కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల మరొకటి తెలంగాణ లోని చిలుకూరు గా ప్రతీతి. తెలంగాణ తిరుమల గా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలదు.
చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాద్ కు చేరువలో .. మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో కలదు. హైదరాబాద్ కు చేరువలో ఉండటం, రవాణా సౌకర్యాలు కూడా చక్కగా అందుబాటులో ఉండటం వల్ల బాలాజీ ఆలయాన్ని దర్శించటానికి ప్రతిరోజూ వేలల్లో భక్తులు వస్తుంటారు. ప్రతి రోజూ 20 - 30 వేల మంది భక్తులు, సెలవుదినాలలో 30 -50 వేల మంది భక్తులు వేంకటేశ్వరుని దర్శిస్తుంటారు. విఐపి దర్శనాలు, టికెట్లు, హుండీ లు లేని దేవాలయంగా చిలుకూరు ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఒకే ప్రాంగణంలో ఒకవైపు వెంకటేశ్వర స్వామి, మరోవైపు శివుడు పూజలందుకోవటం ఈ ఆలయ విశిష్టత.
చిలుకూరు బాలాజీ ఆలయం ప్రవేశ మార్గం
చిత్ర కృప : Rail yatri
క్షేత్ర పురాణం
ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడొకాయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్లివచ్చేవాడట. అయితే, కొంత కాలానికి ఆయన జబ్బుపడి తిరుపతికి వెళ్లలేకపోయాడట.
ఇది కూడా చదవండి : కీసరగుట్ట - ఆత్మలింగ దర్శనం !
దీంతో ఆయన బాధపడుతుండగా కలలో శ్రీ వెంకటేశ్వరస్వామి కనిపించి నీకు నేనున్నాను అని అభయమిస్తాడట. అప్పుడు స్వామి కలలో ఒక ప్రదేశం గురించి చేబుతాడట. అతను ఆ ప్రదేశం వద్దకు వెళ్లి తవ్వగా శ్రీదేవి, భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి కనిపించాడట. దీంతో ఆ భక్తుడు అక్కడ శాస్త్రోక్తంగా విగ్రహాన్ని ప్రతిష్టించి మందిరాన్ని నిర్మించి తన భక్తిని చాటుకున్నాడట.
కోర్కెలను తీర్చుకుంటున్న భక్తులు
చిత్ర కృప : Rajesh Pamnani
మందిరం యొక్క ప్రాముఖ్యత
వెంకటేశ్వర స్వామి కోరిన కోర్కెలను తీర్చే కలియుగ వైకుంఠుడిగా ప్రసిద్ధి. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మొదటిసారి దర్శించి 11 ప్రదక్షిణలు చేసి కోర్కెలను కోరుకోవటం, పిమ్మట ఆ కోరిక నెరవేరిన తరువాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కును చెల్లించుకొనే పద్ధతి ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది.
చిలుకూరు బాలాజీ ఆలయానికి వీసా గాడ్ అని కూడా పేరు. కొన్నేళ్ల క్రితం పై చదువులకు పశ్చాత్త్య దేశాలకు వెళ్లి చదువుకొనే విద్యార్థులకు వీసా దొరకక ఇబ్బందిపడేవారు. చిలుకూరి బాలాజీ విశిష్టత తెలుసుకొని ఎక్కువ మంది త్వరగా వీసా రావాలని కోరుకోవటం .. ఆ కోరిక నెరవేరటం వెంటనే జరిగిపోయాయి. దాంతో ఇక్కడి స్వామి వారికి వీసా దేవుడిగా పేరొచ్చింది.
చిలుకూరు బాలాజీ ఆలయ గోపురం
చిత్ర కృప : jitendra_hassija
చిలుకూరు బాలాజీ స్వామి వారి దర్శనం
చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఉదయం 5 గంటల నుండి రాత్రి 7 :45 వరకు భక్తుల దర్శనార్ధం తెరిచే ఉంచుతారు. దర్శనం టికెట్లు, ప్రత్యేక పూజ టికెట్లు వంటివి ఏమీ ఉండవు. ఎంతటివారైనా క్యూలైన్ లో వెళ్ళవలసిందే!
మెహదీపట్నం బస్ డిపో
చిత్ర కృప : SaHiL mUhSiN
రవాణా సౌకర్యాలు
హైదరాబాద్ నగరం నుండి చిలుకూరు బాలాజీ ఆలయానికి చక్కటి రోడ్డు రవాణా సదుపాయాలూ కలవు. మెహదీపట్నం నుండి ప్రతి 5 నిమిషాలకొకసారి 222D నెంబరు గల బస్సు బయలుదేరుతుంది. ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, కూకట్ పల్లి నుండి కూడా సిటీ బస్సు సర్వీసులు కలవు. లంగర్ హౌస్ నుండి ఆటోల్లో ఎక్కి వీసా గాడ్ వద్దకు చేరుకోవచ్చు.