించిన ఎర్రరాయితో కట్టించారు. 1971 వ సంవత్సరం నుంచి ఇక్కడ అమర్ జవాన్ జ్యోతి కూడా వెలుగుతోంది. ఇండియా గేట్ పరిసరాలు చూడటానికి ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. పరిసరాలలో పచ్చిక బయళ్ళు, చిన్నారులు ఆడుకోవడానికి సుందరమైన పార్కు, బోట్ క్లబ్ ఉండటమే కాకుండా ఇక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్ చూడడం మరుపురాని అనుభూతినిస్తుంది.
ఇండియన్ గేట్ వద్ద సందర్శకులు
చిత్రకృప : Amanda W Follow
ఇండియా గేట్ - చరిత్ర
అది మొదటి ప్రపంచ యుద్ధ కాలం. క్రీ.శ1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో 80 వేల భారత మరియు బ్రిటీష్ జవానులు అమరులైనారు. ఆ తరువాత జరిగిన అఫ్ఘన్ యుద్ధంలో కూడా 10 వేల వరకు జవానులు ప్రాణాలర్పించారు. వారి స్మృత్యర్థం ఒక అపురూపకట్టడం ఉండాలనే ఆలోచనే ఈ కట్టడానికి ప్రాణం పోసింది. వాటిపై యుద్ధంలో మరణించిన అమరజవానుల పేర్లు కూడా లిఖించబడ్డాయి.
ఢిల్లీలో అనేక కట్టడాలకు రూపకల్పన చేసిన ఎడ్విన్ ల్యుటెన్స్ ఈ కట్టడానికి కూడా రూపకల్పన చేశాడు. క్రీ.శ. 1921, ఫిబ్రవరి 10న డ్యూక్ ఆఫ్ కన్నాట్చే పునాదిరాయి వేయబడి దాదాపు 10 సంవత్సరాల నిర్మాణ సమయం తరువాత 1931లో ఇది పూర్తయింది. దీని ప్రారంభ నామం 'ఆలిండియా మెమోరియల్ వార్'. ఈ కట్టడపు ఇరువైపులా పై భాగంలో ఇండియా గేట్ అనే పదాలు స్పష్టంగా కనిపించేటట్లు చెక్కబడింది.
నివాళులర్పిస్తున్న ప్రధాని
చిత్రకృప : Narendra Modi
అమర్ జవాన్ జ్యోతి
క్రీ.శ. 1971లో జరిగిన భారత్ -పాక్ యుద్ధం తరువాత ఈ కట్టడం క్రింది భాగాన అమర్ జవాన్ జ్యోతి వెలుగుతోంది. 1971 నాటి యుద్ధంలో అమరులైన భారత జవానులకు కూడా ఇది నివాళులు అర్పిస్తోంది. దీనిని అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించింది. భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, త్రివిధ దళాల అధినేతలు, మంత్రులు, రాజకీయ ప్రముఖులు, భారత అధికారులు మరియు సాధారణ ప్రజలు కూడా అమర్ జవాన్ జ్యోతి వద్ద నివాళులు అర్పించవచ్చు.
నేషనల్ వార్ మెమోరియల్
జులై 2014 లో భారత ప్రభుత్వం ఇండియా గేట్ వద్ద నేషనల్ వార్ మెమోరియల్ ను నిర్మించాలని ప్రకటించింది. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలకు గుర్తుగా ఇండియా గేట్ వద్ద ఉన్న ప్రిన్సెస్ పార్క్ పక్కనే 500 కోట్లతో వార్ మెమోరియల్ ను, మ్యూజియం ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
చిత్రకృప : Erin A. Kirk-Cuomo
భారత స్వాతంత్య్ర పోరాటంలో సుమారు 22 వేల మంది సైనికులు అమరులయ్యారు. వీరి జ్ఞాపకార్థం ఈ ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నలిచ్చింది కేంద్రం. యుద్ధంలో సైనికుల పోరాటానికి సంబంధించిన మూమెంట్స్, వార్ జరిగిన ప్రాంతాల ఫొటోలు మ్యూజియం లో ఏర్పాటు చేయుచున్నారు.
ఇండియా గేట్ ఎలా చేరుకోవాలి ?
ఢిల్లీ లోని బారాఖంబా రోడ్ మెట్రో స్టేషన్ లో దిగి, అక్కడి నుండి మూడు కోలోమీటర్ల దూరంలో ఉన్న ఇండియా గేట్ వద్దకు టాక్సీ లేదా ఆటోలో ఎక్కితే, 15 నిమిషాలలో గేట్ వద్దకు చేరుకోవచ్చు.