అప్పలాయగుంట అనే ప్రదేశం తిరుపతికి కేవలం 4 కి. మీ ల దూరంలో ఉన్నది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఆలయం అత్యంత ప్రాధాన్యమైనది. ఎందుకంటే శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తిరుమలలో తన నౌకాయాన సమయంలో ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నట్లు నమ్ముతారు. ఇక్కడ శ్రీనివాసుడు అర్చా మూర్తి రూపంలో కొలువై ఉన్నాడు.
ఆలయ చరిత్ర
శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నారాయణ వనంలో ఆకాశ రాజు కుమార్తె అయిన పద్మావతి దేవిని వివాహం చేసుకొని తిరుమలకు కాలినడకన బయలుదేరుతారు. అలా తిరుమలకు వెళుతూ వెళుతూ తపస్సు చేసుకుంటున్న సిద్ధుడు అనే మహర్షికి స్వామి వారు అభయ హస్తంతో ఆశీర్వదించి, ఈ ఆలయంలో కొలువుతీరారు. స్వామి వారు అభయ హస్తంతో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత.
తర్వాత ఇక్కడి నుండి కాలినడకన తొండవాడ లోని అగస్తేశ్వరు ని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగాపురం లో ఆరునెలలు ఉండి అక్కడి నుండి శ్రీవారి మెట్టు ద్వారా (నూరు మెట్ల దారి) తిరుమల చేరాడని స్థల పురాణం.
చిత్రకృప : Bhaskaranaidu
అప్పలాయగుంట పేరువెనుక చరిత్ర
ఈ ప్రదేశంలో అప్పలయ్య అనే వ్యక్తి అవసరార్ధం ఒక గుంట తవ్వించాడని అప్పటి నుండి ఈ ప్రదేశం అప్పలయ్య గుంటగా పిలువబడినదని కాలక్రమంలో అది 'అప్పలగుంట' గా మారిందని తెలుస్తోంది. అప్పలయ్య ఆ గుంట త్రవ్వే సమయంలో పనిచేసినవారికి కూలి అప్పు చెప్పకుండా ఏరోజుకు ఆరోజే ఇచ్చేవాడని అందుకనే ఈ ప్రదేశాననికి ఈ పేరు వచ్చిందని అదనంగా మరో ప్రచారం ఉంది.
ఆలయ ప్రత్యేకతలు
ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండ, చుట్టూ పంటపొలాలు ఉండడముతో వాతావరణము చాల ప్రశాంతంగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం, దాని వెనుక అంతరాళం ఎదురుగా గర్భ గుడిలో శ్రీ వారి దివ్య మంగళ రూపం కనుల విందు చేస్తుంది. శ్రీ వారి ఆలయం ముందు చిన్న కోనేరు, దానికి ముందు అనగా ప్రధాన ఆలయానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి వారి ఆలయము ఉన్నది.
చిత్రకృప : Bhaskaranaidu
ఆలయంలో పూజలు అభిషేకాలు
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవాలయంలో ప్రతి శుక్రవారం జరిగే అభిషేకం చాలా ప్రసిద్ధి చెందినది. అభిషేకం రోజున, శని వారాలలో మరియు సెలవు దినాలలో భక్తులు ఇక్కడకి వచ్చి భగవంతుని ఆశీర్వాదం తీసుకుంటారు.
ప్రతి నిత్యం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారికి మంగళ వాయిద్యాలతో పూజాభిషేకాలు నిర్వహించి, తర్వాత శ్రీవారికి అభిషేకాలు పూజలు నిర్వహించి, భక్తులకు దర్శన భాగ్యాన్ని కలుగ జేస్తారు. ఇక్కడకు వచ్చే భక్తులు తక్కువ ఉన్నందున ఆలయం ప్రశాంత వాతావరణములో ఉన్నందున భక్తులు సావధానంగా చిత్త శుద్ధితో దైవ దర్శనం చేసుకోవచ్చు.ఆలయంలో శ్రీ ఆండాళ్, శ్రీ పద్మావతి అమ్మవారు, ఆంజనేయ విగ్రహాలు కూడా ఉన్నాయి.
చిత్రకృప : Bhaskaranaidu
ఆంజనేయస్వామి దేవాలయం
ఇక్కడి ఆంజనేయస్వామి చాలా మహిమగలవాడని నమ్ముతారు. దీర్ఘకాలిక వ్యాధులు నివారించడంలో ఇక్కడి హనుమంతుడు దిట్ట. వ్యాధులు తగ్గినవారు దేవాలయంలో ముడుపులు లేదా మొక్కుబడులు చెల్లించుకుంటారు. కనుక అప్పలాయగుంట వెళ్ళే భక్తులు వ్యాధులను తగ్గించి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆంజనేయ దేవాలయాన్ని చూడడం మరవద్దు !!
అప్పలాయగుంట ఎలా చేరుకోవాలి ?
అప్పలాయగుంట చేరుకోవటానికి చిత్తూరు లో అనేక మార్గాలు ఉన్నాయి. అయినా తిరుపతి నుండి ఇక్కడికి చేరుకోవడం సుఖమయం. తిరుపతి నుంచి అప్పలాయగుంట 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తిరుపతి బస్ స్టాండ్ నుంచి ప్రతి గంటగంటకు ఇక్కడికి బస్సులు తిరుగుతుంటాయి. చింతూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల నుంచి కూడా ప్రభుత్వ బస్సులు తిరుగుతుంటాయి. కనుక తిరుపతి వెళ్ళే యాత్రికులు అప్పలాయగుంట తప్పక దర్శించవలసిందే !!