లేపాక్షి ఆంధ్రప్రదేశ్ లో ఒక చారిత్రక ముఖ్య ప్రదేశం. దీని గురించి ఎప్పుడు, ఎక్కడ ప్రస్తావన వచ్చిన దీంతో పాటు ఒక పేరు వినపడుతుంది. అదే బసవన్న! ఈ బసవన్న కు, లేపాక్షి కి విడదీయలేని సంబంధం ఉన్నది. ఎంతగానో ప్రసిద్ధి చెందినది ఈ 'లేపాక్షి బసవన్న'. పాపనాశేశ్వర క్షేత్రం గా లేపాక్షి ప్రసిద్ధి. దేశంలోని 108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి కూడా ఒకటి.
హైదరాబాద్ నుండి బెంగళూరు కు వెళ్ళే మార్గంలో జాతీయ రహదారి నుండి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో లేపాక్షి ఉన్నది. హిందూపూర్ నుండి లేపాక్షి 13 కిలోమీటర్లు, బెంగళూరు నుండి 120 కిలోమీటర్లు. పట్టణ ప్రవేశంలోనే తోటలో అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో కనిపిస్తుంది. ఈ పట్టణంలో ప్రధాన ఆకర్షణ వీరభద్ర స్వామి దేవాలయం. ఇవేకాక పురాతన శివాలయం, మహా విష్ణువుకు అంకితం చేయబడిన దేవాలయాలు కూడా ఉన్నాయి. ముందుగా లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయం నుండి పర్యటన మొదలుపెడదాం !!
ప్రతి శిల్పం వర్ణనాతీతం
లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయం అద్భుతమైన శిల్పాలకు ఆలవాలం. ఇక్కడ ఉన్న ప్రతి శిల్పం, ప్రతి స్తంభం మలిచిన తీరు వర్ణనాతీతం.
చిత్రకృప : Bikashrd
కథనం -1
"సీతమ్మతల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే, ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లే పక్షీ అని పిలిస్తే, జటాయువు లేచి నిలుచుందని, అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు."
చిత్రకృప : Bikashrd
కథనం -2
మరో కథ ప్రకారం చూస్తే... అచ్యుతరాయలు కోశాధికారి విరూపణ్ణ రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకూ పూర్తయి, కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపణ్ణ వ్యతిరేకులు చేరవేసారు. దీంతో విరూపణ్ణ ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కళ్లనూ తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణవైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్లు విసిరికొట్టిన ఆనవాళ్ళుగా అక్కడి గోడపైనుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు కూడా. అలా లోప- అక్షి (కళ్లు లేని) అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు.
చిత్రకృప : MADHURANTHAKAN JAGADEESAN
లేపాక్షి బసవన్న
విజయనగర రాజుల పరిపాలనలో పరిఢవిల్లిన కళాతేజం లేపాక్షి.. లెక్కల ప్రకారం ఈ లేపాక్షి బసవన్న 8.1 మీటర్ల పొడవు, నాలుగన్నర మీటర్ల ఎత్తుతో మహా లింగానికి ఎదురుగా కూర్చుని ఉంటుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద నంది శిల్పంగా పేరుగాంచింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాత్రం నంది మెడలో కనిపించే రెండు గరుడ పక్షులు, వాటి ముక్కుల్లో వేలాడే ఏనుగులే.
చిత్రకృప : Bikashrd
నృసింహస్వామి
ఇది ఆ పక్షుల శక్తిని, పరిమాణాన్ని సూచిస్తుంది. అలాగే నంది కుడి ఎడమపక్కలలో నృసింహస్వామి ముఖం చెక్కబడి ఉంటుంది. విగ్రహం కుడివైపున నిలబడి నంది దృష్టిలోంచి చూస్తే వీరభద్రాలయంలోని నాగరాజు ఏడు పడగల విగ్రహం కొంత స్పష్టతతో కనిపిస్తుంది.
చిత్రకృప : Vu2sga
కూడ్య చిత్రాలు
విజయనగర రాజుల కాలంలో నిర్మించబడిన వీరభద్రాలయం గోడలమీద, పైకప్పుమీద అనేక కుడ్య చిత్రాలు మనోహరంగా వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడి ముఖ్య విశేషమే లేపాక్షి బసవన్న.
చిత్రకృప : Tarun R
తాబేలు ఆకారం
వీరభద్రాలయం కూర్మశిల అనే కొండమీద నిర్మించబడింది. కొండ ఆకారం తాబేలు రూపంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. విజయనగర ప్రభువుల కాలంలో లేపాక్షి పెద్ద వాణిజ్య కేంద్రంగానూ, యాత్రాస్థలంగానూ విలసిల్లింది.
చిత్రకృప : Mahesh Telkar
విఘ్నేశ్వర, నాగలింగ శిల్పాలు
లేపాక్షి శ్రీ వీరభద్రాలయం, అసంపూర్తి కళ్యాణమండపానికి పక్కన ఒకే రాతి మీద మలచిన విఘ్నేశ్వర మరియు నాగలింగ శిల్పాలున్నాయి. ఈ ప్రతిమలున్న పెద్ద శిల వున్నది, ప్రధాన ఆలయానికి సరిగ్గా వెనకవైపు అవుతుంది.
చిత్రకృప : Ranju.barman
శివాలయం
లేపాక్షికి 200 కిలోమీటర్ల దూరంలో మధ్యయుగాలనాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం నెలకొని ఉంది. ఈ ఆలయంలో దాదాపు ముప్పై అడుగుల ఎత్తు ఉండే శివలింగాన్ని పెద్ద పాము చుట్టుకుని ఉన్నట్లుగా ఉండే శివలింగం ఉంటుంది. ఇంకా ఈ ఆలయంలో చక్కటి శిల్పకళా చాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు, అనేక శివలింగాలు ఉంటాయి.
చిత్రకృప : Ranju.barman
ఇప్పటికీ పూజలు
ఈ ఆలయంలో ఇప్పటికీ పూజలు నిర్వహిస్తుంటారు కూడా...! నాట్య మంటపం- నాట్య మంటపం లో మొత్తం 70 స్తంభాలున్నాయి. ఇక్కడ రంభ, నారదుడు, తుంబురుడు మొదలైన వారి శిల్పాలు చెక్కి ఉన్నారు.
చిత్రకృప : pranab.mund
ఆధారం లేని స్తంభం
ఇది నాట్య మంటపంలో ఉంది. బ్రిటీష్ ఇంజనీర్లు కొంతమంది ఈ స్తంభం యొక్క రహస్యంకనుగొనాలి అని దీన్ని జరిపే ప్రయత్నం చేసారంట మొత్తం మంటపంలోని మిగిలిన స్తంభాలు కదిలేసరికి మొత్తం మంటంపం కూలుతుందేమో అని వదిలేసారంట. అలా దీనికి ఆధారం లేనప్పటికి మొత్తం మంటపానికి ఇదే ఆధారం అన్నమాట.
చిత్రకృప : Mahesh Telkar
నాట్య మంటపం
ఇక నాట్య మంటపం పై కప్పుకు ఉన్న వర్ణచిత్రాలు . ఇవి పూర్తిగా సహజ వర్ణాలతో వేయబడ్డవి. చాలావరకు చెక్కు చెదరకుండా ఆశ్చర్యాన్ని కలుగచేస్తాయి. ఎటువైపు నుంచి చూసిన మనల్నే చూస్తున్నట్టు ఉండే శ్రీ కృష్ణుడి చిత్రం.
చిత్రకృప : Nitinv29
మహాశివలింగం
ఏడు శిరస్సుల నాగు ఛత్రంగా ఉన్న మహా లింగం. నంది దగ్గర నుంచి చూస్తే ఈ నాగు శిరస్సు కనపడుతుంది. ఆలయం నిర్మాణం ప్రారంభించినప్పుడు మొదట వినాయకుడితో ప్రారంభించారంట.
చిత్రకృప : Ranju.barman
కళ్యాణ మంటపం
ఇది అసంపూర్తి కల్యాణ మంటపం. దీనికి కప్పు ఉండదు. ఈ కల్యాణ మంటపంలో శివుడికి పార్వతికి కల్యాణం జరిగే ఘట్టాలను శిల్పాలుగా చెక్కారు. అలంకారం అయిన పెళ్ళి కొడుకు , పార్వతి చేతి 4 వేళ్ళు పట్టు కున్న శివుడు, గమనించ వచ్చు. నాలుగు వేదాలకు, దిక్కులకు ప్రతీకగా ఇలా చెక్కారంట.
చిత్రకృప : Ranju.barman
3 తలలు ఉన్న ఒక ఆవు బొమ్మ
రెండు తలలు మూసి ఒక్కో తలను చూసినప్పుడు ఇందులో వరుసగా మేత మేస్తున్న ఆవు, దూడకు పాలు ఇస్తున్న ఆవు, తల ఎత్తి చూస్తున్న ఆవు అలా 3 రూపాలు కనపడుతాయి.
యముని ప్రతిమ
లేపాక్షి శ్రీ వీరభద్రాలయం - అసంపూర్తి కళ్యాణ మండపంలో దక్షిణ దిక్కున యముని ప్రతిమ వుంది. ఈ ప్రతిమలో యముడు రౌద్రుడుగా, పెద్ద పెద్దవిగా విప్పార్చుకున్న కనులతోనూ, గుండ్రని కనుబొమలతోనూ మలచబడి కనిపిస్తాడు. నాలుగు చేతులు - పై చేతులలో గద, పాశం, క్రింది చేతులు అభయ, వరద ముద్రలలో వున్నాయి.
చిత్రకృప : Vishal Prabhu
కుబేరుని ప్రతిమ
లేపాక్షిలోని కుబేరుని ప్రతిమ చాలా అందంగా తీర్చబడింది. నాలుగు చేతులు, పై రెండు చేతులలో గద, ఖడ్గం వుండి, క్రింది రెండు చేతులూ అభయ, వరద ముద్రలలో వున్నట్లుగా మలచబడి వుంది. కుబేరునిది కుండ లాంటి పొట్ట అని కూడా చెబుతారు. లేపాక్షి ప్రతిమలో మాత్రం అలా కనపడదు. అందమైన రూపంతో వుంటుంది ప్రతిమ.
చిత్రకృప : MADHURANTHAKAN JAGADEESAN
ఇంద్రుని ప్రతిమ
లేపాక్షి శ్రీ వీరభద్రాలయం, అసంపూర్తి కళ్యాణ మండపంలోని ఇంద్రుని ప్రతిమకు కొన్ని ప్రత్యేకలున్నాయి. అన్ని హంగులతో చాలా అందంగా తీర్చబడి వున్న ఇంద్రుని ప్రతిమకు, నొసటన నిలువుగా మూడవ కన్ను చెక్కబడి వుండడం అనేది గమనించాల్సిన ఒక అతి ముఖ్యమైనది సంగతి.
చిత్రకృప : Reddy Bhagyaraj
జ్ఞాపకం
ఈ కల్యాణ మండపం ప్రక్కనే రాతి స్తంభాల పైన డిజైన్స్ ఉంటాయి . మొత్తం 36 స్తంభాలు. ఒక్కో స్తంభం పైన 4. అలా మొత్తం 144 డిజైన్స్ ఉన్నాయి. రిపీట్ కాకుండా చెక్కారు. ‘లేపాక్షి' ఒకసారి జ్ఞాపకంలోకి విచ్చేస్తే అంత తొందరగా వదిలి వెళ్ళదు. మిగతావి ఏవైనా సరే విడిచి పెట్టి, దృష్టి అటువేపు మళ్ళించాలిసిందే!!
చిత్రకృప : Pavithrah
వసతి
లేపాక్షి లో స్నాక్స్, వాటర్ బాటిల్ షాప్ లు తక్కువ. కనుక పర్యాటకులు వెంట ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్ వెంట తీసుకువెళ్లడం మంచిది. హిందూపూర్, లేపాక్షి కి సమీప పట్టణం. ఇక్కడ హోటల్స్, లాడ్జీలు, రెస్టారెంట్లు కలవు. వసతి కి కూడా హిందూపూర్ సూచించదగినది. గౌతమీపుత్ర శాతకర్ణి లో నటించిన బాలకృష్ణ ఎం ఎల్ ఏ గా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇదే !!
చిత్రకృప : Bhaswati Guha Majumder
లేపాక్షి ఎలా చేరుకోవాలి ?
వాయు మార్గం : బెంగళూరు లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్నది. క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని లేపాక్షి సులభంగా చేరుకోవచ్చు.
రైలు మార్గం : లేపాక్షి కి సమీపాన హిందూపూర్ రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుండి రైళ్ళు వస్తుంటాయి. హిందూపూర్ లో దిగి, అక్కడి నుండి ప్రభుత్వ బస్సులలో, జీపులలో లేపాక్షి చేరుకోవచ్చు.
రోడ్డు మార్గం : హైదరాబాద్, అనంతపురం, బెంగళూరు తదితర ప్రాంతాల నుండి హిందూపూర్ కు బస్సులు కలవు. అక్కడి నుండి ఆర్టీసీ బస్సులలో, జీపులలో ప్రయాణించి లేపాక్షి వెళ్ళవచ్చు.
చిత్రకృప : Nishanth Jois