పుష్పగిరి ... కడప జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ వైష్ణవ క్షేత్రం. ఇది ఒక ఆలయ సముదాయం. పుష్పగిరి కడప జిల్లా కేంద్రమైన కడప నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడి చేరుకోవటానికి పట్టణం నుండి జీపులు, ఆటో రిక్షాలు వెలుతాయి. దేవాలయ సముదాయం ఇంచుమించు 7.5 చ.కి.మీ. ల దూరంలో వ్యాపించి ఉన్నది. ఈ సముదాయం చుట్టూ కళకళలాడే పంటపొలాలు, పెన్నా నది ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ఇది కూడా చదవండి : తిరుమల తొలిగడప - దేవుని కడప !!
పుష్పగిరి ఆలయ సముదాయం చరిత్ర పురాతనమైనది. దీని గురించి స్కందపురాణంలో మొదట పేర్కొన్నారు. ఆతరువాత ఇక్ష్వాకుల శిలాశాశనాలలో పుష్పగిరిని 'శ్రీశైలమల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రమునకు దక్షిణ ద్వారము' గా పేర్కొన్నారు. కరికాలచోళుని కాలంలో ఈ స్థలం అత్యంత పవిత్రమైన క్షేత్రంగా పేర్కొనబడింది. పుష్పగిరి ఆలయ సముదాయం మరియు దాని చుట్టుప్రక్కల ఉన్న ఆకర్షణలను ఒకసారి గమనిస్తే ...
ఆదిశంకరులు
ఆదిశంకరుల వారు పూజించిన చంద్ర మౌళీశ్వర లింగం పుష్పగిరి క్షేత్రంలోనే కలదు. ఇక్కడ విద్యారణ్యస్వామి శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు. శైవులకు, వైష్ణవులకు ఈ స్థలం ప్రముఖ పుణ్యక్షేత్రం.
చిత్రకృప : Rpratesh
ఏపీలో ఏకైక శంకరాచార్య మఠం
వైష్ణవులు పుష్పగిరి క్షేత్రాన్ని 'మధ్య అహోబిలం' అని, శైవులు 'మధ్య కైలాసం' అని వర్ణిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఏకైక శంకరాచార్య మఠం ఇదొక్కటే !!
చిత్రకృప : Harish Aluru
హరిహర క్షేత్రం
శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆద్భుత శిల్ప సౌందర్యంతో అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం అలరారుతోంది.
చిత్రకృప : Harish Aluru
అనతికాలంలోనే మహర్దశ
పరీక్షిత్తు వంశాన్ని నిర్విర్యం చెయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశం పై పుష్పగిరి కొండ పై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది.
చిత్రకృప : Harish Aluru
ఆలయ సముదాయం -1
కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.
చిత్రకృప : Harish Aluru
ఆలయ సముదాయం -2
పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమలసంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్ర పాదము, విష్ణు పాదము ఈ కొండ మీదనే ఉన్నాయి.
చిత్రకృప : Harish Aluru
ఆలయ సముదాయం -3
పుష్పగిరిలో కింద వైద్యనాదేశ్వర, త్రికుటేశ్వర, భీమలింగేశ్వర, కామక్షి అమ్మవారి ఆలయాలున్నాయి. వైద్య నాథేశ్వరుడు, భీమేశ్వరుడు, త్రికూటేశ్వరుడు ఇక్కడ నెలకొని ఉన్నారు.
చిత్రకృప : Archaeo2
అభినవ చెన్నకేశ్వర స్వామి
వైద్య నాథేశ్వరాలయంలో శ్రీ కామాక్షి మందిరం ఉంది. వరదలు వచ్చినప్పుడు పెన్న దాటి ఆవలి వైపుకు వెళ్ళలేరు. అప్పుడు ఈవలి వైపు అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుగుతాయి.
చిత్రకృప : S.v.madhav
శ్రీ చక్రం
పాతాళ గణపతిని దర్శించుకొని పూజలు చేసెందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్ఠించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.
చిత్రకృప : Harish Aluru
శిల్పకళాసంపద
పుష్పగిరి శిల్పకళాసంపదకు పేరు. ఆలయం బయటి గోడలపైన ఉండే శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి. అక్కడ ఏనుగుల వరసలు, గుఱ్ఱాల మీద వీరుల విన్యాసాలు రమ్యంగా ఉన్నాయి. భారత రామాయణాల్లోని ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. కిరాతార్జున గాథ చిత్రించబడింది. నటరాజ నృత్యం చూసి తీరాలి. ఇక్కడి శిల్పాలలో సౌందర్యం తొణికిసలాడుతూ ఉంటుంది.
చిత్రకృప : Archaeo2
ఉత్సవాలు/పండుగలు
ప్రతి ఏడాది ఏప్రియల్ 15 నుండి 24 వరకు దేవాలయంలో బ్రహ్మోత్సవాలను జరుపుతారు. ఆ సమయంలో శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి, వైద్యనాదేశ్వరస్వామి వార్లను అలంకరించి అంగరంగ వైభవంగా ఊరేగిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో జాతర జరుగుతుంది.
చిత్రకృప : Harish Aluru
వసతి సదుపాయాలు
పుష్పగిరి గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప వసతి సదుపాయాలకు అన్ని విధాలా అనుకూలం. ఇక్కడ అనేక హోటళ్ళు, లాడ్జీలు కలవు. కనుక పర్యాటకులకు కడప సౌకర్యవంతంగా ఉంటుంది.
చిత్రకృప : Nikesh.kumar44
పుష్పగిరి ఎలా చేరుకోవాలి ?
వాయు మార్గం : కడప లో విమానాశ్రయం కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని పుష్పగిరి చేరుకోవచ్చు.
రైలు మార్గం : కడప లో రైల్వే స్టేషన్ కలదు. చెన్నై, హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాల నుండి రైళ్ళలో ఇక్కడికి చేరుకోవడం సులభం. స్టేషన్ లో దిగి బస్సు లో పుష్పగిరి చేరుకోవచ్చు.
రోడ్డు మార్గం : పుష్పగిరి చేరుకోవటానికి కడప అన్ని విధాలా ఉత్తమం. కడప నుండి ప్రభుత్వ బస్సులు, ప్రవేట్ వాహనాలు ఎక్కి పుష్పగిరి చేరుకోవచ్చు.
చిత్రకృప : Lokeshthimmana
ప్రధానమైన మూడు మార్గాలు
- కడప నుండి చెన్నూరు మార్గంలో ఉప్పరపల్లి మీదుగా కొండకు చేరుకొవచ్చు.
- ఖాజీపేట నుంచి వయా చింతలపత్తూరు మీదుగా భక్తులు వచ్చెందుకు వీలుగా వాహనాలు ఎక్కువగా తిరుగుతాయి.
- జాతీయరహదారి పై తాడిపత్రి నుంచి వల్లూరు వయా ఆదినిమ్మాయపల్లె మీదుగా వెళ్లొచ్చు.
చిత్రకృప : Nikesh.kumar44