మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లాకు గల మరొక పేరు పాలమూరు. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి సుమారుగా 100 కి. మీ. దూరంలో ఉన్నది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కోహినూరు వజ్రం, గోల్కొండ వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలోనే దొరికినట్లు చెబుతారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా అతి పెద్ద జిల్లా. కృష్ణా, తుంగభద్ర నదులే కాక దిండి, భీమా వంటి చిన్న నదులు ఈ జిల్లాలో ప్రవహిస్తున్నాయి. ఈ జిల్లాలో ఎన్నో ఆలయాలు, మరెన్నో సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి.
ఆలంపూర్ దేవాలయాలు
తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఆలంపూర్ లో ఐదో శక్తి పీఠంగా పేరుగాంచిన జోగుళాంబ ఆలయం, బాలబ్రహ్మేశ్వర ఆలయం ఉన్నాయి. ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఆలయాలు నిర్మించి సుమారుగా 1600 ఏళ్లు పైగానే అయ్యింది. సంతానం లేనివారు ఇక్కడ కల రేణుక ఎల్లమ్మ కు పూజలు చేస్తే సంతానం కలుగుతుందని ప్రగాఢ నమ్మకం. హైదరాబాదు-బెంగుళూరు 44 వ నెంబరు జాతీయ రహదారి పై కల ఆలంపుర్ చౌరస్తా నుంచి 15 కిలోమీటర్ల లోనికి ఆలంపూర్ లో ఈ ఆలయాలు కలవు.
పిల్లలమర్రి
మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ప్రశాంత వాతావరణంలో సుమారు 700 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక మహావృక్షం ఊడలు ఊడలుగా అభివృద్ధిచెంది ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిఉంది. మహబూబ్ నగర్ జిల్లాకే గుర్తుగా మారిన ఈ మహావృక్షాన్ని సందర్శించడాన్కి ఎందరో వస్తుంటారు. ఇక్కడే పురావస్తు మ్యూజియం, మినీ జూ పార్క్, అక్వేరియం, ఉద్యానవనం, పిల్లల క్రీడాస్థలం, జింకలపార్క్ , దర్గా మొదలగునవి కూడా తనవితీరా చూడవచ్చు.
Photo Courtesy: Suresh Kumar
బీచుపల్లి
44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారిపై కృష్ణానది పై కల ఆనకట్ట వద్ద పుష్కర ప్రాంతమైన బీచుపల్లి ఉంది. ఇక్కడ కృష్ణవేణి ఆలయంతో పాటు సుందరమైన ఉద్యానవనాలు ఉన్నాయి. జాతీయ రహదారిపై నుంచి వెళ్ళు వాహనాల నుండి కూడా ఇక్కడి అపురూపమైన దృష్యాలు కానవస్తాయి.
Photo Courtesy: mahaboobnagar nic
ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టు
ధరూర్ మండలం రేవుల పల్లి వద్ద కర్ణాటక సరిహద్దు నుంచి 18 కిలోమీటర్ల దిగువన కృష్ణానదిపై ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టు ఉంది. కృష్ణానది తెలంగాణ లో ప్రవేశించిన తర్వాత ఇదే మొదటి ప్రాజెక్టు. నీటిపారుదల ప్రాజెక్టుగా ఉన్న ఈ ప్రాజెక్టు ఇటీవలే విద్యుత్ ఉత్పాదన కూడా ప్రారంభించింది. ఇది గద్వాల నుంచి ఆత్మకూర్ మార్గంలో ఉంది.
సోమశిల
కొండలమధ్యలో నుంచి ప్రవహిస్తున్న కృష్ణా నది, చుట్టూ పచ్చని ప్రకృతి, నదీ తీరంలో నిర్మించిన 14 ఆలయాల సముదాయం సోమశిల. ఈ ఆలయాల్లో భక్తులు ప్రధానంగా కొలిచేది సోమేశ్వర స్వామి . ఇక్కడ ఉన్న ఆలయాలు అన్నింటికీ కలిపి ఒకే ప్రాకారం ఉంది. ఇక్కడున్న సుందర దృశ్యాలు, కృష్ణా నది మిమ్మల్ని కనులవిందు చేస్తుంది. కొల్లాపూర్ నుండి సుమారు 8 కి. మీ. దూరంలో ఈ ఆలయ సముదాయం ఉన్నది. కొల్లాపూర్ నుంచి ఆర్టీసీ బస్సులు తక్కువగా ఉంటాయి అయినా కూడా ప్రైవేట్ వాహనాల రాకపోకలు అధికం.
Photo Courtesy: mahaboobnagar tourism
సలేశ్వర క్షేత్రం
ఆకాశ గంగను తలపించే మహత్తర జలపాతం సలేశ్వర క్షేత్రం . ఇక్కడి నీరు వేసవిలో చల్లగా ఉంటుంది. ఆ నీటిలో స్నానం చేసి పర్యాటకులు మాధురాణుభూతిని ఆస్వాదిస్తుంటారు. ఇక్కడున్న కొండల్లో శివుడు కొలువై ఉన్నాడు. పచ్చని చెట్లు, ఎగిసిపడే జలపాతాలు, ఎత్తైన కొండలు, గుట్టలు, లోతైన గుహలు, లోయాలు, పక్షుల కిలకిల రాగాలు, అరుదైన వన్య ప్రాణులతో కిటకిట లాడే ఈ ప్రాంతం నిజంగా ప్రకృతి ప్రియులకు స్వర్గమనే చెప్పాలి. ఇక్కడికి చేరుకోవాలంటే హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై ఫరహాబాద్ చౌరస్తా నుంచి 16 కి. మీ. అటవీ మార్గం గుండా ప్రయాణించాలి. రాంపూర్ అనే చెంచు పెంట దగ్గరి వరకు వాహనాలు వెళతాయి. అక్కడి నుంచి 6 కి. మీ. దూరం వరకు కాలి నడకన వెళితే సలేశ్వర క్షేత్రం చేరుకోవచ్చు. ఇది మీకు సాహసం తో కూడిన పనే. ఏ మాత్రం ఎబరపాటుగా ఉన్న లోయలో కిందపడతారు సుమి !
Photo Courtesy: mahaboobnagar tourism
కోయిల్ సాగర్ ప్రాజెక్టు
50 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న కోయిల్సాగర్ ప్రాజెక్టు దేవరకద్ర మండల పరిధిలో ఊకచెట్టువాగుపై నిర్మించారు. వర్షాకాలంలో ప్రాజెక్టు చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు వస్తుంటారు. గుట్టల మధ్య జల సవ్వడి, ప్రకృతి అందాలు, వివిధ రకాల చేపలు, తామర అందాలు పర్యాటకుల మదిని దోచుకుంటున్నాయి. హైదరాబాద్ నగరం నుంచి 135 కి. మీ. దూరంలో, మహబూబ్ నగర్ నుంచి 34 కి. మీ. దూరంలో ఉన్న కోయిల్ సాగర్ ప్రాజెక్టు చేరుకోనేందుకు దేవనకద్ర వరకు బస్సులో గాని, రైల్లో గాని ప్రయాణించి చేరుకోవచ్చు. దేవనకద్ర నుంచి మరో 12 కి. మీ. దూరంలో ఉన్న ఈ సాగర్ కి చేరుకోవటానికి ప్రైవేట్ వాహనాలలో ఎక్కి ప్రయాణించవచ్చు.
Photo Courtesy: kishore
ఉమా మహేశ్వర క్షేత్రం
మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలం నల్లమల అటవీ ప్రాంతంలో ఎత్తయిన కొండలపై ఉమా మహేశ్వర క్షేత్రం ఉంది. ఇది హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే దారిలో , మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు దారిలో ఉంది కాబట్టి శ్రీశైలం వెళ్ళు భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటూ వెళ్తారు. చుట్టూ ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉండటం కూడ భక్తులు, పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. అచ్చంపేట నుండి ప్రతీరోజు ఉదయం, సాయంత్రం ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి. ఆటోలు, జీపులు మొదలైన ప్రైవేట్ వాహనాలు కూడా అధికమే.
Photo Courtesy: mahabubnagar.nic
గద్వాల కోట
సంస్థాన రాజుల కాలంనాటి గద్వాల కోట పట్టణం నడిబొడ్డున కలదు. ఈ పురాతన కోటలో చెన్నకేశవస్వామి ఆలయం ఉంది.ఈ సంస్థానం వైశాల్యం సుమారుగా 1200 చదరపు మైళ్ళు. కోట కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యలో ఉంటుంది కనుక నడిగడ్డ అని పిలుస్తారు. ఈ కోటని కవి, యోధుడు, పాలకుడు సోమనాద్రి నిర్మించినాడు. కోట పరిసరాలలో గతంలో సినిమా షూటింగులు కూడా బాగానే జరిగాయి.
Photo Courtesy: Gadwal Fort
రాజోలి కోట మరియు దేవాలయాలు
పురాతనమైన రాజోలి కోట మరియు కోటలోపలి దేవాలయాలు సందర్శించడానికి యోగ్యమైనవి. కోట ప్రక్కనే తుంగభద్ర నదిపై ఉన్న సుంకేశుల డ్యాం కనిపిస్తుంది.
Photo Courtesy: C.Chandra Kanth Rao
కొల్లాపూర్ సురభి సంస్థానం
కొల్లాపూర్ సురభి సంస్థానానికి ఒకవైపున కృష్ణా నది, మరోవైపున నల్లమల్ల అటవీ ప్రాంతాలు సరిహద్దులుగా ఉన్నాయి. నేటికీ ఆనాడు వాడిన వస్తువులు చెక్కు చెదరలేదని అక్కడి దృశ్యాలను చూసి మనకు అగుపిస్తుంది. రాజులు వేటాడిన జంతువుల తలలు, చర్మాలు కోటా భవనంలో తారాసపడతాయి. రాజావెంకట లక్ష్మారావు చిత్రపటం ఆకర్షణీయంగా ఉంటుంది.
Photo Courtesy: Kkkishore
మల్లెల తీర్థం
అమ్రాబాద్ మండలంలోని మల్లెల తీర్థం క్షేత్రం ప్రకృతి రమణీయంగా ఉంటుంది. 300 అడుగుల ఎత్తునుంచి పడే సుందర దృశ్యాన్ని చూసేందుకు రెండుకళ్లు చాలవు. అచ్చంపేట - శ్రీశైలం మార్గం లో ఉండటంతో రోజూ భక్తులు తరలివస్తుంటారు. అచ్చంపేట నుంచి బస్సులు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తిరుగుతూ ఉంటాయి. శ్రీశైలం వెళ్లే బస్సుల్లో వటవర్లపల్లి వద్ద బస్సు దిగి, అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాల ద్వారా జలపాతం వద్దకి చేరుకోవచ్చు.
Photo Courtesy:Arun Kumar
మహబూబ్ నగర్ ఎలా చేరుకోవాలి ?
విమాన మార్గం
మహబూబ్ నగర్ కి ఎటువంటి విమాన సదుపాయం లేదు. ఈ ప్రాంతానికి సుమారుగా 90 కి. మీ. దూరంలో ఉన్న విమానాశ్రయం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కాస్త దగ్గరలో ఉన్న ఏర్పోర్ట్. అక్కడి నుంచి క్యాబ్ లేదా వేరే ఇతర రవాణా సాధనాల నుంచి మహబూబ్ నగర్ చేరుకోవచ్చు.
రైలు మార్గం
మహబూబ్ నగర్ లో రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ సికింద్రాబాదు నుంచి కర్నూలు గుండా తిరుపతి, బెంగుళూరు వెళ్ళు దారిలో ఉంది. మహబూబ్ నగర్, షాద్నగర్, గద్వాల, జడ్చర్ల ముఖ్యమైనవి. దేశం లోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఇక్కడికి రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ జిల్లాలోని గద్వాల ప్రధాన రైల్వే జంక్షన్ గా ఉన్నది.
రోడ్డు మార్గం
దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి అయిన 44వ నెంబరు జాతీయ రహదారి మహబూబ్ నగర్ జిల్లా గుండా వెళ్తుంది. జిల్లాలో ఉన్న జాతీయ రహదారి కూడా ఇదొక్కటే. హైదరాబాదు నుంచి కర్నూలు గుండా బెంగుళూరు వెళ్ళు వాహనాలు జాతీయ రహదారి పై ఈ జిల్లా మొత్తం దాటాల్సిందే. ఇక్కడికి హైదరాబాద్, కర్నూలు, బెంగళూరు, రాయ్చూరు, బళ్ళారి వంటి ఇతర ప్రదేశాల నుంచి బస్సులు తిరుగుతుంటాయి.
Photo Courtesy: kishore