కర్నాటక రాష్ట్రం బెంగళూరు నగరానికి 70 కి.మీ ల దూరంలో, తుముకూరు జిల్లాలో ఉన్న హిల్ స్టేషన్ దేవరాయనదుర్గ. ఈ ప్రాంతం అంతా బండరాళ్ళతో, చుట్టూ అందమైన కొండలతో, దట్టమైన అడవులతో మరియు ఆలయాలతో చూడటానికి ఆకర్షనీయంగా కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి : బెంగళూరు నుండి 35 కి. మీ ల దూరంలో ..!
పూర్వం దేవరాయనదుర్గ ను కరిగిరి అని పిలిచేవారట (కరి అంటే 'ఏనుగు' గిరి అంటే 'కొండ'). దేవరాయనదుర్గ కొండ ను తూర్పు వైపు నుండి చూస్తే ఏనుగు ఆకారంలో కన్పిస్తుందట అందుకే దీనికి ఆ పేరు. ఈ వీకెండ్ బెంగళూరు లో ఉంటె ఈ ప్రదేశాన్ని తప్పక చూసి రండి . ఇక్కడ ఏమేమి చూడాలో ? ఒకసారి గమనిస్తే ..
దేవరాయనదుర్గ - ఆలయాలు
దేవరాయనదుర్గ లో ఉన్న ఆలయాలలో ప్రధానమైనది యోగా నరసింహ స్వామి ఆలయం, భోగ నరసింహ స్వామి ఆలయం. వీటితోపాటు మహాలక్ష్మి ఆలయం, సంజీవరాయ ఆలయం లు చూడదగ్గవి గా ఉన్నాయి.
చిత్ర కృప : ramesholla Follow
భోగ నరసింహ స్వామి ఆలయం
దేవరాయనదుర్గ లో ప్రయాణం చేసేటప్పుడు కొండ దిగువన ఉన్న భోగ నరసింహ స్వామి ఆలయాన్ని తప్పక సందర్శించాలి. చోళుల కాలంలో ఈ ఆలయాన్ని కట్టించినారు. శివుని అవతారంగా భావించబడే దుర్వాస మహాముని చేత విగ్రహం ప్రతిష్టించబడింది. మైసూర్ మహారాజుల ఇలవేల్పు ఈ దేవుడు.
చిత్ర కృప : Parshotam Lal Tandon
యోగనరసింహ స్వామి ఆలయం
దేవరాయనదుర్గ సందర్శించే యాత్రికులు కొండ పైన ఉన్న యోగనరసింహ స్వామి ఆలయాన్ని తప్పక సందర్శించాలి. బ్రహ్మ దేవుడు ఈ యాత్రా స్థలాన్ని నిర్మించినట్టు కధనం. బ్రహ్మ సుమారు 1000 ఏళ్ళు తపస్సు చేస్తే శివుడు మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన నరసింహ స్వామి రూపంలో ప్రత్యక్షమైనట్టు భావిస్తారు.
చిత్ర కృప : PixelPyx
కళ్యాణ తీర్థం
యోగనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో కనిపించే చెరువు కళ్యాణ తీర్థం. ఇక్కడి ప్రధాన దైవం విగ్రహం లో నుంచి ఒక పవిత్రమైన తీర్థం వస్తుందని భక్తుల, స్థానికుల నమ్మకం.
చిత్ర కృప : Jugie singh
విద్యాశంకర దేవాలయం
దేవరాయనదుర్గ కు సమీపంలో ఉన్న దుర్గదహళ్లి గ్రామంలో విద్యాశంకర దేవాయం కలదు. ఇది సుమారు 400 ఏళ్ళ కిందట నిర్మించినట్టు చెబుతారు. చూడటానికి ఎంతో అందంగా కనిపించే ఈ ప్రదేశాన్ని కూడా పర్యాటకులు తప్పక సందర్శించాలి.
చిత్ర కృప : Pilar Sáenz
సంజీవరాయ దేవాలయం
సంజీవుడు అంటే ఆంజనేయుడు. ఆయనే కదా లక్ష్మణుడు స్పృహ కోల్పోతే సంజీవ పర్వతం తెచ్చింది. సంజీవరాయ దేవాలయం లో అనజనేయుడు కొలువై ఉంటాడు. ఈ ఆలయాన్ని నరసింహ స్వామి ఆలయం కంటే ముందు నిర్మించారని స్థానికుల నమ్మకం.
చిత్ర కృప : Narendra Sadhu
మహాలక్ష్మి దేవాలయం
దేవరాయదుర్గ సమీపంలోని గోరహనహళ్లి వద్ద ఉన్న మహాలక్ష్మి ఆలయాన్ని తప్పక సందర్శించాలి. ఇక్కడ మహాలక్ష్మి స్వయంభూవని జానపద కధనాల సారాంశం. మారికాంబ, నాగ దేవత వంటి దేవతా విగ్రహాలను చూడవచ్చు. ఆలయంలో ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.
చిత్ర కృప : ramesholla
నామద చిలుమే
కొండ కింద నుండి తుముకూరు వెళ్ళే మార్గంలో 'నామద చిలుమే' స్థలం ఉన్నది. చిలుమే అంటే ఎగిసి పడే అని అర్థం. దీని వెనకాల ఒక కథ ఉంది. త్రేతాయుగం లో శ్రీరాముడు లంకకు వెళుతూ మార్గమధ్యంలో ఇక్కడ కొంత సేపు విశ్రమించాడు. నీరు త్రాగుదామని అటు ఇటు చూసాడు. చివరికి నీరు లేదని గ్రహించిన శ్రీరాముడు భూమి మీదకు ఎక్కుపెట్టి బాణాన్ని సంధిస్తే నీరు ఎగిసి ఎగిసి పడింది. ఆ కారణంగా దీనిని నామద చిలుమే అని పిలుస్తుంటారు.
చిత్ర కృప : Siddarth P Raj
నామద చిలుమే
ఎగిసి పడే నీటి ధారలను పర్యాటకులు ఇప్పటికీ చూడవచ్చు. అలాగే సమీపంలో రాముని పాద ముద్రలు కూడా గమనించవచ్చు. నామద చిలుమే ప్రదేశంలో పాత భవనం ఒకటి కనిపిస్తుంది. అందులో ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త డాక్టర్ సలీం అలీ తన పరిశోధనల నిమిత్తం ఇక్కడ నివసించాడని చెబుతారు.
చిత్ర కృప : Pilar Sáenz
దేవరాయనదుర్గ ఎలా చేరుకోవాలి ?
విమాన మార్గం
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దేవరాయనదుర్గ కు సమీపాన ఉన్న విమానాశ్రయం (70 కి. మీ దూరంలో). ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, ముంబై, కోల్కతా వంటి తదితర నగరాల నుండి, ఇతర దేశాల నుండి తరచూ విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి దేవరాయదుర్గ చేరుకోవచ్చు.
రైలు మార్గం
దేవరాయనదుర్గ కు 18 కి. మీ ల దూరంలో తుముకూరు రైల్వే స్టేషన్ (జంక్షన్) కలదు. బెంగళూరు, చెన్నై, మైసూరు, బళ్ళారి, ధర్మవరం వంటి సమీప ప్రాంతాల నుండి రైళ్ళు నడుస్తుంటాయి.
రోడ్డు మార్గం / బస్సు మార్గం
దేవరాయనదుర్గ చేరుకోవటానికి బెంగళూరు నుండి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు, ప్రవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి. సొంతవాహనాల్లో ప్రయాణించే వారు మార్తహళ్లి నుండి వెళితే త్వరగా చేరుకోవచ్చు.
చిత్ర కృప : vikram achar