ఇందూరు.. ఈ పేరు చెపితే ఎవరికీ తెలియదేమో. నిజాములు ఈ ప్రాంతాన్ని పాలించడానికి పూర్వం నిజామాబాద్ని ఇందూరు అని పిలిచేవారు. నిమాజాబాద్ అంటే 'నిజాం ఎక్కువ కాలం జీవించాలనే ఆకాంక్ష' అర్థం. తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లాలో ఈ పట్టణం ఒక మునిసిపల్ కార్పొరేషన్ గా కలదు. నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యాలయాలు నిజామాబాద్ లోనే కలవు. దేశంలోనే మొదట ప్రారంభించిన నిజాం పంచదార ఫ్యాక్టరీ ఇక్కడే ఉంది. రాష్ట్రంలోనే అత్యధిక ఇంటర్ మార్కులు తెచ్చుకునే విద్యార్థులు ఈ జిల్లా వారే. ఇన్ని విశేషాలున్న ఈ జిల్లాలో చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటి వివరాలు...
నిజామాబాద్ లో హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఫ్రీ కూపన్ సేల్ : ట్రావెల్గురు వద్ద హోటల్ డీల్ చేసుకోండి సూపర్ సేవర్ మీద 40% ఆఫర్ పొందండి
డిచ్పల్లి దేవాలయం
డిచ్పల్లి దేవాలయం నిజామాబాద్ పట్టణానికి 20 కి.మీ దూరంలో హైదరాబాద్ -నిజామాబాద్ జాతీయ రహదారిలో ఉంది. కొండమీద ఉన్న ఈ అందమైన శ్రీరామాలయం నలుపు తెలుపు అగ్గిరాయితో నిర్మించబడి ఉంది. కొండ ముందు భాగంలోని ఆర్చి సందర్శకులకు ఆహ్వానం పలుకుతుంది. దేవాలయ గోడలు, పైకప్పు, తలుపు చట్రాల మీది విశిష్టమైన నగిషీలు పర్యాటకులను ఆశ్చర్యపరుస్తాయి. దేవాలయ దక్షిణ భాగాన పెద్ద ట్యాంక్ ఉంది. దారి మధ్యలో స్తంభాల మండపం ఉంది. అనిర్వచనీయమైన ఈ సుందర ప్రదేశాలు చూసి ఆశ్చర్యానుభూతులకు లోనవని వారుండరంటే అతిశయోక్తి కాదు.
Photo Courtesy: Sumanth Garakarajula
బాసర దేవాలయం
ఆదిలాబాద్ జిల్లాలో నిజామాబాద్ పట్టణానికి 45 కి.మీ. దూరంలో గోదావరి నదీ తీరాన ఉన్న బాసరలో జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది. సరస్వతీదేవికి దక్షిణాదిన ఉన్న ఏకైక దేవాలయం ఇది. స్వయంభూ త్రిశక్తి స్వరూపులైన సరస్వతి, లక్ష్మి, కాళికల విగ్రహాలను వ్యాసమహముని ప్రాథమికంగా ఇక్కడే ప్రతిష్టించాడని చెపుతుంటారు. భక్తులు తమ పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తుంటారు. విద్యాభ్యాసం ప్రారంభంలో ఇది అత్యంత శుభప్రదమని భావిస్తారు.
Photo Courtesy: RameshSharma
శ్రీ రఘునాథాలయం కోట
ప్రాథమికంగా ఇండోర్ లేదా ఇంద్రపురిగా పిలువబడే ఈ పట్టణ కోట రక్షత్ర కూటులచే నిర్మించబడినది. ఇది 40 అడుగుల ఏకశిల విజయ స్తంభం. ఈ కోటను క్రీస్తుశకం 1131లో అల్లాఉద్దీన్ ఖిల్జీ ఆక్రమించుకున్నాడు. తదనంతరం బ్రహ్మనీలు, కుతుబ్షాహీలు, అసఫ్జాహీల వశమైంది. కోట అవశేషాలలో మెసనరి గోడలతో పరివేష్టించబడి ఉంది. దానితోపాటు మూలల్లో పెద్దకోట ఋరుజులు ఉన్నాయి. ఈ కోట అసఫ్ జాహిల పాలనకు, యుద్ధతంత్రానికి ప్రాముఖ్యతనిచ్చేదిగా కొనసాగింది. కోటలోని విశాలమైన వరండాల వాస్తుశిల్పంలో అసఫ్జాహి శైలిని ఇప్పటికీ చూడొచ్చు. ఇది వేసవి విడిదిగా ఉంది. బడారం మందిర్ ఈ కోట వైభవాన్ని వృద్ధి చేస్తోంది. దీన్ని ఛత్రపతి శివాజీ గురువు సమర్థరామదాసు నిర్మంచారు. కోట నిజామాబాద్ పట్టణం, దాని పరిసర ప్రాంతాల సౌందర్యాన్ని చాటి చెపుతోంది.
Photo Courtesy: Telangana Tourism
అలీసాగర్
నిజామాబాద్కు సుమారు 15 కి.మీటర్లు, నిజామాబాద్-బాసర రోడ్కు 2 కి.మీ. దూరంలో ఉంది. మానవ నిర్మిత రిజర్వాయర్ను 1930 దశకంలో నిర్మించారు. నగర రణగొణ ధ్వనులకు దూరంగా, ప్రశాంతతను ఇస్తుంది. సమ్మర్ హౌస్ పక్కగా పెంచిన గార్డెన్స్ ఐలాండ్, కొండపై ఉన్న అతిధి గృహం, చుట్టూ విస్తరించిన అడవి సింహద్వార ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. సమీపంలో తేళ్లపార్కు ఉంది. ట్రెకింగ్, వాటర్స్పోర్ట్స్ లాంటి ఆటలకు అవసరమైన సదుపాయాలు కూడా పర్యాటకులకు ఆనందం కల్గిస్తాయి.
Photo Courtesy: Ananth Naag Kaveri
అశోక్సాగర్
అందమైన బండ రాతి గుట్టలు, గార్డెన్ మధ్యలో సుందరమైన అశోక్సాగర్ సరస్సు నెలకొని ఉంది. ఇది హైదరాబాద్-బాసర రోడ్లో నిజామాబాద్ నుండి సుమారు 10 కి.మీ దూరంలో ఉంది. గార్డెన్స్ మధ్యలో చక్కగా అమర్చిన విద్యుద్దీపాలతో మెరిసే బండరాళ్లు నడుమ సేదతీరడం ఎప్పటికీ మర్చిపోలేరు. మనసుకు హాయిగొలిపే బోట్ ప్రయాణం ఆహ్లాదానిస్తుంది.
Photo Courtesy: nizamabad
కంఠేశ్వర దేవాలయం
శాతవాహనరాజు శాతకర్ణి-2చే జైన్లకోసం నిర్మించబడిన కంఠేశ్వర దేవాలయం ఉత్తర భారతీయ వాస్తు కళకు అద్దంపడుతుంది. ఏటా రథసప్తమి పండుగను ఈ దేవాలయంలో పెద్ద ఎత్తున జరుపుతారు. ప్రతిరోజూ, ప్రత్యేకించి సోమవారాల్లో, భక్తులు అధిక సంఖ్య లో వచ్చి శివ భగవానుడి ఆశీస్సులు పొందుతారు. ఇక్కడ శివుడిని నీల కాంతుడు లేదా నీలిరంగు మెడ కలవాడు అంటారు. శివుడు విషం మిన్గాడని, ఆ కారణంగా, ఆయన మెడ నీలం అయిందని చెపుతారు.
Photo Courtesy: Telangana Tourism
మల్లారం అడవి
మల్లారం అడవి నిజామాబాద్కు 7 కి.మీ దూరంలో ఉంది. పర్యావరణ పరిరక్షణను కోరే పర్యాటకుల కోసమే ఈ ప్రదేశం ఉందా అనిపిస్తుంది. అడవిలో ట్రెక్కింగ్, పగోడ టవర్ ప్రధాన ఆకర్షణలు. ఇక్కడ 1.45 బిలియన్ సంవత్సరాల పురాతన బండరాళ్లు కనువిందు చేస్తాయి. సాహస ప్రయాణానికి, ఆహ్లాదపరిచే పిక్నిక్లకు అనువైన ప్రదేశం ఇది.
Photo Courtesy: Telangana tourism
మ్యూజియం
ఎన్నో పురాతన వస్తువులు, కళాఖండాలలో ఆర్కియాలజికల్ మ్యూజియం కొలువై ఉంది. ఇందులో పాతరాతి యుగం నుంచి క్రీస్తుశకం 16వ శతాబ్దం, విజయనగర కాలంనాటి వరకు వరకు మానవ నాగరికత వికాసాన్ని తెలియజేసే పురావస్తు శిల్పకళ, ఇత్తడి, అలంకరణ వస్తువులు ఉన్నాయి. ఇంకా బద్రి వస్తువులు, విస్తృత శ్రేణిలో ఆయుధాలు, యుద్ధసామగ్రి కూడా చూడొచ్చు.
Photo Courtesy: nizamabad
దోమకొండ కోట
దోమకొండ కోట ప్రధాన రహదారికి 4 కి.మీ దూరంలో, కామారెడ్డి నుంచి 10 కి.మీ దూరంలో ఉంది. ఇది కుతుబ్సాహీలు, అసఫజాహీల సంస్థానంలో ఉండేది. దోమకొండ రెడ్డి ప్రభువులకు చెందిన ఈ కోట 18వ శతాబ్దం నాటిది. కోట ప్రవేశద్వారం అక్కెడ్, అసఫ్జాహి సింహద్వార ప్రభావాన్ని ప్రతిబింబిస్తోంది. కోట ఋరుజులు చతురస్రాకారంలో, గుండ్రంగా, క్రమరహితంగా నిర్మించబడ్డాయి. ఇది నిజామాబాద్ నుంచి 80 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ రెండు ప్యాలెస్లు, పలు దేవాలయ సముదాయం ఉంది. శివునికి సమర్పించిన ఈ దేవాలయం కాకతీయ రాజుల వాస్తుకళకు అద్దం పడుతుంది. చిరంజీవి తెలుసు కదా!!. ఆ.. ఆయనగారి కొడుకు రామ్చరణ్ పెళ్లి ఇక్కడే జరిగింది. ప్రముఖ వైద్య నిపుణుడు, అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప రెడ్డి మానవరాలు ఈయన పుత్ర రత్నానికే ఇచ్చి పెళ్లి చేశారు.
Photo Courtesy: Telangana Tourism
ఆర్మూర్ రాక్ ఫార్మేషన్స్
ఆర్మూర్ జాతీయ రహదారిలో ఉన్న రాక్ ఫార్మేషన్స్ సహజ సిద్ధంగా ఏర్పడింది. వేల సంవత్సరాలకు పైగా వాతావరణ స్థితిగతులలో మార్పులకు లోనై ఇలా ఏర్పడ్డాయి. ఇక్కడి ప్రకృతి గొప్పదనం సందర్శకులను ఆకట్టుకుటుంది. నవనాథ సిద్ధేశ్వర దేవాలయం కొండపై ఉంది. వననాధులు లేదా సిద్ధులు, యోగులు ఇంకా ఈ గుహల్లో, కొండ సొరంగాల్లో ఉన్నారని విశ్వసిస్తుంటారు. ఇక్కడి నీరు దీర్ఘకాల వ్యాధులను, అంగవైకల్యాలను నయం చేస్తుందని స్థానికులు నమ్ముతారు.
Photo Courtesy: Telangana Tourism
ఎలా చేరుకోవాలి??
విమానాశ్రయం
నిజామాబాద్ కి ఎటువంటి విమానాశ్రయం లేదు. ఇక్కడి నుంచి సుమారుగా 136 కి. మీ. దూరంలో నాందేడ్ దేశీయ విమానాశ్రయం కలదు. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమ్మాన సదుపాయాలు ఉన్నాయి. ఒకవేళ మీకు ఇది కుదరకపోతే నిజామాబాద్ కు 162 కి. మీ. దూరంలో హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. ఇక్కడి నుంచి కూడా దేశం లోనే కాక ప్రపంచలోని వివిధ ప్రాంతాలనుంచి కూడా విమానాలు వస్తుంటాయి.
రైల్వే స్టేషన్
నిజామాబాద్ లో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడికి దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.
రోడ్డు మార్గం
నిజామాబాద్ కి రోడ్డు సదుపాయం బాగానే ఉంది. హైదరాబాద్ నుంచి 174 కి. మీ. దూరంలోను, బీదర్ నుంచి 163 కి. మీ. దూరంలోను ఉంది. ఈ ప్రాంతం గుండా జాతీయ రహదారి వెళుతుంది. కనుక రోడ్డు మార్గం గురించి చింత అనవసరం.
Photo Courtesy: Belur Ashok