ఉదయంపూట బాలికగా సాయంత్రం సమయంలో వృద్ధ స్త్రీ రూపంలోనూ మారుతూవుండే దేవీ విగ్రహం ఎక్కడ వుందో తెలుసా?
కొప్పల్ కర్నాటక రాష్ట్రం లో ఉత్తరం వైపున ఉన్న ఒక జిల్లా. ఈ జిల్లా ప్రసిద్ధ ప్రపంచ వారసత్వ ప్రదేశం హంపి పట్టణానికి 44 కి.మీ. దూరంలో , బెంగళూరు నగరం నుంచి 300 కి.మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ ఉన్న దేవాలయాలు ఇసుక శిలలతో నిర్మించబడి మతపరంగాను, శిల్ప కళా నైపుణ్యంగాను ఎంతగానో ప్రాధాన్యతలను సంతరించుకున్నాయి.
కొప్పల్ ప్రాంతం గత చరిత్రను ఒకసారి గమనిస్తే, ఈ ప్రాంతాన్ని గంగా, హొయసల, చాళుక్యుల రాజవంశస్థులు పరిపాలించారు. కొప్పల్ ను పాతకాలంలో కోపనగరం అని పిలిచేవారు. ఈ ప్రదేశం జైనులకు ప్రసిద్ధ యాత్రాస్థలంగా గుర్తించబడింది. అందమైన ఆలయాలతో, గోడల పై చెక్కించిన శిల్పాలతో వర్ధిల్లు తున్నా కొప్పల్ పట్టణ ప్రసిద్ధ ప్రదేశాలను ఒకసారి చూసినట్లయితే ..
మహాదేవ ఆలయం
కొప్పల్ పట్టణంలోని యల్బర్గ తాలూకాలో ఇత్తగి అనే ఒక చిన్న పట్టణంలో, పశ్చిమ చాళుక్యుల కాలంలో నిర్మించబడిన అతి ప్రాముఖ్యమైన ఆలయం మహదేవ దేవాలయం. ఈ దేవాలయం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఈ దేవాలయంలో శివుడు లింగం రూపంలో ఉంటాడు. దేవాలయ చెక్కడాలు అమోఘంగా ఉండి పర్యాటకులకు ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి. ఈ దేవాలయాన్ని నిర్మించడానికి చాళుక్యులు ఇసుకరాయి బిల్డింగ్ బాక్స్ మరియు సోప్ స్టోన్ (సబ్బు రాయి) లను ఉపయోగించారు.
Photo Courtesy: Dcoetzee
కూకనూర్
కొప్పల్ పట్టణానికి 14 కి.మీ.ల దూరంలో ఉన్న కూకనూర్ లో మధ్య యుగం నాటి భవనాలు , ఎన్నో పురాతన దేవాలయాలు కలవు. వాటిలో నవలింగ, కళ్ళేశ్వర, మల్లిఖార్జున, మహామాయ దేవాలయాలు ప్రసిద్ధి. నవలింగ దేవాలయం 9 వ శతాబ్దం నాటిది. దీనిలో అనేక చారిత్రక శాసనాలున్నాయి. ఇక్కడ తొమ్మిది శివలింగాలు ఉంటాయి. ఇక్కడి మహామాయ దేవాలయం గురించి మహా భారతంలో కూడా చెప్పబడింది.
Photo Courtesy: Dineshkannambadi
కొప్పల్ కోట
కొప్పల్ లో చారిత్రక ప్రాధాన్యత కలది మరియు గొప్ప ఆకర్షణ గల పర్యాటక కేంద్రం కొప్పల్ ఫోర్ట్. సుమారు 400 అడుగుల ఎత్తున నిర్మించిన ఈ కోట ఎంతో ధృుడమైనది. టిప్పూసుల్తాన్ ఈ కోటను మరాఠా వీరుల నుండి యుద్ధంలో ఓడించి తీసుకున్నాడని, ఆ తరువాత ఫ్రెంచ్ ఇంజనీర్ల సహకారం తో పునర్నిర్మించాడని చరిత్రకారుల అభిప్రాయం.
Photo Courtesy: vingoldy
కనకగిరి
కనకగిరి కొప్పల్ నుండి 37 కి. మీ. దూరంలో, గంగావతి తాలూకా కి 17 కి. మీ. దూరంలో ఉన్నది. దీనిని సువర్ణగిరి అని అంటుంటారు. కనకగిరి అంటే బంగారు పర్వతం అని అర్థం. ఇక్కడున్న పురాతన ఆలయాలలో కనక చలపతి దేవాలయం ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయ శిల్ప కళా చాతుర్యం యాత్రికులను కట్టిపడేస్తుంది. కనకగిరి పొలిమేరలలో ఉన్న రాచరిక స్నానపు ప్రదేశాలు చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.
Photo Courtesy: Dineshkannambadi
కిన్నాల్
కొప్పల్ జిల్లాలో, ప్రతి సంవత్సరం చాలామంది ప్రజలు చేతి కళల వస్తువుల కొనుక్కోవడం కోసం కిన్నాల్ వస్తారు. హస్తకళల వస్తువులే కాక, కిన్నాల్ లక్క వస్తువులకు కూడా ప్రసిద్ధి. ఇక్కడి ప్రజలు నేత, కుండలు చేయటం, దువ్వెనలు తయారీ వంటివి చేస్తారు. హస్తకళా నైపుణ్యతలు కల అన్ని వస్తువులు తయారు చేస్తారు. నైపుణ్యత గల హస్తకళా నిపుణులు, పర్యాటకులకు చిన్న చిన్న వస్తువుల తయారీకి కొన్ని ట్రిక్కులు కూడా నేర్పిస్తారు. చేతి కళల వస్తువులు, బొమ్మలు, వంటివి కిన్నాల్ లో చవకగా లభ్యం అవుతాయి.
Photo Courtesy: Shobhana Swami
హులిగేమ్మ ఆలయం
కొప్పల్ జిల్లాలో ఉన్న మునీరాబాద్ పురాణ ప్రాధాన్యత కలది. రిష్వా మూకా కొండలు, వాలి కొండలు మరియు పంపానది ఇక్కడే ఉన్నాయి. ఈ ప్రదేశంలో హులిగెమ్మ దేవాలయం తప్పక చూడదగినది. హులిగెమ్మ దేవతను ఇక్కడ ఆరాధిస్తారు. దేవాలయం చూసే భక్తులు మొదటగా ఒక పెద్ద ధ్వజస్తంభాన్ని చూస్తారు. ఇది షుమారు 25 అడుగుల ఎత్తు ఉండి పర్యాటకులకు కళ్ళు తిప్పలేనంత ఆకర్షణ కలిగిస్తుంది.
Photo Courtesy: Shankar Adisesh
సోమేశ్వర ఆలయం
కొప్పల్ జిల్లాలో కుష్టగి తాలూకా లో ఉన్న పుర అనే ప్రదేశంలో ప్రసిద్ధి చెందిన శివాలయాలలో ఒకటైన సోమేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం హొయసాల కాలం నాటి శిల్ప సంపదను చూపిస్తుంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం నందిని అధిరోహించిన శివుడు.
Photo Courtesy: karnataka tourism
మునీరాబాద్
కొప్పల్ పట్టణంలోని మునీరాబాద్, ప్రశాంతంగా ఉండి చక్కటి పచ్చదనం కలిగి , తుంగభద్ర నదికి దగ్గరలో ఉంటుంది. మునీరాబాద్ స్ధానిక ఆకర్షణలు అంటే, తుంగభద్ర డ్యామ్, పంపా సరోవర్, వాలి కొండ, హులిగెమ్మ మఠం మరియు రిష్యమూక కొండలు అని చెప్పాలి. రిష్యమూక కొండలు - రామాయణంలో ఈ ప్రదేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాలి కొండ అనేది వాలి కోట అని చెపుతారు. రామాయణం మేరకు శ్రీరాముడు హనుమంతుడిని మొదటి సారిగా రిష్యమూక కొండపై కలిశాడు.
Photo Courtesy: suresh_sathyanarayana
అనెగుండి
కొప్పల్ నుండి 45 కి. మీ. దూరంలో ఉన్న అనెగుండి తుంగ భద్ర నది ఒడ్డున కలదు. కన్నడ లో అనెగుండి అంటే అర్థం ఏనుగుల గొయ్యి అని. ఈ ప్రదేశంలో ఆంజనాద్రి హిల్ అంటే, హనుమంతుని జన్మస్థానం కూడా పర్యాటకులు దర్శించుకోవచ్చు. అనెగుండి ప్రదేశాన్ని చూడాలంటే తెప్పలలో ప్రయాణించవలసి ఉంటుంది. ఇక్కడ పురాతన ఆలయాలు, కోటలు, సరస్సులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
Photo Courtesy: Bala Subramanian
కొప్పల్ ఎలా చేరుకోవాలి
రోడ్డు ప్రయాణం
కొప్పల్ పట్టణానికి రాష్ట్ర ప్రధాన నగరాలు షిమోగా, హుబ్లీ, మంగుళూరు మొదలైన ప్రదేశాలనుండి డీలక్స్ మరియు సెమీ డీలక్స్ బస్ సౌకర్యం కలదు.
రైలు ప్రయాణం
కొప్పల్ కు దేశంలోని వివిధ పట్టణాల నుండి రైలు ప్రయాణ సౌకర్యం కలదు.
విమానాశ్రయం
కొప్పల్ కు సమీపంలోని విమానాశ్రయం హుబ్లి లోని దేశీయ విమానాశ్రయం. కొప్పల్ నుండి ఈ విమానాశ్రయం 154 కి. మీ. దూరంలో ఉంది.
Photo Courtesy: ishmael1973