రాణాక్పూర్, రాజస్థాన్ రాష్ట్రం పాళీ జిల్లాలోని సాద్రీ పట్టణం సమీపంలో ఉన్న ఒక చిన్న పట్టణం. ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ పట్టణం, ఉదైపూర్(ఉదయపూర్) మరియు జోధ్పూర్ నగరాల మధ్యన కలదు. 'రాణాక్పూర్ జైన దేవాలయం' దేశంలోనే అతి పెద్దది మరియు ప్రపంచ అద్భుత కట్టడాల్లో ఒకటి. జైన మత ప్రాధాన్యత కలిగిన ఈ దేవాలయాన్ని క్రీ.శ. 15 వ శతాబ్ధంలో నిర్మించారు.
అనగనగా ఓ భక్తుడు. ఒకనాడు రాత్రి నిద్రిస్తుండగా కలలో ఒక రథం కనిపించింది. ఉదయాన్నే లేచి వెంటనే రాజు వద్దకు వెళ్ళి రాత్రి జరిగిన సంగతంతా చెప్పాడు. అది విన్న రాజు అచ్చం అలాంటి దేవాలయాన్నే నిర్మించాలని అనుకుంటాడు. అదే రాజస్థాన్ లోని 'రాణాక్పూర్ దేవాలయం'.
రాణాక్పూర్ కు 9 కి. మీ. ల సమీపంలో కుంభాల్ ఘర్ అనే మరో సైట్ సీయింగ్ ప్రదేశం ఉన్నది. 'కుంభాల్' చారిత్రక ప్రదేశం మరియు ఇక్కడ రాజులు నివసించిన అనేక మహల్స్, కోటలు, రాజభవంతులు ఉన్నాయి. సమయం ఉంటే, జంతు ప్రేమికులు సమీపంలోని వన్య జంతు అభయారణ్యాన్ని సందర్శించవచ్చు.
జైన దేవాలయం
రాణాక్పూర్ లోని జైన దేవాలయం, 48000 చదరపు అడుగుల విస్తీరంలో మొత్తం పాలారాయితో కట్టించారు. సుమారు 108 అడుగుల ఎత్తులో మూడంతస్తులుగా ఉండే ఈ ఆలయం లోపల 1444 పాలరాతి స్తంభాలు ... 80 శిఖరాలు ... అద్భుత శిల్పాలు ఉన్నాయి.
చిత్ర కృప : Daniel Mennerich
జైన దేవాలయం
ఆలయం లోపల ధ్యాన మందిరం లో ఉండే స్తంభాలు సూర్యుని కాంతి పడి పసుపు, నీలి రంగుల్లో మారటం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. 108 నాగులు పెనవేసుకున్నట్లు చెక్కిన ఏకశిలా పాలరాతి విగ్రహం గుడిలో మరో ఆకర్షణ.
చిత్ర కృప : Shakti
జైన దేవాలయం
నాలుగు వైపులా ద్వారాలు ఉండే ఈ ఆలయం మధ్యలో జైన తీర్ధాంకరుడు ఆదినాథుని మందిరం ఉంది. దాని చుట్టూ 29 మందిరాలు, 80 శిఖరాలు, 84 దేవతామూర్తుల ప్రతిమలు ఉన్నాయి.
చిత్ర కృప : Daniel Mennerich
జైన దేవాలయం
గుడి గంటలు ఇక్కడ మరో ఆకర్షణగా చెప్పుకోవచ్చు. సుమారు 108 కిలోల బరువుండే ఆలయ గంటలు మోగిస్తే చుట్టుప్రక్కల అంతా ప్రతిధ్వనిస్తుంది.
చిత్ర కృప : Daniel Mennerich
జైన దేవాలయం ఎవరు నిర్మించారు ?
ధన్నా షా అనే భక్తుడికి కల గురించి విన్న మేవార్ రాజు రణకుంభుడు ఆలయాన్ని నిర్మించాడు. దీపకుడు ఈ ఆలయ నిర్మాణ శిల్పి. దగ్గరుండి ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ కట్టడాన్ని పూర్తి చేయటానికి 65 ఏళ్లు పట్టింది.
చిత్ర కృప : Stf&Claire
దేసూరి
దేసూరి, రాణాక్పూర్ కు 25 కి. మీ. దూరంలో ఉంటుంది. ఈ గ్రామంలో శివుడు, నవి మాత, హనుమాన్ దేవాలయాలు, సమీపంలోని కోడల్లో పరుశురామ మహాదేవ ఆలయం చూడదగ్గవి.
చిత్ర కృప : Tomas Belcik
ఘనేరావ్
ఘనేరావ్ కూడా రాణాక్పూర్ సమీపంలోని ఒక గ్రామం. ఇక్కడ మచ్చల మహావీర్ దేవాలయం, గజానాంద దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినాయి.
చిత్ర కృప : Sreenivasan Ramakrishnan
సాద్రీ
సాద్రీ, రాణాక్పూర్ సమీపంలోని ఒక ప్రముఖ తీర్థయాత్ర కేంద్రం. గతంలో దీన్ని 'గేట్ ఆఫ్ మేవార్ టు మార్వార్' అని పిలిచేవారట. వరాహావతార దేవాలయం, చింతామణి పార్శ్వనాథ దేవాలయం, ఖుదా బక్ష్ బాబా దర్గా ఈ ప్రాంతపు ఆకర్షణలు.
చిత్ర కృప : Walter Braun
నార్లై
నార్లై, రాణాక్పూర్ కు 6 కి. మీ. దూరంలో మరో చిన్న గ్రామం. ఈ ప్రాంతంలో పర్యాటకులు అనేక జైన దేవాలయాలను, హిందూ దేవాలయాలను గమనించవచ్చు. వీలుండే ఆదినాథుని దేవాలయాన్ని, దాని అందాలను వీక్షించండి.
చిత్ర కృప : Tomas Belcik
సూర్య నారాయణ దేవాలయం
సూర్యదేవాలయం గతించిన శకపు కళాకారుల అద్భుత సామర్థ్యాన్ని తెలుపుతుంది. ఆలయ గోడపై చెక్కిన యోధులు, అశ్వాలు, గజాలు, ఖగోళ దేవతల చిత్రాలను చూస్తే ఇది అర్థమవుతుంది. సూర్య భగవానుడు రధాన్ని నడుపుతూ భక్తులకు దర్శనమిస్తాడు. సమయం దొరికితే సమీపంలోని అంబా మాత ఆలయాన్ని కూడా దర్శించండి.
చిత్ర కృప : Honza Soukup
కుంభాల్ ఘర్ కోట
కుంభాల్ ఘర్ కోట, రాణాక్పూర్ కు 9 కి. మీ. దూరంలో కలదు. బాణా నది ఒడ్డున క్రీ.శ. 15 వ శతాబ్ధంలో రాజు రాణా కుంభా చే ఈ కోట నిర్మాణం మొదలైంది. కోట 7 భారీ ద్వారాలను, వాచ్ టవర్ల ను, 13 శిఖరాలను చూడవచ్చు. కోట లోనే మరో కోట 'కర్తార్ ఘర్' ను దర్శించవచ్చు.
చిత్ర కృప : Antoine Taveneaux
బాదల్ మహల్
కుంభాల్ ఘర్ లో ఉన్న అందమైన ప్యాలెస్ లలో బాదల్ మహల్ ఒకటి. అక్కడి భాషలో బాదల్ అంటే మేఘాలు. దాంతో దీనిని మేఘాల మహల్ అని కూడా పిలుస్తారు. దీనిలో మర్ధనా మహల్ మరియు జనానా మహల్ అనేవి ఉన్నాయి. మహల్ లోని గదులన్నీ కూడా ఏసీ ని తలపిస్తాయి.
చిత్ర కృప : Sujay25
కుంభాల్ ఘర్ వన్య ప్రాణుల అభయారణ్యం
ఈ అభయారణ్యం ఉదైపూర్ కు 65 కి. మీ. దూరంలో కుంభాల్ ఘర్ కోట సమీపంలో కలదు. సుమారు 578 చ. కి. మీ. లు విస్తరించిన ఈ అభయారణ్యం లో నాలుగు కొమ్ముల జింక, చిరుతపులులు, అడవి తోడేళ్ళు, ఎలుగు బంట్లు, నక్కలు, సాంబార్ లు, చింకారాలు, హైనాలు, అడవి పిల్లులు మరియు కుందేళ్ళు వంటివి చూడవచ్చు.
మచ్చల్ మహావీర్ దేవాలయం
ఈ దేవాలయాన్ని జైన దేవాలయం అనుకుంటే పొరబడినట్లే ..! ఇదొక శివుని దేవాలయం. కుంభాల్ ఘర్ అభయారణ్యంలో ఉన్న ఈ దేవాలయంలో శివునికి మీసాలు కల్గిన విగ్రహం ఉంటుంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద రెండు ఏనుగులు పహారా కాస్తున్నట్లు నిలబడి ఉంటాయి.
చిత్ర కృప : Antoine Taveneaux
గరేశియా గిరిజన గ్రామాలు
గరేశియా గిరిజన గ్రామాలు కుంభాల్ ఘర్ ప్రాంతానికి ఆకర్షణలు గా చెప్పుకోవచ్చు. ఇక్కడ పర్యాటకులు అందమైన దుస్తులను, చేతులతో అల్లిన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. అంటే షాపింగ్ చేయాలనుకునే వారికి ఈ ప్రదేశం అనుకూలంగా ఉంటుంది.
చిత్ర కృప : dobs
నీలకంఠ మహాదేవ్ ఆలయం
ఈ ఆలయం కుంభాల్ ఘర్ కోట సమీపంలో కొండ పై ఉన్నది. ఈ గుడిలో ఆరు అడుగుల శివలింగం ఉంటుంది. మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆలయాన్ని దర్శించుకుంటారు.
చిత్ర కృప : Shakti
మమ్మా దేవ్ ఆలయం
ఈ ఆలయం కుంభార్ ఘర్ కోట దిగువ భాగంలో కలదు. దీన్ని కుంభ రాజు క్రీ.శ. 1460 లో నిర్మించినట్లు అక్కడి శిలా శాశనాల ద్వారా తెలుస్తుంది. ఆలయంలో కుబేరుడి కూడ్య చిత్రాలు చూడవచ్చు.
చిత్ర కృప : Sujay25
పరుశురామ్ దేవాలయం
ఈ దేవాలయం ఒక గుహలో ఉన్నది. అంధులో పరుశురామ ఋషి విగ్రహం ఉన్నది. ఈ గుడి కి చేరుకోవాలంటే 500 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. పురాణాల ప్రకారం, పరుశురాముడు ఇక్కడ ధ్యానం చేసాడని, శ్రీరాముని ఆశీర్వాదం పొందాడని చెబుతారు.
చిత్ర కృప : Antoine Taveneaux
వేది దేవాలయం
ఇదొక జైన దేవాలయం. దీన్ని రాణా కుంభ రాజు నిర్మించాడు. కుంభాల్ ఘర్ కోట లోని హనుమాన్ పోల్ సమీపంలో ఈ ఆలయం కలదు. ఆలయం లో జైన తీర్థాంకరుల విగ్రహాలు ఉంటాయి.
చిత్ర కృప : Sujay25
రాణాక్పూర్ ఎలా చేరుకోవాలి ?
వాయు మార్గం
ఉదైపూర్ లోని మహారాణా ప్రతాప్ విమానాశ్రయం (106 కి. మీ) రాణాక్పూర్ కు, కుంభాల్ ఘర్ కు (112 కి. మీ) సమీపాన ఉన్నది. ఈ విమానాశ్రయం నుండి ఢిల్లీ, జైపూర్, జోధ్పూర్ కు తరచూ విమాన సర్వీసులు నడుస్తుంటాయి.
రైలు మార్గం
రాణాక్పూర్ కు, కుంభాల్ ఘర్ కు సమీపాన ఫల్న రైల్వే స్టేషన్ (35 కి. మీ) కలదు. ఢిల్లీ, ముంబై, అజ్మీర్, జైపూర్, అహ్మదాబాద్, జైపూర్ నగరాల నుండి తరచూ రైలు సర్వీసులు ఈ స్టేషన్ కు నడుస్తుంటాయి.
రోడ్డు / బస్సు మార్గం
ఉదైపూర్, అజ్మీర్, జోధ్పూర్, పుష్కర్, జైపూర్ ల నుండి తరచూ ప్రవేట్ / ప్రభుత్వ బస్సులు రాణాక్పూర్ కు, అలాగే కంభాల్ ఘర్ కు నడుస్తుంటాయి.
చిత్ర కృప : Sujay25