పూరీ వెళ్లి ఆ జగన్నాథస్వామి ని దర్శించుకోలేనివారు ... ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా జిల్లా ముదినేపల్లి మండల కేంద్రంలోని వడాలి గ్రామంలో గల జగన్నాథస్వామి ని దర్శించుకోవచ్చు. దీనికి గల మరోపేరు 'దక్షిణ పూరీ'. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయంలో బలరామ, సుభద్ర సమేత జగన్నాథస్వామి కొలువై ఉన్నాడు. బలరాముడు శ్రీ కృషుడి అన్న మరియు సుభద్ర వారి చెల్లలు. అన్నా చెల్లెళ్లకు గల ఏకైక ఆలయంగా ప్రసిద్ధిచెందింది.
ఆలయ చరిత్ర
జగన్నాథస్వామి ఆలయం నిర్మించటానికి దారితీసిన పరిణామాలు ఒకింత ఆశ్చర్యకరంగా ... ఆసక్తికరంగా ఉంటాయి. ఒకనాడు ప్రకాశం జిల్లా కర్రపాలానికి చెందిన పురుషోత్తమానంద అవధూత స్వామి కి రాత్రి నిద్రపోతుండగా కలలో జగన్నాథస్వామి కనిపించి తనకు ఆలయాన్ని కట్టించమని అడుగుతాడట. దాంతో ఆయన తన భక్తులతో కలిసి స్వామి వారి ఆలయాన్ని నిర్మించటానికి అనువైన స్థలం కోసం వెతుకుతారు . అలా వెతుకుతూ ... వెతుకుతూ ఆయన వడాలి ప్రాంతానికి చేరుతారు . ఆ స్థలం అనువైనదవటంతో అక్కడే నిర్మించాలని నిశ్చయించుకుంటారు అవధూత స్వామి.
వడాలి జగన్నాథ స్వామి ఆలయం
చిత్రకృప : SriKanth Parasa
వెంటనే ఆ స్థలం గురించి వాకబు చేయగా, అది హైదరాబాద్ నవాబు కు చెందినదిగా తెలుస్తుంది. ఎలాగైనా నవాబుని కలిసి ఆ స్థలం పొందాలని భావించి, సమీపంలోని ఉన్న కృష్ణా నది వద్ద తన భక్తులతో కలిసి స్నానం ఆచరిస్తుండగా అవధూత అదృశ్యమైపోతారు . భక్తులు, గ్రామస్థులు ఎంత వెతికినా అయన జాడ తెలియకపోవడంతో నిరాశతో ఇంటికి తిరిగి వచ్చేస్తారు.
అవధూత స్వామి కృష్ణా నదిలో అదృశ్యమై, సరాసరి హైదరాబాద్ లోని నిజాం నవాబు అంతఃపురంలో ప్రత్యక్షమవగా, ఆశ్చర్యానికి గురైన నబాబుకు అతను తేరుకొనే లోపే వచ్చిన విషయాన్ని చెప్పారు అవధూత స్వామి. సరేనని ఒప్పుకున్న నవాబు - "అవధూత సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఎంత దూరం తిరుగుతాడో అంత దూరం జగన్నాథ స్వామి వారికి ఇచ్చేస్తానని" చెబుతాడు.
ఆలయ పైకప్పు పై చిన్ని కృష్ణుడు
చిత్రకృప : Raja Somisetti
అందుకు సంతోషించి వెళ్లిన అవధూత వడాలి ప్రాంతానికి చేరుకొని ఉదయం నుండి సాయంత్రం 1200 ఎకరాల వరకు తిరుగుతారు . ఇచ్చిన మాట ప్రకారం నవాబు 1200 ఎకరాలను జగన్నాథస్వామి ఆలయ నిర్మాణానికి ఇచ్చేస్తాడు.
అవధూత స్వామి స్థలాన్నంతటిని చదునుచేసి దాతల సహకారంతో అక్కడ ఆలయాన్ని నిర్మించి, పూరీ నుంచి మూలవిరాట్ విగ్రహాలను తెప్పించి పూజలు చేసి ఆలయంలో ప్రతిష్టిస్తారు. అప్పటి నుండి ఇప్పటివరకు దేవాలయం నిర్మించిన క్షేత్రం దక్షిణ పూరీ గా విశేష పూజలు అందుకుంటున్నది.
బలరామ, సుభద్ర సమేత జగన్నాథస్వామి
చిత్రకృప : Os Rúpias
ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. అప్పట్లో ఇక్కడ బోయలుండేవారని, అప్పుడు దీనిని 'వ్యాధాళి' అనేవారని కాలక్రమేణా అదే 'వడాలి' గా మారిపోయిందని కధనం.
స్వామి వారికి జరిగే పూజలు/ ఉత్సవాలు
వడాలి లో స్వామి వారికి ప్రతి ఏటా బ్రహోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో కళ్యాణోత్సవాలు, రధోత్సవాలు, చక్రస్నానాలు, పూర్ణాహుతి, పవళింపుసేవ మరియు విశేష పూజ నిర్వహించెదరు. బ్రహోత్సవాలు జరిగే ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జన్మాష్టమి వేడుకలను ఆలయంలో ఘనంగా నిర్వహించెదరు. ఎంతో మహిమన్మితగల ఈ దేవాలయాన్ని భక్తులు తప్పక సందర్శించవలసిందే !
గుడివాడ జంక్షన్
చిత్రకృప : Viswa Chandra
ఎలా చేరుకోవాలి ?
గుడివాడ - బంటు మల్లి ప్రధాన రోడ్డు మార్గంలో ఈ క్షేత్రం కలదు. గుడివాడ నుండి ప్రతిరోజూ ప్రభుత్వ బస్సు (తెలుగు-వెలుగు, ఆర్డినరీ) నడుస్తుంది. ముదినేపల్లి నుండి బస్సు లేకుంటే ఆటో లలో ఇక్కడికి చేరుకోవచ్చు. వడాలి క్షేత్రానికి సమీపాన 60 కిలోమీటర్ల దూరంలో విజయవాడ రైల్వే స్టేషన్, గన్నవరం ఎయిర్ పోర్ట్ కలదు.