తమిళనాడు రాష్ట్రంలో శ్రీ సుబ్రమణ్యస్వామి కి చెందిన ఆరు మురుగన్ దివ్య క్షేత్రాలలో తిరుప్పురన్ కున్రమ్ దేవాలయం ఒకటి. శ్రీ సుబ్రమణ్యస్వామి అసురుడు సురపద్ముడి సంహారానికి ఆరు ప్రదేశాలలో వెలిసాడు. ఆ ఆరు ప్రదేశాలను తమిళంలో 'ఆరుపడైవీడు' అంటారు. ఈ ఆరు క్షేత్రాలలో ప్రముఖమైనది, ప్రముఖమైనది తిరుప్పురన్ కున్రమ్ క్షేత్రం.
భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆలయ శిఖరాలు ఏవో మీకు తెలుసా ?
ఎక్కడ ఉంది ?
తిరుప్పురన్ కున్రమ్ క్షేత్రంలో దక్షిణ తమిళనాడు రాష్ట్రంలో మధురై జిల్లాలో కలదు. మధురై నగరం నుండి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం కలదు. మిగిలిన అరపడైవీడు క్షేత్రాలు - తిరుచెందూర్ (మధురై నుండి 100 కి.మీ ల దూరంలో), పళని (మధురై నుండి 120 కి.మీ ల దూరంలో), స్వామిమలై (మదురై నుండి 150 కి.మీ ల దూరంలో), తిరుత్తణి (చెన్నై నుండి 50 కి. మీ ల దూరంలో), పజ్హముదిర్ చోళై (మదురై కు 25 కి.మీ ల దూరంలో).
చిత్రకృప : Kramasundar
ఆలయ విశేషాలు
తిరుప్పరన్ కున్రమ్ దేవాలయంలోని ప్రధాన దైవం మురుగన్ లేదా సుబ్రమణ్యస్వామి. తమిళనాడు రాష్ట్రంలో సుబ్రమణ్యస్వామిని 'మురుగన్' గా పిలుస్తారు. పురాణ కధనం మేరకు సుబ్రమణ్యస్వామి మరియు దేవసేన ల వివాహం ఈ క్షేత్రంలో జరిగింది. దేవసేన స్వర్గలోకపు అధిపతి ఇంద్రుడు కుమార్తె. శివుడు 'పరంజిర్ నాథర్' గా భక్తుల చేత ఈ క్షేత్రంలో పూజలు అందుకుంటున్నాడు.
చిత్రకృప : Ssriram mt
ఆలయ నిర్మాణం
కొండ దిగువన శిలలను తొలిచి నిర్మించిన తిరుప్పరన్ కుండ్రం ఆలయం అద్భుత శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. పాండ్యుల కాలంలో ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాలు తెలుపుతున్నాయి. అయితే అంతకు పూర్వమే ఆలయం ఉన్నట్టు ఆధారాలున్నాయి. నాయక రాజుల కాలంలో నిలువెత్తు విగ్రహాలను చెక్కారు. కొండను తొలచి ఆలయాన్ని నిర్మించడంతో పాటు పలు దేవతల విగ్రహాలను అద్భుతంగా చెక్కడం ద్రవిడ శిల్పకళకు అద్దం పడుతుంది.
చిత్రకృప : Ssriram mt
ఆరుపడైవీడులో మొదటిది
ఆరుపడైవీడులో ఈ ఆలయం మొదటిది కావడం విశేషం. అన్ని ఆలయాల్లో మురుగన్ నిలుచుకొని అభయమిస్తుండగా ఈ ఆలయంలో ఆసీనుడై భక్తులను ఆశీర్వదిస్తుండటం విశేషం. దేవలోక అధిపతి ఇంద్రుడు తన కుమార్తె దేవయానిని కార్తికేయుడికి ఇచ్చి వివాహనం జరిపిన ప్రదేశంగా తిరుప్పరన్ కుండ్రం ఖ్యాతిచెందింది. దేవయాని సమేతుడైన స్వామి చుట్టూ త్రిలోక సంచారి నారద మునీంద్రుడు, ఇంద్రుడు, బ్రహ్మ, సరస్వతి మాత, సూర్యచంద్రులు, గంధర్వులు వున్న చిత్రం కనిపిస్తుంది.
చిత్రకృప : Ssriram mt
అభిషేకం వేలాయుధానికే...
సాధారణంగా ఆలయాల్లో అభిషేకం మూలవిరాట్టుకు చేస్తారు. అయితే ఇందుకు భిన్నంగా స్వామి వారి ఆయుధమైన వేలాయుధానికి ఇక్కడ అభిషేకం చేయడం గమనార్హం. సూరపద్ముడిని సంహరించిన అనంతరం స్వామి తన వేలాయుధంతో ఇక్కడకి వచ్చినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. తమిళమాసమైన పెరటాసి నెలలో వేలాయుధాన్ని పక్కన కొండ పై వున్న కాశీవిశ్వనాధుని ఆలయానికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
చిత్రకృప : Ssriram mt
ప్రధాన మందిరం
ప్రధాన మందిరంలో శ్రీ సుబ్రమణ్యస్వామి భక్తులకు దర్శనమిస్తుంటారు. సమీపంలోనే ఆది దంపతులైన పార్వతి, పరమేశ్వరుల మందిరం, కర్పగ వినాయక మందిరం, విష్ణుమూర్తి ఆలయాలున్నాయి. ప్రాంగణంలోనే కంబతడి మండపం, అర్ధమండప, మహామండపాలను చూడవచ్చు. వీటి పై ఉన్న శిల్పకళ చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది.
చిత్రకృప : Ssriram mt
నక్కిరార్ ఆలయం
ప్రముఖ తమిళకవి నక్కిరార్కు ఒక ఆలయముంది. ఆలయ సమీపంలో తపస్సు చేసుకుంటున్న నక్కీరార్కు ఒక రోజు ఆలయ పుష్కరిణలో సగం చేప, సగం పక్షి రూపంలో వున్న ఒక జీవం కనిపించింది. దీన్ని ఆయన తదేకంగా చూడటంతో తపస్సు భంగమైంది. ఆ విచిత్ర రూపం రాక్షసరూపం దాల్చి అతన్ని బందీగా పట్టుకుంది.
చిత్రకృప : Ssriram mt
దీంతో ఆయన తనను రక్షించమంటూ మురుగన్ను తిరుమురుగట్టురుపడైని గానం చేశాడు. దీంతో స్వామి ప్రత్యక్షమై నక్కిరార్ను అతనితో పాటు వున్న అనేకమందిని రక్షించాడు. స్వామి తన వేలాయధంతో ఒక రాతిపై కొట్టడంతో గంగ జలం బయటకు వచ్చింది. ఈ జలంలో మునిగితే పాపాలు పోతాయి. ఎంత వేసవిలోనూ ఈ తీర్థం ఎండిపోకపోవడం విశేషం.
చిత్రకృప : Ssriram mt
తిరుప్పురన్ కున్రమ్ ఆలయానికి ఇలా చేరుకోండి !
తిరుప్పురన్ కున్రమ్ ఆలయానికి సమీపంలో మదురై (8 కి.మీ) పట్టణం కలదు. కనుక మదురై చేరుకుంటే అక్కడి నుండి ప్రభుత్వ బస్సులలో లేదా ప్రవేట్ వాహనాలలో తిరుప్పురన్ మురుగన్ ఆలయానికి చేరుకోవచ్చు. మదురై చేరుకోవడం ఎలా ?