కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలో వెలసిన శ్రీ బుగ్గ రామేశ్వరస్వామి కొలిచిన భక్తుల కొంగుబంగారమై పూజలందుకుంటున్నాడు.ఇది కర్నూలు నుండి నంద్యాల వెళ్ళే రహదరిలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ శివుడు బుగ్గరామేశ్వరునిగా మనకు దర్శనమిస్తాడు. పరశురాముని చే ప్రతిష్ఠించ బడుటచే ఈ స్వామి శ్రీ రామేశ్వరస్వామి గా పూజలందుకుంటున్నాడు.
పురాణ కధనం
పరశురాముడు తల్లిని చంపిన పాపాన్ని పోగొట్టుకోవటం కోసం పలు తీర్థాల్లో స్నానాలు చేస్తూ .. పలు ఋషుల ఆశ్రమాలను సందర్శిస్తూ .. పలు దేవతా మూర్తులను ఆరాథిస్తూ .. దేశ సంచారం చేస్తూ .. ఈ ప్రదేశానికి వచ్చాడు. ఈ ప్రదేశం యొక్క ప్రశాంతత, పావనత్వాలకు ముగ్థుడై, ఇక్కడ పంచ శివలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్లు, తరించినట్లు స్థలపురాణం చెపుతోంది.
కాల్వబుగ్గ ఆలయ ప్రవేశం
చిత్రకృప : Naa Kurnool
ఆలయ విశేషాలు
బుగ్గ రామేశ్వరస్వామి ఆలయం ప్రశాంత వాతావరణం లో విలసిల్లుతోంది. ముఖమండపం, అంత్రాలయం, గర్భాలయం అనే మూడుభాగాలుగా నిర్మించబడింది. ప్రాచీన నిర్మాణాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. గర్భగుడి లో రామలింగేశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. శ్రీ స్వామి వారి ఎడమవైపు ఉపాలయం లో శ్రీ భవానీ మాత నిండైన మూర్తి తో భక్తులను కరుణిస్తూ దర్శనమిస్తుంది.
ఆలయం లోపలి దృశ్యం
చిత్రకృప : Mahesh Kumar Goshika
ఇక్కడ ఒక కోనేరు సహజ సిద్దంగా భూమి నుండి ఉబికి వచ్చిన నీటి ఊట 'బుగ్గ' వలన ఏర్పడి నీరు కాలువలా ప్రవహించటం వలన ఈ ప్రదేశానికి కాలువ బుగ్గ అనే పేరు వచ్చింది. ఇక్కడి కోనేరులో నీరు అత్యంత శుభ్రంగా పారదర్శకంగా ఉంటుంది.అక్కడి నుంచి వెలుపలికి వస్తే కోనేటి మధ్యలో ప్రక్కనే ఉన్న బుగ్గ రామేశ్వరుడు కొలువుతీరి ఉన్నాడు. అందంగా నిర్మించిన మెట్ల కోనేటి మధ్యలో శివలింగం, ఆ శివలింగం శిరస్సు నుండి పైకి ఉబికి వచ్చే నీటిధారను ను మనం స్పష్టం గా చూడవచ్చు. ఇది అద్బుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది.
ఆలయ కోనేటి దృశ్యం
చిత్రకృప : Ediga Jaganmohangoud
నీరు నిర్మలంగా ఉండి, రామేశ్వరుని శిరస్సు నుండి బుగ్గ వెలుపలికి ప్రవహించడం దర్శనీయమైన రమణీయదృశ్యమే. గర్బగుడిలో శ్రీ స్వామివారి పై నీటి బిందువులు పడతాయని చెపుతారు. కోనేటిలో అన్నికాలాల్లోను శివలింగం నుండి నీరు వస్తూనే ఉంటుందట. ఇదే విధానం మహానంది లోను, యాగంటి లోను కూడ మనం చూడవచ్చు.
ఇది కూడా చదవండి : కర్నూల్ సందర్శనీయ స్థలాలు !
ఆలయ ప్రాంగణం లోనే మరో మూడు శివాలయాలను కూడ మనం దర్శించుకోవచ్చు.ఇచ్చట పంచముఖేశ్వరుని విశ్వేశ్వరుని సేవించుకోవచ్చు. మహా శివరాత్రి నుండి మాస శివరాత్రి ఎన్నో ఉత్సవాలు శ్రీ స్వామి కి అంగరంగ వైభవం గా నిర్వహిస్తున్నారు. ఆలయం లో నిత్యాన్నదాన పథకం నిర్వహించబడుతోంది. శివరాత్రి రోజున ఇక్కడ విశేషంగా పూజలు జరుగును. శ్రావణమాసం, కార్తీక మాసాలలో భక్తులు ఎక్కువగా వస్తారు. కాల్వ బుగ్గ కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే కొమ్ము ఆంజనేయస్వామి దేవాలయం కూడా సందర్శించదగినదే!
ఆలయ ఆవరణలో నాగదేవుని ప్రతిమ
చిత్రకృప : Subramanyam Addagalla
ఆలయ సందర్శన వేళలు : ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు
ఇతర ఆకర్షణలు
కాల్వబుగ్గ నుండి కర్నూలు తిరుగు ప్రయాణంలో భరతమాత మండపం, ఓర్వకల్లో ఉన్న చెన్నకేశవ దేవాలయం, చౌడేశ్వరి దేవాలయం, దర్గా, కేతవరం కొండలు, రాక్ గార్డెన్, జగన్నాథగట్టు చూడవచ్చు.
ఇది కూడా చదవండి : కర్నూలు లో ఒక్కరోజులో చూసివచ్చే పర్యాటక ప్రదేశాలు !
కాల్వబుగ్గ ఎలా చేరుకోవాలి ?
కాల్వబుగ్గ, కర్నూలు - నంద్యాల జాతీయ రహదారి ( N H 18 ప్రస్తుతం N H 40) పై కలదు. కర్నూలు నుండి నంద్యాల, బనగానపల్లె, బేతంచెర్ల, కోవెలకుంట్ల, కులిమికుంట్ల వెళ్లే ప్రభుత్వ బస్సులన్నీ (ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులు) కాల్వ బుగ్గ లో ఆగుతాయి. ఓర్వకల్ కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో కాల్వ బుగ్గ కలదు.
సికింద్రాబాద్ - కర్నూలు మధ్య నడిచే రైలు
చిత్రకృప : Belur Ashok
కాల్వబుగ్గ నుండి వివిధ ప్రాంతాలకు దూరం
కర్నూలు - 30 km , నంద్యాల - 43 km , బేతంచెర్ల- 21.5 km , బనగానపల్లె - 42 km , తాడిపత్రి- 105 km , హైదరాబాద్ - 245 km, బెంగళూరు - 361 km.
నంద్యాల, కర్నూలు, డోన్, బేతంచెర్ల రైల్వే స్టేషన్ లు కాల్వబుగ్గ సమీపాన ఉన్నాయి.