గుడిలో ఎవరుంటారు ? దేవుళ్ళు. వీరు కాకుండా ఇంకెవరు ఉంటారు ? ఊహించండి .. గుర్తుకు రావటం లేదా ?? సినిమా యాక్టర్లండి .. నిజం. వీరే కాదు రాజకీయ నాయకులు, క్రికెటర్లు కూడా ఉన్నారు. మీకు నమ్మశక్యంగా లేదా ? అయితే ఈ వ్యాసం చదవండి. కొంత మంది క్రికెటర్లకు, సినిమా యాక్టర్లకు, రాజకీయా నాయకులకు గుడులను కట్టించారు. ఇందులో వారి విగ్రహాలకు నిత్యం పూజలు చేస్తారు. నైవేద్యం కూడా పెడతారు. హారతి ఇస్తారు. ఎవరెవరికి ఉన్నాయి ? ఎక్కడెక్కడ ఉన్నాయి ? మన భారతదేశంలో అభిమానానికి ఒక హద్దు అదుపు లేకుండా పోయింది. అందుకు నిదర్శనం ఈ దేవాలయాలు. ఒకటా, రెండా పదుల సంఖ్యలో దేవాలయాలు కట్టించారు అభిమానులు. దక్షిణ భారతదేశంలో ఈ అభిమానం మరీ ఎక్కువ. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఆలయాలు కట్టించారో, అవెక్కడ ఉన్నాయో ఒకేసారి పరిశీలిద్దాం పదండి ..!
సోనియా గాంధీ
AICC అధ్యక్షురాలు సోనియా గాంధీ కి తెలంగాణ లో అభిమానులు ఎక్కువ. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ప్రకటించిందో అప్పుడే కరీంనగర్ లో అమ్మగారికి ఆలయం వెలసింది. ఆలయం గోడలపై ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ మరియు రాహుల్ గాంధీ చిత్రాలు చూడవచ్చు. మార్బుల్ తో నిర్మించిన ఈ ఆలయం కరీంనగర్ లో కలదు.
మహాత్మ గాంధీ
జాతిపిత మహాత్మ గాంధీ దేశానికి చేసిన సేవలకు గాను ఆలయాన్ని నిర్మించారు భారతీయులు. ఇక్కడ ఆయన విగ్రహానికి నిత్యం పూజలు జరుగుతాయి. ఒరిస్సా లోని సంబల్పూర్ పట్టణంలో భత్ర గ్రామంలో ఈ దేవాలయం కలదు.హైదరాబాద్ - విజయవాడ హై వే మీద కూడా గాంధీ ఆలయం కలదు.
రజినీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ దక్షిణ భారతదేశ ప్రసిద్ధ సినిమా నటుడు. ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ స్థాయి వరకు రజనీ ఎదిగాడు. అలా ఎదగటానికి ఎంతో కృషి చేసాడు. రజనీకి చెన్నై లో ఒక ఆలయం కలదు.
ఖుష్బూ
ప్రముఖ దక్షిణ నటి ఖుష్భూ కి సైతం అభిమానులు గుడి కట్టించి పూజలు చేస్తుంటారు. ఖుష్భూ పేరు మీద తిరుచిరాపల్లి లో ఒక ఆలయం కలదు. కానీ 2005 లో ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ఆలయం నేలమట్టం చేశారు.
అమితాబచ్చన్
బాలీవూడ్ లో పొడవాటి ఫిల్మ్ ఎవరంటే ఇట్టే గుర్తుకొచ్చేది అమితాబ్. బిగ్ బి గా పిలుచుకునే ఈయనకు కలకత్తాలో ఆలయం కలదు. ఆలయం లోపల ఈయన నటించిన అగ్నిపథ్ చిత్రంలో వాడిన చెప్పుల జతను కుర్చీ మీద ఉంచారు.
ఎం జి రామచంద్రన్
ఎం జి రామచంద్రన్ దక్షిణ భారతదేశ చలనచిత్ర నటుడు. ఈయన తమిళనాడు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. తమిళనాడు లోని నాథమేడు లో ఈయనకు ఆలయం కలదు.
నమిత కపూర్
గుజరాత్ రాష్ట్రంలో పుట్టిన నమిత తమిళనాట అత్యంత ప్రజాదరణ కలిగిన సినిమా నటి. అందుకే ఖుష్బూ తర్వాత ప్రేక్షకులు నమితకు బ్రహ్మరథం పట్టారు. తిరునల్వేలి లో నమిత పేరు మీద దేవాలయాన్ని కూడా కట్టించారు.
మాయావతి
బీఎస్పి అధినేత్రి మాయావతి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు లక్నో కు 300 KM ల దూరంలో ఉన్న నాత్పురా గ్రామంలో మాయావతి ఆలయాన్ని కట్టించాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆపేసారు.
సచిన్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను సైతం అభినానులు వదలలేదు. ఆయనకు కూడా గుడిని కట్టించారు. బీహార్ లోని కైమూర్ జిల్లాలో గల ఆతర్వాలియా లోని తివారి గ్రామములో 5. 5 అడుగుల సచిన్ విగ్రహం కలదు.