తలకాడు పట్టణం క్రీ.శ. 16 వ శతాబ్దానికి ముందు ఎంతో ఆకర్షణీయ ప్రదేశంగా ఉండేది. సుమారుగా 30 పైచిలుకు ఆలయాలు ఉండేవి. అందులో ఐదు ప్రఖ్యాత శివాలయాలు ప్రత్యేకమైనవి. మైసూర్ ఒడయార్ల పాలనలో ఈ ప్రదేశం నాశనం చెందిందని చరిత్రకారుల అభిప్రాయం.
తలకాడు ప్రారంభంలో గంగ వంశస్థులు, ఆ తర్వాత చోళులు పరిపాలించారు. చోళులను ఓడించి హోయసుల రాజు విష్ణు వర్ధనుడు రాజ్యాధికారం చేపట్టి పరిపాలన ను గాడిలో పెట్టెను. ఆతర్వాత వచ్చిన విజయనగర రాజులు కూడా చక్కటి పాలనను అందించారు. చివరగా మైసూర్ ఒడయార్ల పాలనలో ఈ ప్రాంతం చివరి దశ కు చేరుకొంది.
చిన్న కథ
ఈ ప్రాంత దేవత అయిన ఆలమేరు అమ్మవారి నగలపై కన్నేసిన మైసూర్ రాజు తలకాడు పై తన సైన్యంతో దాడి చేస్తాడు. అమ్మవారు తన నగను కావేరి నదిలో పడవేసి మునిగిందని, పోతా పోతా తలకాడును ఇసుక దిబ్బలా మారిపోవాలని, మైసూర్ రాజులకు వారసుడు లేకుండా పోతాడని శపించిందని స్థానిక కధనం.
తలకాడు ఆలయం వద్ద సందర్శకులు
చిత్ర కృప : Sankara Subramanian
కర్ణాటకలోని మైసూర్ జిల్లా లో కావేరి నది ఒడ్డున తలకాడు ప్రదేశం కలదు. వీకెండ్ ట్రిప్ లకై బెంగళూరు నుండి వచ్చేవారికి ఈ ప్రదేశం తప్పక నచ్చుతుంది. బెంగళూరు నుండి 140 కి. మీ ల దూరంలో, మైసూర్ నుండి 50 కి. మీ ల దూరంలో తలకాడు ఉంది. మీరు తలకాడు లో ప్రవేశించగానే అక్కడ ప్రవహించే కావేరి నది, చుట్టూ ఉన్న మట్టిని గమనిస్తే నదీ తీరమా ? లేక బీచా ? అని అనిపిస్తుంది.
తలకాడు ఐదు ప్రఖ్యాత శివాలయాలకు ప్రసిద్ధి చెందినది. అవి వైద్యనాధేశ్వర, పాతాళేశ్వర, మరుళేశ్వర, అరకేశ్వర మరియు మల్లిఖార్జుల దేవాలయాలు. బాధాకరమైన విషయం ఏమిటంటే, ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా ఇవి ఇసుకలోకి కూరుకుపోతున్నాయి. ఈ ప్రాంతంలోనే చెప్పుకోదగ్గ మరో ఆలయం - విష్ణు భగవానుడి ఆలయం. దీనిని స్థానికులు 'కీర్తినాధేశ్వర' ఆలయం పేరుతో పిలుస్తారు.
ఇది కూడా చదవండి : తలకాడు పంచలింగేశ్వర దర్శనం !
శివాలయం, తలకాడు
చిత్ర కృప : Rahul Mohandas
కావేరి నదిలో తెప్పల విహారం (కొరకిల్ రైడ్) పర్యాటకులకు వినోదాన్ని కలిగిస్తుంది. తలకాడు వెళితే చుట్టుపక్కల గల శివనసముద్ర జలపాతాలు, సోమనాథపుర పట్టణం తప్పక సందర్శించాలి. పట్టణం గుండా ప్రవహించే కావేరి నది మలుపులు రమణీయంగా ఉంటాయి.
తలకాడు లోని కొన్ని ప్రదేశాల్లో పర్యాటకులను నీటి ఆటలు ఆడటానికి అనుమతిస్తారు మరికొన్ని ప్రదేశాల్లో అనుమతించరు. నీటి క్రీడలు ఆడేటప్పుడు నదిలోనికి వెళ్ళకండి. కాస్త ఒడ్డుకే ఉండండి.
కొరకిల్ రైడ్, తలకాడు
చిత్ర కృప : abhishek sahoo
పర్యాటకులు తలకాడు లో విశ్రాంతి తీసుకోవటానికి తలకాడు జలధామ రిసార్ట్ సూచించదగినది. రిసార్ట్ అనేక వినోద కార్యక్రమాలను మరియు చక్కటి వసతి తో పాటు రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నది.
ఏదేమైనా చరిత్ర పరిశోదించాలనుకోనేవారికి తలకాడు మిస్టరీ పట్టణం గా ఉన్నది. పుష్కరానికి ఒకసారి వచ్చే పంచలింగ దర్శనం ఇక్కడ ప్రసిద్ధి చెందినది. చివరిసారిగా పంచలింగ దర్శనం 2009 లో జరిగింది మరళా పునః దర్శనం 2021లోనే ! ఈ పంచలింగ దర్శనం కార్తీక పౌర్ణమి రోజున రెండు నక్షత్రాలు ఖుహ యోగ మరియు విశాఖ కలసినపుడు ఏర్పడుతుంది.
తలకాడు జలధామ రిసార్ట్
చిత్ర కృప : Harsha K R
తలకాడు ఎలా చేరుకోవాలి ?
తలకాడు కు సమీపాన 140 కి. మీ ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. బెంగళూరు నుండి మైసూర్ చేరుకొని అక్కడి నుండి ప్రభుత్వ / ప్రవేట్ వాహనాల్లో తలకాడు చేరుకోవచ్చు. తలకాడు కు సమీపాన 50 కి. మీ ల దూరంలో మైసూర్ రైల్వే స్టేషన్ కలదు. క్యాబ్ లేదా టాక్సీ వంటివి మైసూర్ లో అదీకు దొరుకుతాయి.
మట్టిలో కూరుకుపోయిన ఆలయం
చిత్ర కృప : Paulo Pereira