వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలలో ఒకటి. ఇది రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదుకు ఉత్తర దిశలో 157 కి.మి దూరంలో ఉన్నది. దీనిని "ఏకశిలానగరం" అని కూడా పిలుస్తారు.ఒకప్పుడు దీనిని ఓరుగల్లు అని కూడా పిలిచేవారు. ఇక్కడ కాకతీయ విశ్వవిద్యాలయము,కాకతీయ మెడికల్ కాలేజి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదలైన ప్రముఖ విద్యా సంస్థలు వరంగల్లులో ఉన్నాయి. పీపుల్సు వార్ గ్రూపుకు వరంగల్లు జిల్లా ఒకప్పుడు గట్టి స్థావరంగా ఉండేటిది. వరంగల్లు ప్రస్తుత తెలంగాణలో రెండో అతి పెద్ద నగరము.
ఇది కూడా చదవండి : తెలంగాణ రాష్ట్ర పర్యాటక ప్రదేశాలు !
క్రీ.శ. 12-14 వ శతాబ్ధంలో ఈ రాజ్యాన్ని కాకతీయులు పరిపాలించారు.వరంగల్ అంటే గుర్తుకొచ్చేది వేయి స్ధంభాల గుడి,ఇది చాలా ప్రసిద్ధి చెందినది కూడా. ఇది దక్కన్ పీఠభూమి ప్రాంతంలో తూర్పు వైపు విస్తరించి ఉంది.శ్రీరాంసాగర్ ప్రాజెక్టు యొక్క కాకతీయ కాలువ వరంగల్ కి నీటి సదుపాయం కలిపిస్తుంది. కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గిరిజన తెగకు చెందిన మేడారం వంశీయులైన సమ్మక్క,సారక్కల వీరోచిత పోరాటం చిరస్మరణీయంగా మిగిలింది.అందుకే వారి యొక్క పోరాట స్పూర్తిని తీసుకుని మేడారం జాతరను రాష్ఠ్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఆసియాలోనే పెద్ద గిరిజన జాతరగా ఇది ప్రసిద్ధి చెందినది. ఈవిధమైన చరిత్రగల ఈ నగర పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం!!...
ఓరుగల్లు కోట
13 వ శతాబ్ధంలో నిర్మించిన ఈ కోట వరంగల్ పట్టణానికి 2 కి.మి. దూరంలో కలదు. దీని కీర్తి తోరణాలు ఇప్పటి తెలంగాణ రాష్ట్ర చిహ్నంగా వాడుకలో ఉంది.కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవుడు 1199వ సం. ప్రారంభించగా, ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి దీనిని పూర్తి చేసింది.ఓరుగల్లు కోట అనేక చారిత్రక కట్టడాలు, అద్భుత శిల్పకళా సంపదకు నిలయం.
Photo Courtesy: Skorthiw
వేయి స్తంభాల గుడి
11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే నిర్మించబడినది. ఇది చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు మచ్చుతునకగా,భావితరాలకు వారసత్వంగా మిగిలిన వేయి స్తంభాల గుడి వరంగల్ నుండి సుమారు 5 కి.మీ. దూరంలో హనుమకొండ నగరం నడిబొడ్డున కలదు.ఇక్కడ ప్రధాన దైవం శివుడు,విష్ణువు,సూర్యుడు.ఇక్కడ మహాశివరత్రి,కార్తీక పౌర్ణమి,గణేశ్ నవరాత్రులలో భక్తుల రద్ధీ అధికంగా ఉంటుంది.
Photo Courtesy: Naik143l
రామప్ప దేవాలయం
కాకతీయ వంశీయుల ఒకప్పటి రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనిని రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇది వరంగల్లులో ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ దేవాలయం ప్రక్కనే రామప్ప సరస్సు కలదు. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది మరియు ఇది కొన్ని వేల ఎకరాలకు సాగు నీరు కల్పించబడుతుంది.
Photo Courtesy: Vedhanarayanang
పాకాల సరస్సు
1213 వ సం. కాకతీయుల రాజు గణపతి దేవుడు 30చ.కి.మీ. విస్తీర్ణంలో ఈ సరస్సును త్రవ్వించెను. ఖానాపురం మండలంలో ఉన్న ఈ ప్రదేశము ఇప్పుడు పర్యాటకులకు చాలా ఆనందాన్నికలిగిస్తున్నది. ఈ చెరువు ఒడ్డున పాకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 839 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్నది. ఇక్కడ దట్టమైన అడవులు మరియు జంతుసంపద కూడా ఉన్నది.
Photo Courtesy: Alosh Bennett
వన విజ్ఞాన కేంద్రం
వన విజ్ఞాన కేంద్రం తెలంగాణ అటవీ శాఖ వారి ఆధ్వర్యములో సామాన్య ప్రజానీకానికి వన్య సంరక్షణ గురించి తెలుపడానికి ఏర్పాటు చేయబడినది. ఈ విజ్ఞాన కేంద్రాన్ని ప్రతి రోజు 500 మంది వరకు సందర్శకులు సందర్శిస్తుంటారు. 50 ఎకరాల విస్తీర్ణములో విస్తరించి ఉన్న ఈ విజ్ఞాన కేంద్రం, వరంగల్ హంటర్ రోడ్ వద్ద ఉన్నది.. ఇందులో జింకలు, లేళ్లు, దుప్పులు, కోతులు, ఎలుగుబంట్లు మొదలగు జంతువులు; చిలుకలు, పావురాలు, నిప్పుకోళ్లు, నెమళ్లు వంటి పలురకాల పక్షులు; ముసళ్ల వంటి సరీసృపాలు సంరక్షించబడుతున్నాయి. దీనిని "మినీ జూ పార్కు" అని కూడా పిలుస్తారు.
Photo Courtesy: Avianwing
భద్రకాళి దేవాలయము
వరంగల్ నగరం నడిబొడ్డున కొలువైవున్న శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారమై విల్లసిల్లుతున్నారు. భద్రకాళిని "మహాకాళి మాత" అని కూడా పిలుస్తారు. అందమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రక్కన భద్రకాళి చెరువు, గుడి వెనుక అందమైన తోటలతో శోభయమయంగా వెలుగొందుతున్న ప్రముఖ దేవాలయం ఇది.
Photo Courtesy: Adithyavr
వాయు మార్గం
హైదరాబాదులో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ) ఎయిర్ పోర్టు కలదు. ఇక్కడ నుంచి వరంగల్లుకు 164 కి.మీ. దూరంలో కలదు.
Photo Courtesy: Rohith goura
రైలు మార్గం
వరంగల్లు రైల్వే స్టేషన్ మరియు కాజిపేట జంక్షన్ లు ప్రధానమైనవి. వరంగల్లు రైల్వే స్టేషన్ ఢిల్లీ-విజయవాడ-చెన్నై మార్గంలో, కాజిపేట రైల్వే స్టేషన్ ఢిల్లీ-కాజిపేట-సికింద్రాబాద్ మార్గంలో కలదు. కాజిపేట జంక్షన్ మీదుగా 100 కు పైగా రైళ్ళు ప్రయాణిస్తున్నాయి కనుక ఎక్కువ రద్దీగా ఉంటుంది.
Photo Courtesy: Nikhilb239
రోడ్డు మార్గం
వరంగల్లుకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి బస్సు సదుపాయం కలదు. హైదరాబాదు నుండి ప్రతిరోజు బస్సు సదుపాయం ఉంది. అంతేకాక విజయవాడ, తిరుపతి, షిర్డి, వైజాగ్, రాజమండ్రి, బెంగళూర్ తదితర ప్రాంతాల నుండి బస్సులు కలవు.
Photo Courtesy: Manoj K