వేణూర్ పట్టణానికి చారిత్రక మరియు మతపర విశిష్టత ఎంతో ఉంది. ఈ పట్టణంలో 35 అడుగుల ఎత్తుకల గోమతేశ్వర విగ్రహం ప్రధాన ఆకర్షణ. ఈ విగ్రహాన్ని 1604 సంవత్సరంలో జైన రాజు తిమ్మన్న అజిల నిర్మించారు. కర్నాటకలోని నాలుగు ఏకశిలా గోమతేశ్వర విగ్రహాలలో ఇది ఒకటి.
వేణూర్ పట్టణంలో అనేక పురాతన జైన మందిరాలు చూడదగినవి కలవు. గ్రామీణ ప్రాంతంలో ఏడు పురాతన దేవాలయాలున్నాయి. ఈ దేవాలయాలు అద్భుత శిల్పకళా నైపుణ్యతలు కలిగి ఆకాలం నాటి వైభవానికి చిహ్నంగా ఉంటాయి. గోమతేశ్వర విగ్రహానికి ఇరుపక్కలా రెండు దేవాలయాలుంటాయి. సహజ అందాలకు నిలయమైన ఈ ప్రదేశం సహ్యాద్రి హిల్స్ సమీపంలో ఉండి మరింత అందచందాలను సంతరించుకొంది. వేణూర్ పట్టణం, జైనుల ఇతర కేంద్రాలైన ధర్మస్ధల మరియు కర్కాల పట్టణాలకు సమీపంలో ఉంది. ఇక్కడి ప్రధాన ఆకర్షణల విషయానికి వస్తే ...
చిత్రకృప : Vikas m
గోమఠేశ్వరుడు
ముందుగా వేణూరులో ప్రధాన ఆకర్షణ నుంచి వద్దాం. ఈ పట్టణంలో 35 అడుగుల ఎత్తున్న గోమఠేశ్వరుడు ప్రధాన ఆకర్షణ. దీనిని అజిల వంశ రాజులలో ఒకడైన తిమ్మన్న ఆజిల క్రీ.శ. 1604 లో నిర్మించాడు. గోమఠేశ్వరుని విగ్రహాన్ని అమరశిల్పి జక్కన్న చెక్కినాడు. కర్నాటకలోని 4 ఏకశిలా గోమఠేశ్వరుని విగ్రహాలలో (మిగిలిన మూడు కర్కాల, ధర్మస్థల, శ్రావణబెళగోల) ఇది కూడా ఒకటి. ఈ విగ్రహం ఫల్గుణి నది ఒడ్డున కలదు.
24 తీర్థాంకర మందిరాలు
వేణూరు లో తప్పక చూడవలసిన మరో ఆకర్షణ క్రీ.శ. 1537 వ సంవత్సరంలో నిర్మించినట్లు చెప్పబడుతున్న 24 తీర్థాంకర మందిరాలు. వీటినే హరి పీఠ అని కూడా పిలుస్తారు. యాత్రికులు ఇక్కడ 24 తీర్ధంకర కాంస్య విగ్రహాలను వరుసగా నిలబడటం చూడవచ్చు. సరస్వతి మరియు పద్మావతి విగ్రహాలు తీర్ధంకర విగ్రహాలకు ఇరువైపులా ఉంటాయి. పద్మావతి దేవిని జైనులు అమ్మవారు అని అంటారు.
చిత్రకృప : Soumya Kodliwad
బిన్నని బసడి
బిన్నని బసడి లేదా బాలా బసడిలో 5 అడుగుల 16 వ తీర్థాంకర శాంతినాధ విగ్రహాన్ని, ఇరువైపులా యాక్షి మహామానసి, యాక్షగరుడ రాతి విగ్రహాలను చూడవచ్చు. పర్యాటకులు ఇక్కడే బ్రహ్మదేవుని స్తంభం కూడా దర్శిస్తారు. సమయం దొరికితే, పర్యాటకులు అక్కంగల బసాడి తప్పక చూడాలి. ఇది బాహుబలి విగ్రహానికి పడమటి వైపు కలదు. ఈ నిర్మాణాన్ని క్రీ.శ. 1604 లో రాజు తిమ్మన్న అజిల భార్యలైన మల్లిదేవి మరియు పాండ్యక్కదేవి లు నిర్మించారు. ఇక్కడే చంద్రనాధ స్వామి విగ్రహం కూడా చూడవచ్చు.
పార్శ్వనాథ మందిరం
గోమఠేశ్వరుని విగ్రహానికి వెనక భాగంలో పార్శ్వనాథ మందిరం కలదు. ఇందులోని పార్శ్వనాథుని విగ్రహం కంచుతో చేయబడింది. దీన్ని కూడా వీలుంటే సందర్శించండి. వేణూరు లో సమయం లభిస్తే, చూడవలసిన స్థలం వర్ధమానస్వామి ఆలయం. ఈ ఆలయంలో ప్రభువు వర్ధమాన మహావీరుని విగ్రహం ఉంటుంది.
చిత్రకృప : HoysalaPhotos
వేణూరు ఎలా చేరుకోవాలి ?
వాయు మార్గం
వేణూరుకు సమీపంలో 50 కి.మీ దూరంలో మంగళూరు విమానాశ్రయం కలదు. ఇక్కడి నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ప్రయాణించి వేణూరు చేరుకోవచ్చు. మంగళూరు విమానాశ్రయానికి బెంగళూరు, కొచ్చి, ముంబై, గోవా తదితర ప్రాంతాల నుండి విమానాలు వస్తుంటాయి.
రైలు మార్గం
దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానించబడ్డ మంగళూరు జంక్షన్, వేణూరుకు సమీప రైల్వే స్టేషన్. బెంగళూరు, మైసూరు, గోవా, హుబ్లీ మరియు దాని సమీప ప్రాంతాల నుండి మంగళూరు కు తరచూ రైళ్ళు రాకపోకలు సాగిస్తుంటాయి.
రోడ్డు మార్గం
బెంగళూరు (332 కి.మీ.), మంగళూరు (50 కి.మీ.) నగరాల నుండి పర్యాటకులు ప్రభుత్వ/ప్రవేట్ బస్సుల్లో వేణూరు కు సులభంగా చేరుకోవచ్చు. ప్రవేట్ వాహనాలు కూడా అద్దెకు లభిస్తాయి.