Search
  • Follow NativePlanet
Share
» »శ్రీకాకుళం - బౌద్ధ, జైన, శైవ మతాల సంగమం !!

శ్రీకాకుళం - బౌద్ధ, జైన, శైవ మతాల సంగమం !!

శ్రీకాకుళం ... ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా. ఈ జిల్లా బంగాళాఖాతం ఒడ్డున ఉన్నది. ఈ ప్రదేశాన్ని సిక్కోలు అని కూడా పిలుస్తారు. సికాకుళం అనేది కూడా ఈ ప్రదేశాన్నే!. సుధీర్ఘమైన సముద్ర తీరం ... పచ్చదనంతో కూడిన ప్రకృతి ... ఎంతో విలువైన ఖనిజ సంపద ... అతి ప్రాచీన చరిత్ర ... బుద్ధుని క్షేత్రాలు .... దేశంలో కెల్ల అరుదైన ఆలయాలు శ్రీకాకుళం సొంతం. దీనిని పేదల ఊటీ గా అభివర్ణిస్తారు. ఇక్కడ మహాత్ముడు మూడు రోజుల పాటు గడిపాడు.

ఫ్రీ కూపన్లు : గోఐబిబో వద్ద హోటల్ బుకింగ్ ల మీద 6000 రూపాయల వరకు ఆఫర్ సాధించండి

జిల్లా చరిత్ర

ఒకప్పుడు ఇది బౌద్ధమతానికి ముఖ్య స్థానంగా వర్ధిల్లింది. శాలిహుండం, దంతపురి, జగతిమెట్ట వంటి బౌద్ధారామాలు ఇక్కడ కనుగొనబడ్డాయి. తరువాత ఇది కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. గాంగేయులు ఈ ప్రాంతాన్ని 6 నుండి 14వ శతాబ్దం వరకు, 800 సంవత్సరాలు పాలించారు. వజ్రహస్తుని కాలంలో ప్రసిద్ది చెందిన శ్రీ ముఖలింగం ఆలయాన్ని నిర్మించారు. మహమ్మదీయుల పాలన కాలంలో షేర్ మహమ్మద్ ఖాన్ శ్రీకాకుళంలో జామియా మసీదు నిర్మించాడు. ఆంధ్ర ప్రదేశ్ లో నక్సలైటు (మావోయిస్టు పార్టీ) ఉద్యమం ప్రారంభమయింది శ్రీకాకుళం జిల్లాలోనే. ఇక ఇక్కడున్న ప్రధాన సందర్శనీయ ప్రదేశాలను ఒకసారి గమనిస్తే ...

శ్రీకాకుళం

శ్రీకాకుళం

పట్టణంలో ప్రాచీన ఆలయాల్లో శ్రీ ఉమారుద్ర కోటేశ్వరాలయం ఒకటి. ఏకాంత గణపతి పర్వతాకారులైన నందీశ్వరునితో అలరారుతోంది. ఈ ఆలయంలో 16, 17 శతాబ్దాల శాసనాలు లభించాయి. శ్రీకోదండరామస్వామి ఆలయం, జిల్లాలో అతిపెద్దదైన జుమ్మామసీదు ప్రత్యేకంగా పేర్కొనవచ్చు.

Photo Courtesy: srikakulam temples

ఆరోగ్య ప్రదాత.. అరసవల్లి సూర్యదేవుడు

ఆరోగ్య ప్రదాత.. అరసవల్లి సూర్యదేవుడు

ప్రాచీన దేవాలయాల సమూహాన్ని కలిగిన శ్రీకాకుళం ప్రతి ఆంధ్రుడు దర్శించవలసిన ప్రాంతం. శ్రీకాకుళం నుంచి 3 కి.మీ దూరంలో ఉన్నది ఈ అరసవిల్లి. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయానికి ప్రసిద్ది చెందింది. రాష్ట్రంలో మరెక్కడా సూర్య దేవాలయం లేదు. మరొక దేవాలయాన్ని తమిళనాడులో చూడొచ్చు. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది. సంవత్సరంలో రెండు సందర్భాల్లో సూర్యుని కిరణాలు సూర్యోదయ సమయంలో నేరుగా స్వామి వారి పాదాలపై ప్రసరిస్తాయి. ఎటునుంచి వస్తాయో ఎవరికీ తెలియదు . ఈ విశేషాన్ని చూడటానికి భక్తులు రాష్ట్రంలోనే కాక దేశంలోని పలు ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. రాధసప్తమి నాడు ప్రత్యేక పూజలు జరుపుతారు.

Photo Courtesy: విశ్వనాధ్.బి.కె.

కోరిన కోరికలు తీర్చే శ్రీముఖలింగేశ్వరుడు

కోరిన కోరికలు తీర్చే శ్రీముఖలింగేశ్వరుడు

శ్రీకాకుళం నుంచి 56 కి.మీ దూరంలో ఉన్నది ఈ శ్రీముఖ లింగం. ఈ ప్రాంతం వంశధార నదీ తీరంలో వెలసిన పుణ్యక్షేత్రం. త్రిశిర శివలింగం ఇక్కడ ఆలయంలో ప్రత్యేకత. ఒకానొకప్పుడు శబరుల శివుని కోసం తపస్సు చేశారట. వారి కొరకు విప్పచెట్టు అనగా మధుకవృక్షం నుంచి పరమశివుడు ప్రత్యక్ష్యమైనాడని పురాణగాథ. స్వామివారి మూడు ముఖములను భీమేశ్వర , సోమేశ్వర , ముఖలింగేశ్వర స్వామి అనే పేర్లు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ శివుని పూజించడం వాళ్ళ మోక్ష ప్రాప్తి ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో ఎకపాది కాలభైరవులు , త్రిపాది భ్రుగేస్వరులను దర్శించవచ్చు.

Photo Courtesy: Kishore.bannu / kvs_vsp

అరుదైన శ్రీకూర్మనాథుడి దివ్యక్షేత్రం

అరుదైన శ్రీకూర్మనాథుడి దివ్యక్షేత్రం

శ్రీ కాకుళం నుండి 15 కి.మీ. దూరానగల శ్రీకూర్మం గ్రామంలో "కూర్మనాధ స్వామి" మందిరం ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. భారతదేశంలో ఈ మాదిరిగా కల కూర్మావతారం మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడి స్వామి పడమటి ముఖముగా ఉంటారు. మరొక విశేషం ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు గలవు. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటు శ్రీరామానుజాచార్యుల, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యుల, కోదండరామస్వామి వారల ఆలయాలు గలవు.

Photo Courtesy: Adityamadhav83

సాగరతీరం.. కళింగపట్నం

సాగరతీరం.. కళింగపట్నం

కళింగపట్నం శ్రీకాకుళం జిల్లాలో బంగాళా ఖాతము ఒడ్డున ఉన్న ప్రాచీన ఓడరేవు. ఇది శ్రీకాకుళానికి 25 కి. మీ. దూరంలో ఉన్నది. రాష్ట్రమంతటా పేరొందిన శ్రీకళాంజలి సాంస్కృతిక సంస్థ ఇక్కడిదే. వంశధార నది ఇక్కడే బంగాళా ఖాతము లో కలుస్తుంది. ఇక్కడ హిందువుల, క్రైస్థువల, ముస్లింల దేవాలయాలు ఉన్నవి. మధీనా సాహేబ్ సమాధి చాలా ఫేమస్ . జిల్లా నలుమూలల నుండి ముస్లింలే కాకుండ హిందువులు ఈ సమాధిని దర్శిస్తారు. సువిశాలమయిన బీచ్ ,ఆందమైన సరుగుడు తోటలు, ప్రాచీన బౌద్ద కట్టడాలు, దీప స్తంభం (లైట్ హౌస్) లతో బహు సుందరముగా కనిపిస్తుంటుంది. ఇక్కడ లైట్ హౌస్ 1876 లో ఆంగ్లేయులు కట్టించారు. ఈ లైట్ హౌస్ సుమారు 23 కి.మీ.దూరము వెలుతురు ఫోకస్ ని చుట్టూ పంపగలుగుతుంది. . పిల్లలతో, పెద్దలతో కళింగపట్నం మంచి పిక్నిక్ స్పాట్ గా మారిపోయింది.

Photo Courtesy: Antony Colas

మరో కోనసీమ...కవిటి

మరో కోనసీమ...కవిటి

కవిటి సముద్ర మట్టంనుండి సగటున 41 మీటర్లు సగటు ఎత్తున ఉన్నది. సోంపేట, ఇచ్ఛాపురం అనే రెండు పట్టణాల మధ్యలో కవిటి ఉన్నది. ఈ మండలం ప్రాంతాన్ని వాడుకలో ఉద్యానవనం అంటుంటారు. తీరానికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం కొబ్బరితోటలు, జీడిమామిడి తోటలు, పనస తోటలతో కనులకింపుగా ఉంటుంది.గ్రామంలో చింతామణి అమ్మవారి ఆలయం, శ్రీ సీతారామస్వామి ఆలయం ముఖ్యమైన దేవాలయాలు.

Photo Courtesy: SriHarsha PVSS

ప్రకృతి అందాల సోయగం.. బారువ తీరం

ప్రకృతి అందాల సోయగం.. బారువ తీరం

శ్రీకాకుశం జిల్లాలో సువిశాలమైన ఇసుకతిన్నెలు కలిగిన బారువ తీరం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ఇక్కడ ఓడరేవు ఉండేది. ఎన్నో ఆలయాలుండేవి. కనుచూపుమేర ఇసుక తిన్నెలతో ప్రకృతి పిండారబోసినట్టు ఉంటుంది. సముద్ర స్నానానికి ఇది అనువైన ప్రాంతం. మహేంద్రతనయ నదీ సాగర సంగమ ప్రాంతంతోపాటు ఏపుగా ఎదిగిన కొబ్బరి తోటలు ప్రకృతి శోభకు ప్రత్యేక అందాన్నిస్తుంటాయి. శ్రీకాకుళం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో బారువ ఉన్నది. కోటిలింగేశ్వర, జనార్దన, జగన్నాధ ఆలయాలతోపాటు మరో 10 దేవాలయాలు బారువలో ఉన్నాయి. కార్తీక మాసంతోపాటు ఇతర పుణ్యదినాల్లో సముద్ర స్నానాల కోసం ఇక్కడకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది వస్తుంటారు. సమీప ప్రాంతంలో ఉన్న ప్రజలు సేద తీరేందుకు ప్రతి రోజు సాయం సమయాల్లో ఇక్కడకు చేరుతుంటారు.

Photo Courtesy: uday

విదేశీపక్షుల విడిదికేంద్రం - తేలినీలాపురం

విదేశీపక్షుల విడిదికేంద్రం - తేలినీలాపురం

తేలినీలాపురం పేరు చెబితేనే సైబీరియా పక్షులు గుర్తుకువస్తాయి. పెలికాన్, పెయింటెడ్ స్టార్క్స్ జాతిపక్షులు 12,000 మైళ్లు దాటి ఏటా సెప్టెంబరు నెలలో ఇక్కడకు చేరుకుంటాయి. పిండోత్పత్తి జరుపుకుని పిల్లలు పెద్దయ్యాక ఏప్రిల్ నెలలో తిరిగి స్వస్థలానికి వెళ్లిపోతాయి. ఈ విదేశీ విహంగాలు ఎంత ఎక్కువగా వస్తే తమ పంటలు అంత అధికంగా పండుతాయన్న నమ్మకం కూడా ఇక్కడి ప్రజల్లో ఉంది. పక్షుల రాక తక్కువైతే తమ గ్రామానికి ఎదో కీడు జరగుతుందని తరతరాలు వస్తున్న నమ్మకం. టెక్కలికి నాలుగు కిలోమీటర్ల దూరంలోఉన్న ఈ ప్రాంతానికి ఎటువంటి బస్సు సౌకర్యం లేదు. తలగాం జంక్షన్ వద్ద దిగి కిలోమీటరు దూరం నడవాలి లేదా టెక్కలి నుంచి ప్రత్యేకంగా ఆటోల ద్వారా వెళ్లవచ్చు. జిల్లాకేంద్రానికి 55 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది.

Photo Courtesy: Satya murthy Arepalli

దంతపురి

దంతపురి

శ్రీకాకుళానికి 21 కిలోమీటర్ల దూరంలో అలికాం-బత్తిలి రహదారి నుంచి రొట్టవలస గ్రామానికి తూర్పు దిశలో ఉన్న కోట ప్రాంతాన్ని దంతపురి, దంతవరపుకోట పేర్లతో పిలుస్తారు. ప్రాచీన కళింగ సామ్రాజ్యానికి రాజధానిగా వెలుగొందిన దంతపురికి ఘన చరిత్ర ఉంది. సుమారు 500 ఎకరాల విస్తీర్ణం చుట్టూ 50 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు కలిగిన మట్టి గోడలు ఆనాటి కోటకు ఆనవాళ్లుగా ఇప్పటికీ ఉన్నాయి. బుద్ధుని దంతం ఉన్న ప్రాంతం కనుక దంతపురి అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో జైన మతమూ వర్థిల్లినట్లు ఆధారాలున్నాయి. దంతపురిలో పలు దేవతల రాతి విగ్రహాలున్నాయి. నడుం వరకూ విరిగి ఉన్న విగ్రహం చాముండేశ్వరిదని స్థానికులు చెప్తున్నారు. కంఠాభరణం, దండాభరణం, కపాలాలతో కనిపిస్తున్న ఇలాంటి రాతి విగ్రహం రాష్ట్రంలో మరెక్కడా లేదని పురావస్తుశాఖ అధికారులు పేర్కొన్నారు.

Photo Courtesy:seshagirirao

శాలిహుండం

శాలిహుండం

శ్రీకాకుళం పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో గార మండలంలోని శ్వేతపర్వతంపై ఉన్న పవిత్ర బౌద్ధ యాత్రా స్థలం శాలిహుండం. శాలిహుండం అంటే ధాన్యం గాదె అని అర్థం. బౌద్ధ భిక్షవులు ఆహారధాన్యాలను నిల్వ చేసుకునే కేంద్రంగా శాలిహుండం ఉండడంతో ఈ పేరు వచ్చిందని చెప్తారు. ఇక్కడ పలు విలువైన విగ్రహాలు, బౌద్ధ స్తూపం, బౌద్ధ చైత్యం బయటపడ్డాయి. పురావస్తుశాఖ వాటిని భద్రపరచడానికి చిన్న మ్యూజియంను ఏర్పాటు చేసింది. ఈ శాలిహుండం కొండ పక్కగా వంశధార నది ప్రవహిస్తుంది. వంశధార నది కళింగపట్టణం వద్ద బంగాళాఖాతంలో కలిసే దృశ్యం ఇక్కడ్నుంచి చూస్తే లీలగా కనిపిస్తుంది. బౌద్ధ విగ్రహాలు, స్తూపాలు, మహా చైత్యం, భిక్షవులు వాడే పాత్రల నమూనాలతో పాటు మూడు తలలు, ఆరు చేతులు గల ఛాయాదేవి విగ్రహం, మరీచి, మంజుశ్రీ, జంబాల, జడధారిణి, తార విగ్రహాలు లభించాయి.

Photo Courtesy: George Puvvada

జగతిమెట్ట

జగతిమెట్ట

పోలాకి మండలం దుబ్బకవానిపేట సమీపంలోని జగతిమెట్ట వద్ద బౌద్ధమత ఆధారాలు లభించాయి. శాలిహుండం స్థావరంగా చేసుకుని కొందరు మత ప్రచారం కోసం జగతిమెట్టకు వెళ్ళారు. అక్కడ వంటలు చేసుకుని ఉండేవారని చెప్పారు. అప్పటి వంట గదులు నేటికీ ఉన్నాయి. వంటపాత్రలూ బయటపడ్డాయి. అప్పటి స్నానవాటికలు ప్రస్తుతం చెరువులుగా మిగిలాయి.

Photo Courtesy: George Puvvada

పాండవుల మెట్ట

పాండవుల మెట్ట

శ్రీకాకుళానికి 14 కిలోమీటర్ల దూరంలో ఆమదాలవలస వద్ద ఉన్న పాండవులమెట్టకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. అలికాం-బత్తిలి రోడ్డును ఆనుకుని ఉన్న ఈ మెట్టపై జైన మత ఆనవాళ్లు ఉన్నాయి. క్రీస్తుపూర్వం 5, 4 శతాబ్దాల్లో జైన మతస్తులు ఇక్కడ జీవనం సాగించినట్లు తెలుస్తోంది. మెట్ట పైభాగంలో రాతిపరుపులు ఉన్నాయి. ఇంత పెద్ద రాతిపరుపులు ఇంగ్లాండ్‌ దేశంలో ‘లవ్‌బరి' ప్రాంతంలో తప్ప మరెక్కడా లేవని పురావస్తు పరిశోధకులు చెప్తున్నారు. ఆ పరుపుల కింద క్రీస్తుపూర్వం నివాసమున్న ఆదివాసులు పూజించిన ప్రార్థనా మందిరాల ఆనవాళ్లు కూడా ఉన్నాయి.

Photo Courtesy: Adityamadhav83

ఆమదాలవలస

ఆమదాలవలస

శ్రీకాకుళానికి 13 కిలోమీటర్ల దూరంలో ఆమదాలవలస వద్ద ఉన్న సంగమేశ్వర ఆలయం బౌద్ధ, జైన, శైవ మతాల సంగమానికి గుర్తుగా నిలుస్తోంది. సంగమేశ్వర ఆలయం ఉన్న కొండను శిలాథ పర్వతమని పిలుస్తారు. ఆలయ ముఖద్వారం వద్ద ద్వారపాలకుల విగ్రహాలున్నాయి. కొండపై జైనుల విగ్రహాలు మరో రెండున్నాయి. సంక్రాంతి సమయంలో మూడు రోజుల పాటు ఇక్కడ జాతర నిర్వహిస్తారు.

Photo Courtesy: jeeva

సంగం

సంగం

శ్రీకాకుళానికి 56 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ నాగావళి, వంశధార, సువర్ణముఖి నదులు కలుస్తున్నాయి. ఇక్కడ సంగమేశ్వర మందిరం ఐదు లింగక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధం. మహాశివరాత్రికి ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది.

Photo Courtesy:kumar

పొందూరు

పొందూరు

శ్రీకాకుళం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. పొందూరు సన్న ఖాదీ వస్త్రాలకు ప్రసిద్ధి. ఈ ఖాదీ కేంద్రాన్ని శ్రీ దేవదాసుగాంధీ సందర్శించారు. ఇటీవల సన్నఖాదీ నుంచి పట్టుదారాన్ని మిళితం చేసి నూతన మగ్గాలను ఏర్పాటు చేశారు. ఖరీదు వేలల్లోనే ఉంటుంది.

Photo Courtesy: Adityamadhav83

మహేంద్ర గిరులు

మహేంద్ర గిరులు

తూర్పు కనుమల్లో ఎత్త్తెన పర్వతాలు మహేంద్రగిరులు. ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దులో ముడుత పర్వతాలుగా వరుస క్రమంలో ఆక్రమించి ఉన్నాయి. పచ్చని చెట్లు, గలగల పారే సెల ఏరులు, ఆహ్లాదాన్ని పంచే గాలులు ఈ గిరుల సొంతం. పక్షుల కిలకిలలు, వన్య, క్రూర మృగాల అరుపులు, వింతను గొలిపే దృశ్యాలు ఇక్కడి ప్రత్యేకం. ఇవి సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఉన్నాయి. జిల్లా సరిహద్దులో 26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. ఈ పర్వతాలకూ ఎవ్వర్‌గ్రీన్‌గా పేరుంది. ఈ గిరులనే దండకారణ్యంగా పురాణాల్లో పేర్కొని ఉంది. ఈ అడవుల్లోనే పాండవులు వనవాసం చేశారనేది పురాణ గాథ.

Photo Courtesy: Arif Mohammad

ఎండల మల్లిఖార్జునస్వామి దేవాలయం

ఎండల మల్లిఖార్జునస్వామి దేవాలయం

కలియుగ కార్తీక కైలాసంగా పేరుగాంచిన ఈ పుణ్యక్షేత్రం టెక్కలికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వయంభూ శివలింగంగా ప్రపంచంలోనే పెద్ద లింగంగా గుర్తింపు పొందింది. ఏటా శివరాత్రితోపాటు కార్తీక మాసంలో పెద్దఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి రోజున, కార్తీకమాసం సోమవారం పర్వదినాల్లో లక్షలాదిమంది భక్తులు సందర్శిస్తారు.

Photo Courtesy: kvs_vsp

పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం

పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం

బొబ్బిలి రాజుల ఆరాధ్యదేవత పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం ఉత్తరాంధ్రకే ప్రసిద్ధి. జిల్లాలోనే అత్యధిక ఆదాయాన్నిచ్చే ఆలయాల్లో ఇది రెండోది. ఇది పాలకొండలో ఉంది. ఏటా దసరా ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు వైభవంగా జరుగుతాయి. 600 ఏళ్ల కిందట నిర్మించిన జగన్నాథస్వామి ఆలయం పాలకొండలో ఉంది. పూరీలో ఉన్న ఆలయ నమూనాలో నిర్మించారు. మనుమకొండలో అక్షరబ్రహ్మ ఆలయం ఉంది.

Photo Courtesy: adithi

రాజాం

రాజాం

ఇక్కడ వున్న నవ దుర్గ ఆలయం దేశంలో అత్యంత అరుదైన ఆలయం. ఇదే కాకుండా అనేక దేవతల ఆలయాలతో రాజాం అలరారుతున్నది. ఇక్కడ ప్రతీ ఏడాది పోలిపల్లి పైడితల్లి అమ్మవారి వార్షిక యాత్రా మహొత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇక్కడ చీపురుపల్లి రోడ్డులో గల శ్రీ హనుమాన్ దేవాలయం ప్రసిద్దమైనది. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు మరియు రాజాం ప్రజానీకం మంగళ మరియు శనివారాల్లో ఎక్కువగా ఇక్కడకు వస్తారు. బొబ్బిలి యుద్ధం గాథకు చెందిన వీరుడు తాండ్ర పాపారాయుడు ఈ ప్రాంతానికి చెందినవాడే కావడం గమనార్హం.

PhotoCourtesy: Adityamadhav83

శ్రీకాకుళానికి ఎలా చేరుకోవచ్చు ??

శ్రీకాకుళానికి ఎలా చేరుకోవచ్చు ??

బస్సు మార్గం

శ్రీకాకుళానికి రోడ్డు వసతి చక్కగా ఉంది. జిల్లా ప్రధాన కేంద్రమైన శ్రీకాకుళం పట్టణం చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారిపై విశాఖపట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు ప్రయాణించవచ్చు. విశాఖ పట్టణం దీనికి సమీపంలో ఉన్న ఒక ప్రధాన నగరం.

రైలు మార్గం

సమీపంలోని రైల్వేస్టేషన్ ఆమదాలవలస స్టేషన్. ఇది శ్రీకాకుళం పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణించవచ్చు.

విమాన మార్గం

శ్రీకాకుళం లో రైల్వే స్టేషన్ లేదు కనుక దీనికి సమీపంలో ఉన్న విమానాశ్రయం విశాఖ పట్టణం ఏర్‌పోర్ట్. ఇది సుమారుగా 96 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ ఏర్‌పోర్ట్ ప్రస్తుతం దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నడుపుతుంది.

Photo Courtesy: pourinma

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X