భారతావని పుణ్య భూమి, కర్మ భూమి. ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు, గుడులకు గోపురాలకు కొదువలేదు. ఎందరో రాజవంశీయులు, పాలకులు గుడులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దక్షిణ భారతదేశంలో ఆలయాలన్నీ దాదాపు భారతీయ సంస్కృతిని ఉట్టిపడే విధంగా ఆనాడు నిర్మించారు. ఆరోజుల్లో అత్యధిక ధన, కనక సంపద ఆలయాలలోనే ఉండేవి.
ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ ఏమి తినాలి ?
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కొన్ని చెప్పుకోదగ్గ ఆలయాలు ఉన్నాయి. ఏపీలో శైవ, వైష్ణవ మతాలు రెండూ అనాదికాలం నుండి అమలులో ఉన్నాయి. శివ భగవానుడిని, వెంకటేశ్వర స్వామిని, నరసింహ స్వామిని ఎక్కువగా పూజిస్తారు. దేవాలయాల యొక్క శిల్పకళా వైభవం, నాటి నుండి నేటివరకు అవి వెలుగొందిన తీరు మరియు స్థలపురాణం ఇటు భక్తులను, అటు యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల వివరాలలోకి వెళితే ..
ఆంధ్ర ప్రదేశ్ లో ఫ్యామిలీతో వెళ్ళవలసిన ప్రదేశాలు !!
అహోబిలం
అహోబిలం ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో కలదు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం ఉంది. ఈ వైష్ణవ క్షేత్రం చుట్టూ నల్లమల అడవులు, ప్రకృతి అందాలు, హోరెత్తించే జలపాతాలు, నదులు ఉన్నాయి. ఇవి హిందూ భక్తులకే కాక, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
టైమింగ్స్ : దిగువ అహోబిలం : 6 am - 2:30 pm & 5 pm - 8 pm
ఎగువ అహోబిలం : 6 am - 1 pm & 3 pm - 5 : 30 pm
చూడవలసినవి : ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం
ఎక్కడి నుండి ఎంత దూరం : కర్నూలు 137 కి.మీ, నంద్యాల 66 కి.మీ, హైదరాబాద్ 350 కి.మీ, బెంగళూరు 407 కి.మీ, కడప 114 కి.మీ, విజయవాడ 348 కి.మీ.
సౌకర్యాలు : హోటళ్లు, క్యాంటీన్లు, సత్రాలు, బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం, అన్నమాచార్య నిత్య అన్నదాన సత్రం కలవు.
చిత్రకృప : RameshSharma1
అన్నవరం
అన్నవరం తూర్పు గోదావరి జిల్లాకు చెందినది. పిలిస్తే పలికే దైవంగా పేరొందిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఇక్కడి రత్నగిరి అనే కొండ పై వెలిశాడు. కార్తీక మాసంలో ఇచట కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు వస్తుంటారు. సామూహికంగా వందలాది మంది దంపతులు కూర్చొని ఒకేసారి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయటం ఇక్కడి ప్రత్యేకత. టైమింగ్స్ : 6 am - 9 pm
చూడవలసినవి : పంపానది, సత్యనారాయణ స్వామి గుడి, సీతారాముల గుడి, వనదుర్గమ్మ, కనక దుర్గమ్మ గుడి, తులసి వనం, తోటలు మొదలైనవి.
ఎక్కడి నుండి ఎంత దూరం : రాజమండ్రి - 84 కి.మీ, వైజాగ్ - 123 కి.మీ, విజయవాడ - 234 కి.మీ, హైదరాబాద్ - 483 కి.మీ.
సౌకర్యాలు : హోటళ్లు, లాడ్జీలు ఉన్నాయి. ఏసీ, నాన్ - ఏసీ గదులు లభ్యమవుతాయి. అన్ని వర్గాల వారికి భోజన సదుపాయాలు ఉన్నాయి.
చిత్రకృప : Mydhili Bayyapunedi
కాణిపాకం
కాణిపాకం చిత్తూరు జిల్లాకు చెందిన పుణ్య క్షేత్రం. ఇక్కడ కొలువుదీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలసిన ఈ స్వామి కి వేల సంవత్త్సరాల చారిత్ర కలదు. సత్యప్రమాణాల దేవునిగా ప్రసిద్ధి చెందాడు. టైమింగ్స్ 4 am - 9 : 30 pm
చూడవలసినవి : శివాలయం, వరదరాజ స్వామి ఆలయం, వీరాంజనేయస్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలు మొదలుగునవి.
ఎక్కడి నుండి ఎంత దూరం : తిరుపతి - 71 కి.మీ, చిత్తూరు 13 కి.మీ, చెన్నై 175 కి.మీ, బెంగళూరు 181 కి.మీ, వెల్లూరు 50 కి.మీ , శ్రీపురం 59 కి.మీ, హైదరాబాద్ 575 కి.మీ.
సౌకర్యాలు : కాణిపాకం వద్ద భోజనం చేయటానికి హోటళ్లు ఉన్నాయి. వసతి కై చిత్తూరు సూచించదగినది.
చిత్రకృప : Adityamadhav83
లేపాక్షి
లేపాక్షి అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక ప్రదేశం. దక్షిణ భారతదేశంలో శివుడు, మహా విష్ణువు, వీరభద్ర స్వామి కి అంకితం ఇవ్వబడిన మూడు ప్రధాన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. కఠినమైన ఆలయ రాతి గోడలపై చెక్కిన అద్భుత శిల్పకళ పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తుంది. వ్రేలాడే రాతి స్తంభం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలింది. టైమింగ్స్ : 6 am - 7 pm
చూడవలసినవి : వీరభద్రస్వామిఆలయం, నాగలింగం, వ్రేలాడే స్తంభం, శివ పార్వతుల కళ్యాణ మండపం, నంది విగ్రహం మొదలుగునవి.
ఎక్కడి నుండి ఎంత దూరం : అనంతపురం - 125 కి.మీ, బెంగళూరు - 124 కి.మీ, తిరుపతి - 225 కి.మీ, హైదరాబాద్ - 478కి.మీ, విజయవాడ - 569 కి.మీ, హిందూపూర్ 14 కి.మీ.
సౌకర్యాలు : నంది విగ్రహం వద్ద హరిత రిసార్ట్ కలదు.
చిత్రకృప : Ranju.barman
మహానంది
మహానంది కర్నూలు జిల్లా నంద్యాలకు 19 కి.మీ ల దూరంలో ఉన్న పుణ్య క్షేత్రం. ఈ మహా క్షేత్రంలో స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరి దేవి కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7 వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు నిర్మించినట్లు చెబుతారు. టైమింగ్స్ : 5 :30 am - 8 : 30 pm
చూడవలసినవి : మహానంది చుట్టూ ఉన్న నవ నందులు,
ఎక్కడి నుండి ఎంత దూరం : నంద్యాల 19 కి.మీ, కర్నూలు - 93 కి.మీ, కడప -135 కి.మీ, హైదరాబాద్ 306 కి.మీ, విజయవాడ 316 కి.మీ, బెంగళూరు 360 కి.మీ.
సౌకర్యాలు : టిటిడి ధర్మసత్రాలు, హరిత హోటల్ మరియు ఇతర హోటలు, లాడ్జీలు కలవు. అన్ని వర్గాల వారికి భోజన సదుపాయాలు ఉన్నాయి.
చిత్రకృప : Adityamadhav83
మంత్రాలయం
కర్నూలు జిల్లా తుంగభద్రా నదీ తీరాన వెలసిన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి వారి పుణ్య క్షేత్రం. గురూజీని సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతారంగా భక్తులు నమ్ముతారు.ఆలయాన్ని ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శిస్తారు. టైమింగ్స్ : 6 am - 8:30 am, 9:30 am - 2 pm & 4 pm - 9 : 30 pm
చూడవలసినవి : తుంగభద్రా నదీతీరం, పంచముఖి ఆంజనేయస్వామి ఆలయం, బిక్షాలయ మొదలగునవి.
ఎక్కడ నుండి ఎంత దూరం : కర్నూల్ -74 కి.మీ, నంద్యాల 148 కి. మీ, ఆదోని 49 కి. మీ, హైదరాబాద్ 253 కి. మీ, బెంగళూరు 402 కి. మీ, హుబ్లీ 302 కి. మీ, విజయవాడ 416 కి. మీ.
సౌకర్యాలు : అన్ని కులస్తులకు సత్రాలు ఉన్నాయి. ప్రతిరోజూ నిత్యాన్నదానం నిర్వహిస్తారు.
చిత్రకృప : Mohan Krishnan
శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లా, నెల్లూరు సరిహద్దు ప్రాంతంలో కలదు. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనదైన మరియు పంచభూతలింగాలలో ఒకటైన వాయులింగం గల గొప్ప శైవ పుణ్యక్షేత్రం. ఇక్కడ రెండు దీపాలతో ఒకటి ఎల్లప్పుడూ కదులుతూ ఉంటుంది. టైమింగ్స్ : 6 am - 9 pm
చూడవలసినవి : శుకబ్రహ్మాశ్రమం, వేయిలింగాలకోన, తొండమనాడు ఆలయం, ద్రౌపదీ సమేత ధర్మరాజుల గుడి మొదలుగునవి.
ఎక్కడ నుండి ఎంత దూరం : తిరుపతి - 37 కి.మీ, చెన్నై - 113 కి. మీ, బెంగుళూరు - 291 కి. మీ, విజయవాడ - 375 కి. మీ, హైదరాబాద్ - 552 కి.మీ
సౌకర్యాలు : దేవస్థానం వారు నిర్వహించే త్రినేత్ర గెస్ట్ హౌస్ మరియు ఇతర హోటళ్లు, లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రా భోజనం ప్రతిరోజూ లభిస్తుంది.
చిత్రకృప : Kalyan Kanuri
శ్రీశైలం
శ్రీశైలం, కర్నూలు జిల్లాలో నల్లమల కొండలలో ఉన్న చిన్న పట్టణం. ప్రముఖ యాత్రాస్థలంగా భావించే ఈ పట్టణంలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఇది ఒకటి. ప్రతి ఏడాది లక్షలాది మంది హిందూ భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. టైమింగ్స్ : 5 am - 3:30 pm & 6 pm - 10 pm
చూడవలసినవి : అక్కమహాదేవి గుహలు, మల్లెల తీర్థం, శివాజీ స్ఫూర్తి కేంద్ర, డ్యాం, అభయారణ్యం మొదలుగునవి చూడదగినవి.
ఎక్కడ నుండి ఎంత దూరం : నంద్యాల - 160 కి.మీ, కర్నూల్ - 181 కి.మీ, విజయవాడ 263 కి.మీ, బెంగళూరు 527 కి.మీ.
సౌకర్యాలు : శ్రీశైలం లో హోటళ్లు, సత్రాలు, లాడ్జీలు కలవు. శాఖాహార అల్పాహారం, భోజనం దొరుకుతుంది.
చిత్రకృప : Ylnr123
తిరుమల
తిరుమల, తిరుపతి కి దగ్గరలో ఉన్న కొండ ప్రదేశం. తిరుమల అంటే పవిత్ర పర్వతం అని అర్థం (ద్రావిడ భాషలో 'తిరు' అంటే పవిత్రం అని, 'మల' అంటే పర్వతం అని అర్థం). తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఇది ఎదవ శిఖరంగా పిలువబడే వెంకటాద్రి కొండ పై కలదు. టైమింగ్స్ : 5 am - 11 pm
చూడవలసినవి : ఆకాశగంగ, శ్రీవారి పాదాలు, చక్ర తీర్థం, పాపవినాశనం, శిలాతోరణం మొదలుగునవి
ఎక్కడ నుండి ఎంత దూరం : తిరుపతి - 22 కి.మీ, చిత్తూరు - 87 కి.మీ, విజయవాడ 435 కి.మీ, హైదరాబాద్ 575 కి.మీ, బెంగళూరు 271 కి.మీ, వైజాగ్ 785 కి. మీ, చెన్నై 155 కి. మీ.
సౌకర్యాలు : ప్రతిరోజూ నిత్యాన్నదానం నిర్వహిస్తారు. దేవస్థానం కాటేజీలు, ఇతర వసతి సదుపాయాలు కలవు.
చిత్రకృప : Nikhilb239
తిరుపతి
తిరుపతి తూర్పుకొండల దిగువ భాగంలో ఉన్న నగరం. ఇది పండుగలు, ఉత్సవాల నగరం గా ప్రసిద్ధి చెందినది. గంగమ్మ జాతర ఫెమస్. దగ్గరలోని తిరుమల కొండ ప్రపంచంలోనే రెండవ ప్రాచీన కొండలని చెప్తారు.
చూడవలసినవి : శ్రీవెంకటేశ్వర పార్క్, తలకోన, శ్రీనివాస మంగాపురం, వరాహస్వామి, పద్మావతి అమ్మవారు, గోవిందరాజ స్వామి ఆలయం మొదలుగునవి
ఎక్కడ నుండి ఎంత దూరం :చిత్తూరు - 71 కి.మీ, విజయవాడ 413 కి.మీ, హైదరాబాద్ 546 కి.మీ, బెంగళూరు 259 కి.మీ, వైజాగ్ 763 కి. మీ, చెన్నై 134 కి. మీ.
సౌకర్యాలు : తిరుపతిలో అన్ని తరగతుల వారికి గదులు లభిస్తాయి. హోటళ్లలో రుచికరమైన భోజనాన్ని వడ్డిస్తారు.
చిత్రకృప : VinothChandar
యాగంటి
యాగంటి కర్నూలు జిల్లా బనగానపల్లె తాలూకాకు చెందిన పుణ్య క్షేత్రం. ఇక్కడ ఉమామహేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందినది. గర్భగుడికి ఎదురుగా ఉన్న నంది విగ్రహం స్వయంభువుగా వెలిసిందని చెబుతారు. టైమింగ్స్ : 6 am - 1 pm & 3 pm - 8 pm
చూడవలసినవి : అగస్త్య పుష్కరిణి, సహజ సిద్ధ గుహలు, యాగంటి బసవన్న మొదలుగునవి.
ఎక్కడి నుండి ఎంత దూరం : నంద్యాల 55 కి.మీ, కర్నూలు 80 కి.మీ, హైదరాబాద్ 308 కి.మీ, విజయవాడ 359 కి.మీ, బనగానపల్లె 11 కి.మీ.
సౌకర్యాలు : అన్నదాన సత్రం కలదు. శాఖాహార భోజనం వడ్డిస్తారు. దేవస్థానం సత్రాలు కొండ దిగువన విశాల ప్రాంగణంలో ఉన్నాయి.
చిత్రకృప : Ashwin Kumar
ద్రాక్షారామం
ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పట్టణం. ఇక్కడ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవాలయం కలదు. మూలవిరాట్ భీమేశ్వర స్వామి (శివలింగం) 14 అడుగుల ఎత్తు ఉండటం విశేషం. టైమింగ్స్ : 6 am- 12 pm & 3 pm - 8 pm
చూడవలసినవి : అష్టలింగాలు, సమీపంలోని ఇతర ఆలయాలు.
ఎక్కడి నుండి ఎంత దూరం : కాకినాడ 17 కి.మీ, రాజమండ్రి 42 కి.మీ, అన్నవరం 65 కి.మీ, విజయవాడ 197 కి.మీ, వైజాగ్ 198 కి.మీ, హైదరాబాద్ 446 కి.మీ.
సౌకర్యాలు : కాకినాడ, రాజమండ్రి నగరాలు వసతికై సూచించదగినవి.
చిత్రకృప : Aditya Gopal
పిఠాపురం
అష్టాదశశక్తి పీఠాలలో ఒకటైన పురుహూతికా దేవి ఆలయం, రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన కుక్కుటేశ్వర దేవాలయం తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో కలవు. కుక్కుటేశ్వర లింగం తెల్లగా గర్భాలయం లో కాస్త దిగువన ఉంటుంది . టైమింగ్స్ : 5 :30 am- 12 :30 pm & 4: 30 pm - 7 pm
చూడవలసినవి : దత్తక్షేత్రం, సాయిబాబా గుడి, కాలభైరవ ఆలయం, కుంతి మాధవస్వామి ఆలయం మొదలుగునవి
ఎక్కడి నుండి ఎంత దూరం : పిఠాపురం రైల్వే స్టేషన్ 2.5 కి.మీ, సామర్లకోట 12 కి.మీ, కాకినాడ 16 కి.మీ, రాజమండ్రి 61 కి.మీ, అన్నవరం 31 కి. మీ, విజయవాడ 208 కి. మీ, వైజాగ్ 152 కి. మీ.
సౌకర్యాలు : పిఠాపురం లో, రైల్వే స్టేషన్ సమీపంలో లాడ్జీలు, హోటళ్లు కలవు. మంచి రుచికరమైన భోజనం తక్కువ ధరకే దొరుకుతుంది.
చిత్రకృప : Adityamadhav83
సామర్లకోట
సామర్లకోట పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఈ ఊరు భీమేశ్వర ఆలయానికి ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఏటా శివలింగం పెరిగిపోతుంటే మేకు కొట్టారని చరిత్ర. దేవాలయాన్ని కుమారభీముడనే చాళుక్యరాజు నిర్మించాడు. టైమింగ్స్ 6 am -12 pm & 4 pm -8 pm.
చూడవలసినవి : శ్రీ మాండవ నారాయణ స్వామి ఆలయం, శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం మొదలుగునవి.
ఎక్కడి నుండి ఎంత దూరం : కాకినాడ 12 కి.మీ, రాజమండ్రి 52 కి.మీ, అన్నవరం 40 కి. మీ, విజయవాడ 199 కి. మీ, వైజాగ్ 172 కి. మీ, హైదరాబాద్ 447 కి. మీ.
సౌకర్యాలు : ఊరిలో హోటళ్లు, లాడ్జీలు కలవు. రుచికరమైన భోజనం లభిస్తుంది.
చిత్రకృప : Aditya Gopal
అంతర్వేది
తూర్పుగోదావరి జిల్లా నరసాపురం కు సమీపంలో త్రికోణ దీవిపై అంతర్వేది క్షేత్రం కలదు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి పురాతన దేవాలయం కలదు.
చూడవలసినవి : గుర్రాలక్క ఆలయం, వశిష్ట ఆశ్రమం, దీప స్తంభం, అన్నా చెల్లెళ్ళ గట్టు, బీచ్, ఇతర దేవాలయాలు మొదలగునవి.
ఎక్కడి నుండి ఎంత దూరం : కాకినాడ 111 కి.మీ, రాజమండ్రి 95 కి.మీ, నరసాపూర్ 15 కి.మీ, పాలకొల్లు 35 కి.మీ, విజయవాడ 171 కి. మీ, హైదరాబాద్ 430 కి. మీ.
సౌకర్యాలు : నరసాపూర్ వసతికై, భోజన సౌకర్యాలకై అన్ని విధాలా బాగుంటుంది.
చిత్రకృప : Adityamadhav83
భీమవరం
భీమవరం పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో కలదు. ఇక్కడ సోమేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. తూర్పు చాళుక్య రాజైన భీమ క్రీ.శ. 8 - 9 శతాబ్దాల మధ్యకాలంలో ఈ గుడిని నిర్మించినట్లు చెబుతారు. టైమింగ్స్ : 5 am - 11 am & 4 pm - 8 pm
చూడవలసినవి : మావుళ్ళమ్మ దేవస్థానం మరియు ఇతర దేవాలయాలు
ఎక్కడి నుండి ఎంత దూరం : భీమవరం బస్ స్టాండ్ 1.2 కి.మీ, ఏలూరు 65 కి. మీ, కాకినాడ 116 కి.మీ, రాజమండ్రి 76 కి.మీ, పాలకొల్లు 22 కి.మీ, విజయవాడ 117 కి. మీ, వైజాగ్ 277 కి. మీ.
సౌకర్యాలు : ఏలూరు తర్వాత రెండవ పెద్ద పట్టణం. లాడ్జీలు, హోటళ్లు కలవు. గదులు తక్కువ ధరకే దొరుకుతాయి. ఆంధ్రా స్టైల్ భోజనం లభిస్తుంది.
చిత్రకృప : PV Bhaskar
ద్వారకా తిరుమల
ద్వారకా తిరుమల ను చిన్న తిరుపతి గా అభివర్ణిస్తారు భక్తులు. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో కలదు. ఇక్కడ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. పెద్ద తిరుపతిలో (తిరుమల తిరుపతి) మొక్కిన మొక్కులు 'చిన్న తిరుపతి' లో తీర్చుకున్న అదే ఫలితం వస్తుంది. ఇక్కడ స్వామి దక్షిణాముఖుడై ఉన్నాడు. టైమింగ్స్ : 6 am - 1pm & 3 pm - 9 pm
చూడవలసినవి : పుష్కరణి, భ్రమరాంబ మల్లేశ్వర స్వామి, రేణుకా దేవి ఆలయం, జగన్నాథ స్వామి ఆలయం మరియు ఇతరములు.
ఎక్కడి నుండి ఎంత దూరం : ద్వారకా తిరుమల బస్ స్టాండ్ 1కి.మీ, ఏలూరు 45 కి.మీ, కాకినాడ 135 కి.మీ, రాజమండ్రి 73 కి.మీ, విజయవాడ 101 కి. మీ, వైజాగ్ 278 కి. మీ.
సౌకర్యాలు : పద్మావతి, ఆండాళ్ అతిధి గృహాలు, టిటిడి వసతి గృహం, సత్రాలు మొదలైనవి కలవు.
చిత్రకృప : Adityamadhav83
పాలకొల్లు
పాలకొల్లు పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో కలదు. చుట్టూ వరిచేలు, కొబ్బరిచెట్లు, చాపల చెరువులు కనిపిస్తాయి. శ్రీరాముడు సీతమ్మ వార్ల స్వహస్తాలతో ప్రతిష్టించబడిన క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఉన్నది. టైమింగ్స్ : 5:30 am - 11:30 am & 4:00 pm - 8 : 30 pm.
చూడవలసినవి : కేశవస్వామి ఆలయం, కనకదుర్గమ్మ దేవస్థానం, అయ్యప్ప స్వామి ఆలయం, షిరిడి స్వామి ఆలయం మొదలుగునవి.
ఎక్కడి నుండి ఎంత దూరం : పాలకొల్లు రైల్వే స్టేషన్ నుండి 1.7 కి.మీ, ఏలూరు 85 కి. మీ, కాకినాడ 97 కి.మీ, భీమవరం 22 కి. మీ, విజయవాడ 138 కి. మీ, వైజాగ్ 257 కి. మీ.
సౌకర్యాలు : ఏలూరు లేదా భీమవరం వసతి కై సూచించదగినది.
చిత్రకృప : Gopal vemu
ఒంటిమిట్ట
'ఆంధ్రా భద్రాద్రి' ఒంటిమిట్ట కడప జిల్లాలో కలదు. ఇక్కడున్న కోదండ రామాలయంలో విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడు. ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుడు ప్రతిరూపాలు చూడవచ్చు. సీత కోరికపై రాముడు రామబాణాన్ని సంధించి పాతాళగంగ ను పైకి తెప్పించాడని కధనం. టైమింగ్స్ : 4:30 am - 9 : 00 pm.
చూడవలసినవి : బ్రహ్మోత్సవాలు, రధోత్సవం
ఎక్కడి నుండి ఎంత దూరం : కడప 25 కి.మీ, తిరుపతి 117 కి.మీ, కాకినాడ 97 కి.మీ, హైదరాబాద్ 436 కి.మీ, విజయవాడ 363 కి. మీ, బెంగుళూరు 270 కి.మీ
సౌకర్యాలు : ఒంటిమిట్టలో వసతి సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. కనుక కడప సూచించదగినది.
చిత్రకృప : MADHURANTHAKAN JAGADEESAN
కనకదుర్గ ఆలయం
విజయవాడ లో కనకదుర్గ ఆలయం ఇంద్రకీలాద్రి పర్వతం పై కలదు. గర్భగుడిలో అమ్మవారి విగ్రహం నాలుగు అడుగుల ఎత్తు ఉండి, మిరమిట్లు గొలిపే ఆభరణాలతో, పూలతో అలంకరించబడి ఉంటుంది. టైమింగ్స్ : 4:00 am - 5 : 45 pm & 6 :15 pm - 10 pm.
చూడవలసినవి : దసరా నవరాత్రి ఉత్సవాలు, సమీపంలోని కృష్ణా నది, కృష్ణా బ్యారేజ్ మరియు కొండపై ఇతర దేవాలయాలు.
ఎక్కడి నుండి ఎంత దూరం : విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి 4 కి. మీ, హైదరాబాద్ నుండి 272 కి.మీ, బెంగళూరు నుండి 661 కి. మీ, వైజాగ్ నుండి 345 కి.మీ
సౌకర్యాలు : అన్ని తరగతుల వారికి గదులు లభిస్తాయి. కొండ పై దేవస్థానం వారి గదులు అందుబాటులో ఉన్నాయి. ఇవైతే తక్కువ ధరకే దొరుకుతాయి.
చిత్రకృప : Srikar Kashyap
సింహాచలం
సింహాచలం విశాఖపట్టణంలో ప్రసిద్ధి చెందిన హిందూ పుణ్య క్షేత్రం. ఇది తూర్పు కనుమలలో విస్తరించి ఉన్నది. ఇక్కడ శ్రీ వరాహ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం కలదు. ఏటా ఏపీలో తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం ఆర్జించే దేవాలయం ఇదే. సింహాద్రి అప్పన్న గా క్షేత్రం వర్ధిల్లుతున్నది. టైమింగ్స్ 7 :00 - 4 :00 & 6:00 - 9
చూడవలసినవి : గాలిగోపురం, కప్ప స్తంభం, జలధారలు, భైరవ వాక, పుష్కరిణి, మాధవధార మొదలుగునవి.
ఎక్కడి నుండి ఎంత దూరం : వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి 18 కి. మీ, అన్నవరం 128 కి. మీ, రాజమండ్రి 208 కి. మీ, విజయవాడ 359కి.మీ, హైదరాబాద్ 609 కి.మీ.
సౌకర్యాలు : క్షేత్రంలో వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
చిత్రకృప : Sureshiras