ఇచ్ఛాపురం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చిట్టచివరి పట్టణం. ఇది ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దు ప్రాంతం (ఏవోబి)లో కలదు. ఇది శ్రీకాకుళం జిల్లాకు చెందిన పట్టణం మరియు మండల కేంద్రం. చెన్నై - కలకత్తా జాతీయ రహదారిపై ఉన్న ఈ పట్టణం ఒరిస్సా నుండి ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చేటప్పుడు మొదటి పట్టణం గా ఉన్నది. అంతేకాదు ఈశాన్య ఆంధ్ర ప్రదేశ్ కు ముఖద్వారం అనే పేరు కూడా ఇచ్ఛాపురం కు కలదు. ఇది శ్రీకాకుళం పట్టణం నుండి 142 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
ప్రజలజీవన విధానం
ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇచ్ఛాపురం ప్రజలు ఒరియా, తెలుగు రెండూ బాగా మాట్లాడుతారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఒరియా సంస్కృతి ఇక్కడి ప్రజల జీవన విధానంలో ఒక భాగమయిపోయింది. భోజనం, వస్త్రధారణ, ఇతర ఆచార వ్యవహారాలలో ఒరియా ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
జగన్నాథ స్వామి గుడి
చిత్రకృప : Palagiri
ఇచ్ఛాపురంలో అన్ని మతాల ప్రజలు కలిసిమెలసి సాధారణ జీవితం గడుపుతుంటారు. జగన్నాథుని పండగను స్థానికులు గొప్ప వైభవంగా జరుపుతారు. ఆ సమయంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎద్దులబండ్లు, ట్రాక్టర్లు మీద వచ్చి ఉత్సవాలలో పాల్గొంటారు.
బ్రహ్మ ప్రతిష్టించిన మహావిష్ణువు - శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు ఆలయం !
శుద్ధికొండ త్రినాధస్వామి ఆలయం
ఇచ్ఛాపురం లోని బెల్లువడ గ్రామంలో శుద్ధికొండ త్రినాధ స్వామి యాత్ర ప్రతి ఏటా కనుమ నాడు జరుగుతుంది. అదేరోజు హనుమాన్ రథయాత్ర కూడా చేస్తారు. ఇక్కడ పెద్ద జగన్నాథ దేవాలయం ఉన్నది. దేవాలయం వద్ద జరిగే పండుగలను వీక్షించటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.
స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయం
చిత్రకృప : Palagiri
ఇచ్ఛాపురం పట్టణంలో ఉన్న స్వేచ్ఛావతి అమ్మవారికి ప్రతి ఏటా మకరసంక్రాంతి నాడు ప్రత్యేక పూజలు చేస్తారు.
పీర్ల కొండ
పీర్ల కొండ హిందూ .. ముస్లిం ల మతసామరస్యానికి ప్రతీక. పూర్వం నవాబుల పరిపాలనలో ఇక్కడ పీర్ల కొండ పై ఉన్న కట్టడాలను ప్రార్థనా మందిరాలుగా ఉపయోగించేవారు. క్రీ.శ. 16 వ శతాబ్దానికి చెందినవైనా ఇవి నేటికీ చెక్కుచెదరలేదు. ప్రతిఏటా మార్గశిర గురువారాలలో హిందువులు ఈ మందిరాల వద్దకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. హైందవ సంప్రదాయం ప్రకారం ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. ఆంధ్రా - ఒరిస్సా ప్రాంతాల నుంచి వేలసంఖ్యలో ఈ ఉత్సవాలను తిలకించటానికి వస్తుంటారు.
రాజశేఖర్ రెడ్డి స్మారకం
చిత్రకృప : Palagiri
పాదయాత్ర జ్ఞాపక స్థూపం
దివంగత నేత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, 2003 లో పాదయాత్ర చేవెళ్ల వద్ద ప్రారంభించి, 68 రోజులు 1470 వందల పైచిలుకు కిలోమీటర్లను నడిచి ఇచ్ఛాపురం వద్ద యాత్ర ను ముగించిన సందర్బంగా ప్రజాప్రస్థాన వాటికలో ఒక స్మారక స్థూపాన్ని నిర్మించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన సూర్యదేవాలయాలు !
ఇతర ఆకర్షణలు : నర్మదేశ్వర స్వామి ఆలయం, శివాలయం మరియు దుర్గాదేవి గుడుల సముదాయం, మసీద్.
ఇచ్ఛాపురం లో వసతి సదుపాయాలు ఉన్నాయి. అన్ని తరగతులవారికి గదులు సౌకర్యవంతంగా ఉంటాయి. శ్రీరామా లాడ్జ్, సూర్యాలాడ్జ్ మెయిన్ రోడ్డు మీద ఉంటాయి. ఆంధ్రా భోజనం లభిస్తుంది.
ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్
చిత్రకృప : Palagiri
ఇచ్ఛాపురం ఎలా చేరుకోవాలి ?
విమాన మార్గం : వైజాగ్ 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి ఇచ్ఛాపురం చేరుకోవచ్చు.
రైలు మార్గం : ఇచ్ఛాపురంలో రైల్వే స్టేషన్ కలదు. చెన్నై, కోల్కతా, భువనేశ్వర్, వైజాగ్, విజయవాడ, గుంతకల్, తిరుపతి వెళ్లే రైళ్లన్నీ ఇక్కడ ఆగుతాయి.
బస్సు/ రోడ్డు మార్గం : వైజాగ్, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుండి ఇచ్చాపురం వరకు ప్రభుత్వ బస్సులు నడుస్తాయి. ఒకవేళ మీకు డైరెక్ట్ బస్సు దొరకలేదనుకోండీ ... శ్రీకాకుళం వరకు వెళ్లి అక్కడి నుంచి ప్రభుత్వ బస్సులలో వెళ్ళండి.