ట్రిచీ తమిళనాడు రాష్ట్రంలోని ప్రాచీన నగరాల్లో ఒకటి. దీనికి గల ఇతర పేర్లు తిరుచిరాపల్లి, తిరుచ్చి. ఈ నగరం కావేరీ నది ఒడ్డున ఉన్నది. ట్రీచి తమిళనాడు రాష్ట్రంలోని నాలుగో అతిపెద్ద పట్టణం. ట్రిచీ యొక్క ఘనమైన సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే అద్భుత నిర్మాణాలు (ధార్మిక ప్రదేశాలు, చారిత్రక ప్రదేశాలు, కోటలు ఇలా ఏదైనా కావచ్చు) ఇక్కడ ఉన్నాయి. ఈ నగరం చెన్నై మహానగరం నుండి 334 కి. మీ. దూరంలో, తంజావూర్ నుండి 56 కి. మీ. దూరంలో కలదు.
ఇది కూడా చదవండి : తంజావూర్ లో సందర్శించవలసిన స్థలాలు !
ఇక్కడికి (ట్రిచీ) వచ్చే యాత్రికులు తప్పక సందర్శించవలసిన మరొక ప్రదేశం, ట్రిచీ కి 9 కి. మీ. దూరంలో ఉన్న శ్రీరంగం. శ్రీరంగం ను ఆలయాల ద్వీపం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న విష్ణు ఆలయం దేశంలోనే పెద్డదేమో ..! దీన్ని సుమారు 156 ఎకరాల స్థలంలో నిర్మించారు.
గుణశీలం విష్ణు ఆలయం
గుణశీలం విష్ణు ఆలయం, ట్రిచీ కి 20 కి.మీ. దూరంలో కొల్లిడం నది ఒడ్డున ఉన్నది. ఆలయంలో ప్రధాన దైవం ప్రసన్నవెంకటచలపతి. ఇక్కడ మానసిక వికలాంగులు 48 రోజులు గడిపితే వారికి నయం అవుతుందని భావిస్తారు. సందర్శించు సమయం ఉదయం 6 : 30 నుండి రాత్రి 8 : 30 వరకు.
చిత్ర కృప : Manchitra
వెక్కలియమ్మన్ ఆలయం
వెక్కలియమ్మన్ ఆలయం తిరుచ్చి కి 7 కి.మీ. దూరంలో ఉన్న వోరైయూర్ వద్ద ఉన్నది. ఈ ఆలయంలో ప్రధాన దైవం వెక్కలి(పార్వతీ దేవి). ప్రధాన దేవత విగ్రహం మీద పై కప్పు లేకపోవడం ఈ ఆలయ ప్రధాన లక్షణం. ప్రత్యేక దినాలైన మంగళ, శుక్ర వారాల్లో భక్తులు ఎక్కవగా గుడిని దర్శిస్తుంటారు.
చిత్ర కృప : TRYPPN
విరలిమలై మురుగన్ టెంపుల్
ట్రిచీ నగరం నడిబొడ్డున ఉన్న విరలిమలై కొండ మీద మురుగన్ ఆలయం ఉన్నది. ఈ గుడికి చేరుకోవటానికి 207 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. అలా వెళ్లే మార్గంలో మండపాలు, పండ్ల తోటలు, పనాస చెట్లు, నెమళ్ళు గమనించవచ్చు. ఆలయ ఆవరణలో వివిధ విగ్రహాలు, అందమైన చెక్కిన స్తంభాలు కనిపిస్తాయి.
చిత్ర కృప : da_pierino
వయలూర్ మురుగన్ టెంపుల్
ట్రిచీ కి 9 కి.మీ దూరంలో, 1200 ఏళ్ల క్రితం నాటి చోళ రాజుల పాలనలో నిర్మించిన వయలూర్ మురుగన్ టెంపుల్ కలదు. ఇక్కడి ప్రధాన దైవం మురుగన్ మరియు ప్రధాన ఆకర్షణ నటరాజ విగ్రహం. నటరాజు ప్రత్యేకత ఏమిటంటే ఆయన రెండు పాదాలు నేలను తాకి ఉంటాయి.
చిత్ర కృప : Jai Santhosh Kumar Raj
రంగనాథ స్వామి ఆలయం
శ్రీ మహా విష్ణువు శేషతల్పశాయి గా ఉండే మూలవిరాట్టు తో శ్రీరంగనాథునిగా ట్రిచీ కి 9 కి.మీ. దూరంలో ఉన్న శ్రీరంగం లోని రంగనాథస్వామి ఆలయంలో పూజలందుకుంటున్నాడు. ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ దేవాలయం ఒక సున్నిత ప్రదేశంలో నిర్మించబటటం వల్ల గతంలో చాలా సార్లు డచ్, పోర్చుగీస్, బ్రిటీష్ దాడులను తట్టుకొని నిలబడింది.
చిత్ర కృప : Guru Nathan
సమయపురమ్ మరైయమ్మాన్ ఆలయం
సమయపురమ్ మరైయమ్మాన్ ఆలయం ట్రిచీ కి 9 కి. మీ. దూరంలో ఉన్న శ్రీరంగం లో ఉన్నది. ఇక్కడ మంగళ, శుక్ర వారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. భక్తులు ఎన్ని రకాల నైవేద్యాలు తెచ్చినప్పటికీ, మవిలక్కుమావు నైవేద్యం (బియ్యప్పిండి, నెయ్యి, పప్పు, బెల్లం వేసి తయారుచేసే పదార్థం) దేవతకు ఇష్టమైన ప్రసాదం.
చిత్ర కృప : Bruno Lemonnier
జంబులింగేశ్వర మరియు అఖిలాండేశ్వరి ఆలయం
సుమారు 1800 సంవత్సరాల క్రితం నాటి జంబు లింగేశ్వర మరియు అఖిలాండేశ్వరి ఆలయాన్ని చోళ రాజులలో మొదటివాడైన కోచెంగా చోళ నిర్మించారు. ఇక్కడి ప్రత్యేకత శివలింగం కింద నీరు ఉండటం. మీరు నీరు ఖాళీ చేసిన సరే, అక్కడికి మళ్లీ నీరు వచ్చి చేరుతుంది.
చిత్ర కృప : dtravelersworld
జంబులింగేశ్వర మరియు అఖిలాండేశ్వరి ఆలయం
పురాణ గాథ ప్రకారం
శివుడు తపస్సు చేస్తుండగా పార్వతి దేవి భంగం కలిగించిందని, అప్పుడు ఆమెను శివుడు తపము చేయవలసిందిగా ఆదేశిస్తాడని చెప్తారు. అప్పుడు ఆమె అఖిలాండేశ్వరి గా అక్కడే అవతరించి కావేరీ నది తో శివలింగాన్ని తయారుచేసి అడవిలో తపస్సు మొదలు పెట్టిందని చెప్తారు.
చిత్ర కృప : Shanmugham G V
మలైకొటై ఉచి పిల్లయార్ టెంపుల్ లేదా రాక్ ఫోర్ట్ టెంపుల్
పల్లవ రాజుల శిల్ప కళా నైపుణ్యానికి నిలువుటెద్దు నిదర్శనం రాక్ ఫోర్ట్ టెంపుల్. కొండ పై 83 మీ. ఎత్తున ఏక శిలను తొలిచి నిర్మించిన ఈ రాక్ ఫోర్ట్ ఆలయానికి 437 మెట్లు ఎక్కితేగానీ చేరుకోలేం.
చిత్ర కృప : Manchitra
మలైకొటై ఉచి పిల్లయార్ టెంపుల్ లేదా రాక్ ఫోర్ట్ టెంపుల్
కొండ మీద మూడు ఆలయాలు ఉన్నాయి. అందులో కొండ శిఖరాన ఉన్న శివుని 'తాయుమనస్వామి ఆలయం(2 అంతస్తులు)' ఇక్కడి ఆలయాల్లో కెల్లా అద్భుతం అనటంలో ఏ మాత్రం సందేశం లేదు. అలాగే పర్వత పాదాల కింద ఉన్న వినాయకుని 'మనిక వినాయకర్' ఆలయం దర్శించదగ్గది. ఈ రెండు ఆలయాలు అద్భుత శిల్పకళారీతులకు పెట్టింది పేరు.
చిత్ర కృప : Kalai "N" Koyil
మలైకొటై ఉచి పిల్లయార్ టెంపుల్ లేదా రాక్ ఫోర్ట్ టెంపుల్
ఇక్కడ ఉన్న ఈ రెండు ఆలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించబడింది. సందర్శించు సమయం : ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు.
చిత్ర కృప : jkumar
ముక్కోంబు ఆనకట్ట
ట్రిచీ కి 18 కి.మీ. దూరంలో ఉన్న ముక్కోంబు ఆనకట్ట ని కావేరీ, కొల్లడం నదులపై నిర్మించారు. పక్కనే ఒక ఆమ్యూజ్మెంట్ పార్క్, పిల్లల పార్క్, ఫిషింగ్ స్థలం వంటివి ఉన్నాయి. నగరానికి దగ్గర్లో ఉన్న ఈ స్థలానికి పర్యాటకులు వారాంతంలో కుటుంబ సభ్యులతో వచ్చి గడిపేస్తుంటారు.
చిత్ర కృప : chandrasekaran arumugam
సెయింట్ జొసెఫ్స్ చర్చి
ట్రిచీ నగరం మధ్యలో తెప్పకులం దగ్గర సెయింట్ జొసెఫ్స్ చర్చి ఉన్నది. క్రీ.శ. 1792 వ సంవత్సరంలో బ్రిటీష్ వారు నిర్మించిన ఈ ప్రార్థనా స్థలం ట్రీచీలో ప్రసిద్ధి చెందినది మరియు దేశంలోని పురాతన చర్చి లలో ఒకటి. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే రోజుల్లో క్రైస్తవులు ఇక్కడికి వచ్చి ప్రార్థన లు జరుపుకుంటారు.
చిత్ర కృప : Preetam
కల్లనై డ్యామ్
కల్లనై డ్యామ్ ను చోళ రాజు కరికాలన్ క్రీ.శ. 1 వ శతాబ్ధంలో కావేరీ నది పై నిర్మించాడు. శ్రీరంగం ద్వీపాన్ని చేరుకోగానే ఈ డ్యామ్ రెండు పాయలుగా చీలుతుంది. ట్రీచీ లో ఇది కూడా సందర్శించదగ్గదే ..!
చిత్ర కృప : vasantharaj T
ట్రిచీ ఎలా చేరుకోవాలి ?
ట్రిచీ చేరుకోవడానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
వాయు మార్గం
ట్రిచీ లో విమానాశ్రయం కలదు. చెన్నై, బెంగళూరు, మధురై, తిరువనంతపురం, తిరుపతి నుండి రెగ్యులర్ గా విమానాలు ఇక్కడికి నడుస్తుంటాయి.
రైలు మార్గం
ట్రిచీ లో రైల్వే స్టేషన్ కలదు. దక్షిణ రైల్వే పరిధిలో ఇది అతి పెద్ద జంక్షన్. చెన్నై, మధురై, కన్యాకుమారి, తంజావూరు, తిరుపతి, తిరువనంతపురం, కొచ్చి వంటి దక్షిణాది నగరాల నుండి నిత్యం రైళ్లు నడుస్తుంటాయి.
రోడ్డు మార్గం
దాదాపుగా దక్షిణాది నగరాల నుంచి ట్రిచీకి రోడ్డు మార్గం చక్కగా ఉన్నది. లోకల్ గా తిరగటానికి సిటీ బస్సులు, టూరిస్ట్ ట్యాక్సీ లు, ఆటోలు అందుబాటులో ఉన్నాయి.
చిత్ర కృప : Balajijagadesh